విడాకుల వివాదం.. లాయర్‌ను నియమించారు.. కానీ.. | Raymond Independent Directors Appoints Legal Counsel | Sakshi
Sakshi News home page

విడాకుల వివాదం.. లాయర్‌ను నియమించారు.. కానీ..

Dec 1 2023 8:03 PM | Updated on Dec 1 2023 8:13 PM

Raymond Independent Directors Appoints Legal Counsel - Sakshi

రేమండ్‌ కంపెనీ ప్రమోటర్‌గా ఉన్న సింఘానియా కుటుంబంలో ప్రస్తుతం అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయి. కంపెనీ ఎండీగా ఉన్న గౌతమ్‌ సింఘానియా తన భార్య నవాజ్‌మోదీతో విడిపోతున్నట్లు ప్రకటించారు.

అయితే అందుకు కంపెనీలో 75 శాతం వాటా(రూ.8 వేల కోట్లు)ను ఆమె డిమాండ్‌ చేశారు. దానిపై తాను కోర్టును ఆశ్రయించేందుకు న్యాయసలహాదారులను కూడా నియమించుకున్నారని వార్తలు వచ్చాయి. గౌతమ్‌ సింఘానియా మాత్రం ఆయన మరణం తర్వాత తన ఆస్తిని ఒక ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి దానికి చేరేలా చూడాలని కోరినట్లు సమాచారం. 

ఈ మొత్తం వ్యవహారంతో కంపెనీ డైరెక్టర్లలో స్పష్టత లోపిస్తున్నట్లు తెలిసింది. కంపెనీ బిజినెస్‌ మోడల్‌పై ఈ అంశం ఎలాంటి ప్రభావం చూపబోతుందోనని ఆందోళనలు వస్తున్నాయి. అయితే ప్రస్తుత పరిణామాల దృష్ట్యా ఇటీవల ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్‌ అడ్వైజరీ సర్వీసెస్‌(ఇయాస్‌) రేమండ్ కంపెనీని దాని ప్రమోటర్ల నుంచి రక్షించాలని స్వతంత్ర డైరెక్టర్లను  కోరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కంపెనీ బోర్డు చర్యలు ప్రారంభించింది. రేమండ్ బోర్డులోని ఇండిపెండెంట్ డైరెక్టర్లు ఈ విషయంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. గౌతమ్-నవాజ్ వైవాహిక వివాదాల మధ్య కంపెనీకి సలహా ఇవ్వడానికి స్వతంత్ర సీనియర్ న్యాయవాదిని నియమించారు. జరుగుతున్న పరిణామాలపై తాము అప్రమత్తగా ఉన్నామని, తగిన చర్యలు తీసుకుంటామని స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో పేర్కొన్నారు.

ప్రస్తుతం నెలకొన్న వైవాహిక వివాదాల నేపథ్యంలో కంపెనీ వ్యవహారాలు ప్రభావితం చెందకుండా ఉండేలా ఇండిపెండెండ్ డైరెక్టర్లు అప్రమత్తంగా ఉంటారని ఫైలింగ్‌లో చెప్పారు. ఈ విషయంలో సలహా కోసం ప్రమోటర్లతో లేదా కంపెనీతో ఎలాంటి సంబంధం లేని సీనియర్ న్యాయవాది బెర్జిస్ దేశాయ్‌ని నియమించాలని నిర్ణయించారు. కంపెనీ వాటాదారుల ప్రయోజనాలను పరిరక్షించడానికి అవసరమైన చర్యలను ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

ఇదీ చదవండి: వాట్సాప్‌ న్యూ సీక్రెట్‌ ఫీచర్‌.. ఎలా సెట్‌ చేయాలంటే?

జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో రేమండ్ నికర లాభం స్వల్పంగా పెరిగి రూ.159.78 కోట్లుగా నమోదైంది. కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం ఏడాది ప్రాతిపదికన 4 శాతం పెరిగి రూ.2,168.2 కోట్ల నుంచి రూ.2,168.2 కోట్లకు చేరుకుంది. పండగలు, వివాహాల సీజన్ ప్రారంభం కావడంతో వినియోగదారుల నుంచి డిమాండ్‌ పెరిగిందని ఫలితాల సమయంలో సింఘానియా ప్రకటించారు.

Advertisement
 
Advertisement
Advertisement