ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ఉత్తరాఖండ్లోని ప్రసిద్ధ హిమాలయ పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్, కేదార్నాథ్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఉభయ క్షేత్రాల అభివృద్ధి, నిర్వహణ కోసం రూ.10 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. శతాబ్దాల నాటి ఈ ఆధ్యాత్మిక కేంద్రాల పట్ల తనకున్న భక్తిని చాటుకుంటూ ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కట్టుదిట్టమైన భద్రత
ఉదయం 10:00 గంటలకు ముఖేష్ అంబానీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ బద్రీనాథ్ హెలిప్యాడ్కు చేరుకుంది. ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) సిబ్బంది కట్టుదిట్టమైన భద్రతా వలయం నడుమ ఆయన ఆలయానికి చేరుకున్నారు. ఆలయానికి చేరుకున్న అంబానీ దాదాపు 20 నిమిషాల పాటు బద్రి విశాల్ భగవానుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సుమారు 10 నిమిషాల పాటు సాంప్రదాయ ఆచారాలను నిర్వహించారు.
కమిటీతో భేటీ - విరాళం
పూజా కార్యక్రమాల అనంతరం బద్రీనాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీ (బీకేటీసీ) అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రెండు పుణ్యక్షేత్రాల మౌలిక వసతులు, అభివృద్ధి, నిర్వహణ పనుల నిమిత్తం రూ.10 కోట్ల విరాళాన్ని అందజేశారు. ఉదయం 10:40 గంటలకు బద్రీనాథ్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 11:15 గంటలకు కేదార్నాథ్ చేరుకున్నారు. అక్కడ కేదార్నాథ్ జ్యోతిర్లింగానికి జలాభిషేకం చేసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.
జై శ్రీరామ్ నినాదాలతో..
కేదార్నాథ్ ఆలయ ప్రాంగణంలో అంబానీని చూసిన భక్తులు పెద్ద ఎత్తున జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. అంబానీ చేతులు జోడించి నమస్కరిస్తూ భక్తులను పలకరించారు. పర్యటన ముగిసిన అనంతరం ఆయన మధ్యాహ్నం తిరుగుపయనమయ్యారు.
ఇదీ చదవండి: డబ్బుతో కొనలేని ‘జన్మ’బంధం


