
పంజాబ్ నేషనల్ బ్యాంక్ మోసం కేసులో ఇరుక్కున్న భారతీయ వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీకి సంబంధించిన హై ప్రొఫైల్ వివాదంలో హంగేరి మహిళ బార్బరా జబారికా పాత్ర ఉందని ఆరోపణలు వస్తున్నాయి. 2018లో భారత్ నుంచి పారిపోయిన ఛోక్సీని 2021లో జబారికా కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేసిందని, హనీ ట్రాప్, అపహరణ కుట్రలో బార్బరా కీలకంగా వ్యవహరించిందని ఛోక్సీ తెలిపారు.
చోక్సీ ఆరోపణలు..
హంగేరి మహిళ బార్బరా జబారికా తనను ఫ్రెండ్గా పరిచయం చేసుకుందని చెప్పారు. కొంతకాలం తనను నమ్మించి స్నేహం చేసిందని చోక్సీ తెలిపారు. ఒకనొక సమయంలో ఆమె తనను డిన్నర్కు ఆహ్వానించిందని, అక్కడ తనను లొంగదీసుకుని బలవంతంగా డొమినికాకు తీసుకెళ్లారని ఆయన ఆరోపించారు. తనను భారత్కు రప్పించేందుకు జరుగుతున్న భారీ కుట్రలో ఇది భాగమని ఛోక్సీ తెలిపారు. ఈ ఆరోపణలను బార్బరా తీవ్రంగా ఖండించారు. ఛోక్సీకి వ్యతిరేకంగా జరిగిన కుట్రలో తన ప్రమేయం లేదని స్పష్టం చేశారు. ఛోక్సీ తప్పుడు గుర్తింపుతో తనను పరిచయం చేసుకున్నాడని తెలిపారు. తాను హంగేరిలో రియల్ఎస్టేట్ వ్యాపారం సాగిస్తున్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి: చైనా నడ్డి విరిచేలా అమెరికా కొత్త సుంకాలు
ఇటీవల అరెస్ట్
భారత సీబీఐ అధికారుల కోరిక మేరకు ప్రముఖ వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీని ఇటీవల బెల్జియం పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలిపారు. రూ.13,500 కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్ మోసం కేసులో మెహుల్పై అభియోగాలున్నాయి. దాంతో అతడిని అప్పగించాలని భారత్ కోరింది. ఈ నేపథ్యంలోనే తనను అరెస్ట్ చేసినట్టు తెలిసింది. ఛోక్సీని తర్వలోనే భారత్కు అప్పగించే అవకాశం ఉంది. ఛోక్సీ భారత్కు రాకుండా ఉండేందుకు గతంలో విశ్వప్రయత్నాలు చేసినట్లు కొన్ని సంస్థలు తెలిపాయి. ఈమేరకు భారత్లోని ఉన్నతాధికారులకు లంచాలు కూడా ఇచ్చినట్లు గతంలో ఆరోపణలున్నాయి.