పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ ముడి చమురు ధరలు భారీగా పెరగడంతో ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు (OMCs) తీవ్ర ఆర్థిక భారం ఎదుర్కొన్నాయి. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీని వినియోగదారులకు తక్కువ ధరలకు విక్రయించడం వల్ల జూన్ 30 నాటికి ఆయా చమురు మార్కెటింగ్ సంస్థలకు మొత్తం రూ.74,781 కోట్ల నష్టం వాటిల్లిందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు.
మీడియాతో మాట్లాడిన ఆయన, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఇటీవల తగ్గుముఖం పట్టినా, ప్రస్తుతం రిఫైనరీల్లో ప్రాసెస్ చేస్తున్న చమురు రెండు నెలల క్రితం అధిక ధరలకు కొనుగోలు చేసినదేనని వివరించారు. సాధారణంగా చమురు సంస్థలు కనీసం రెండు నెలల ముందుగానే క్రూడ్ ఆయిల్ను కొనుగోలు చేస్తాయని, ప్రస్తుతం వినియోగంలో ఉన్న నిల్వలు ఏప్రిల్–మే నెలల్లో ధరలు అత్యధికంగా ఉన్న సమయంలో సేకరించినవేనని చెప్పారు.
ఇదీ చదవండి: ఈవీ ఛార్జింగ్కు సగం ఇళ్లు సిద్ధంగా లేవు!
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?
పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై స్పందించిన మంత్రి, ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధరలు మరికొన్ని వారాలు స్థిరంగా తక్కువ స్థాయిలో కొనసాగితేనే ధరల సమీక్షపై ఆలోచించవచ్చని స్పష్టం చేశారు. ప్రస్తుతం చమురు ధరలు తగ్గినా, పాత అధిక ధరల నిల్వలు పూర్తిగా వినియోగమైన తర్వాతే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సంకేతమిచ్చారు.
భారత్లో పరిమిత పెరుగుదలే..
పశ్చిమాసియా సంక్షోభం సమయంలో అభివృద్ధి చెందిన దేశాల్లో పెట్రోల్ ధరలు సగటున సుమారు 20 శాతం, భారత్కు పొరుగు దేశాల్లో దాదాపు 35 శాతం వరకు పెరిగాయని పూరి తెలిపారు. అయితే భారతదేశంలో పెట్రోల్ ధరల పెరుగుదల కేవలం 5.58 శాతానికి మాత్రమే పరిమితమైందని, అదనపు భారాన్ని చమురు సంస్థలే భరించాయని పేర్కొన్నారు. అలాగే దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 1.07 లక్షల ఇంధన విక్రయ కేంద్రాల్లో ఎక్కడా సరఫరా అంతరాయం లేకుండా ఇంధనం అందించగలిగామని చెప్పారు.
నయారా ధరల తగ్గింపుపై వివరణ
ప్రైవేట్ ఇంధన విక్రయ సంస్థ నయారా ఎనర్జీ జూలై 1 నుంచి పెట్రోల్పై లీటరుకు రూ.5, డీజిల్పై రూ.3 తగ్గించడం గురించి కూడా మంత్రి స్పందించారు. సంక్షోభ సమయంలో నయారా తన ధరలను ముందుగానే పెంచిందని, ఇప్పుడు ఆ పెంపును మాత్రమే వెనక్కి తీసుకుందని చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థలు ఆ సమయంలో వినియోగదారులపై పూర్తి భారం మోపకుండా ధరలను నియంత్రించాయని ఆయన పేర్కొన్నారు.
చమురు ధరలే కీలకం
ఇరాన్కు సంబంధించిన ఉద్రిక్తతల సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు బ్యారెల్కు 110 డాలర్లకు పైగా చేరడంతో ప్రభుత్వ రంగ చమురు సంస్థలు భారీ అండర్రికవరీని భరించాల్సి వచ్చింది. అనంతరం అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు సడలడంతో జూన్ ద్వితీయార్ధం నుంచి ముడి చమురు ధరలు తగ్గడం ప్రారంభమైంది. అయితే ఈ తగ్గుదల ప్రభావం దేశీయ ఇంధన ధరల్లోనూ ప్రతిబింబించాలంటే మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని చమురు రంగ వర్గాలు భావిస్తున్నాయి.
ఇది చదివారా? పొల్యూషన్ సర్టిఫికెట్పై వాహనదారులకు ఊరట!


