ట్రేడర్లకు అలర్ట్.. స్టాక్ మార్కెట్‌లో కొత్త టైమింగ్! | New Stock Market Timings From August 3rd, Know How The New Closing Auction Session Will Impact Trading, Read Story Inside | Sakshi
Sakshi News home page

ట్రేడర్లకు అలర్ట్.. స్టాక్ మార్కెట్‌లో కొత్త టైమింగ్!

Jul 30 2026 2:49 PM | Updated on Jul 30 2026 3:04 PM

Stock Market Timing Change

దేశీయ స్టాక్ మార్కెట్‌లో కీలక మార్పు చోటుచేసుకోనుంది. పెట్టుబడిదారులకు మరింత పారదర్శకమైన, న్యాయమైన ట్రేడింగ్ వాతావరణాన్ని కల్పించేందుకు 2026 ఆగస్టు 3 నుంచి సీఏఎస్ (Closing Auction Session) అనే కొత్త విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. ఈ విధానం వల్ల షేర్ల ముగింపు ధర మరింత ఖచ్చితంగా నిర్ణయించడం జరుగుతుంది.

ఈ కొత్త విధానం అమల్లోకి వచ్చిన తర్వాత.. మార్కెట్ ముగింపు సమయాల్లో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. F&O విభాగంలో ఉన్న షేర్ల ట్రేడింగ్ మధ్యాహ్నం 3:15 గంటలకు ముగుస్తుంది. మిగతా అన్ని ఈక్విటీ షేర్ల ట్రేడింగ్ 3:30 గంటలకు, ఇండెక్స్ అండ్ స్టాక్ F&O కాంట్రాక్టుల ట్రేడింగ్ 3:40 గంటలకు ముగుస్తుంది. అయితే మార్కెట్ ప్రారంభ సమయాల్లో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు.

ఇంట్రాడే ట్రేడింగ్ చేసే వారికి కూడా.. కొత్త ఆటో స్క్వేర్ ఆఫ్ సమయాలు అమల్లోకి వస్తాయి. సీఏఎస్ పరిధిలోని షేర్లకు 3:10 గంటలకు, సీఏఎస్ పరిధిలో లేని షేర్లకు 3:20 గంటలకు, ఇండెక్స్ అండ్ స్టాక్ ఎఫ్&ఓ కాంట్రాక్టులకు 3:25 గంటలకు ఆటో స్క్వేర్ ఆఫ్ జరుగుతుంది. కాబట్టి ఇంట్రాడే ట్రేడర్లు ఈ సమయాలను తప్పకుండా గుర్తుంచుకోవాలి.

సీఏఎస్ ఎందుకు ప్రవేశపెట్టారు? 
ప్రస్తుతం మార్కెట్ ముగింపు ధరను 'కంటిన్యూస్ ట్రేడింగ్ సెషన్'లో జరిగిన ట్రేడ్ల సగటు ధర (VWAP) ఆధారంగా నిర్ణయిస్తారు. కానీ మార్కెట్ చివరి నిమిషాల్లో పెద్ద సంస్థలు భారీగా కొనుగోలు లేదా అమ్మకాలు చేయడం వల్ల షేర్ల ధరలు ఒక్కసారిగా మారే అవకాశం ఉంటుంది. దీనివల్ల నిజమైన ముగింపు ధర ప్రతిబింబించకపోవచ్చు. ఈ సమస్యను పరిష్కరించడానికి సీఏఎస్ తీసుకురావడం జరిగింది.

సీఏఎస్ ఉపయోగాలు
జెరోధా కో-ఫౌండర్ నితిన్ కామత్ సీఏఎస్ వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని తెలిపారు. ముఖ్యంగా ఇండెక్స్ ఫండ్లు, ETFలు వంటి పెద్ద పెట్టుబడి సంస్థలు మార్కెట్ ముగింపు ధరకు అనుగుణంగా ట్రేడింగ్ చేయడం వల్ల వాటి ట్రాకింగ్ ఎర్రర్ తగ్గుతుంది. అలాగే పెద్ద ఆర్డర్ల కారణంగా మార్కెట్‌పై పడే ప్రభావం కూడా తగ్గుతుంది. అంతేకాకుండా.. మార్కెట్ ముగింపు సమయంలో ఇండెక్స్ ధరలను కృత్రిమంగా మార్చే అవకాశాలు కూడా తగ్గిపోతాయి.

ప్రపంచంలోని ప్రముఖ స్టాక్ ఎక్స్చేంజీలు అయిన న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ (NYSE), లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ (LSE) వంటి మార్కెట్లు ఇప్పటికే ఈ సీఏఎస్ విధానాన్ని అమలు చేస్తున్నాయి. ఇప్పుడు భారతదేశం కూడా అదే విధానాన్ని అనుసరిస్తోంది. దీనివల్ల మార్కెట్‌లో పారదర్శకత పెరుగుతుంది, పెద్ద పెట్టుబడిదారుల ప్రభావం తగ్గుతుంది, చిన్న పెట్టుబడిదారులకు కూడా న్యాయమైన ట్రేడింగ్ అవకాశాలు లభిస్తాయి. కాబట్టి.. సీఏఎస్ భారతీయ స్టాక్ మార్కెట్‌ను మరింత బలంగా, విశ్వసనీయంగా మార్చే ఒక మంచి ముందడుగు అని నిపుణులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement