సోషల్ మీడియా దిగ్గజం మెటా (ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్) ఒక పెద్ద వివాదంలో చిక్కుకుంది. కంపెనీకి ఉన్న సొంత కమ్యూనిటీ నిబంధనలను ఉల్లంఘిస్తూ ద్వేషాన్ని పెంచేలా ఉండే వివాదాస్పద పోస్టులకు కూడా ప్రకటనల ద్వారా ఆదాయాన్ని (యాడ్ మనీ) చెల్లిస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ కారణంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలు, నియంత్రణ సంస్థలు ఇప్పుడు మెటా చర్యలపై తీవ్రంగా నిఘా పెట్టాయి.
ఇన్వెస్టర్లలో ఆందోళన
కంపెనీ అమలు చేస్తున్న పెర్ఫార్మెన్స్-బేస్డ్ మోనెటైజేషన్ విధానం వ్యూస్, వాచ్టైమ్ ఆధారంగా క్రియేటర్లకు నిధులు కేటాయిస్తోంది. ఈ క్రమంలో నాజీయిజం, అహంకారం, వ్యాక్సిన్ వ్యతిరేక ప్రచారాలకు సంబంధించిన పోస్టులకు కూడా ప్రకటనల ఆదాయం మళ్లుతుండటం ఇన్వెస్టర్లలో ఆందోళన కలిగిస్తోంది. కంటెంట్ మోడరేషన్ ప్రమాణాలకు, ఇన్కమ్ పంపిణీ మోడల్కు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఇది బయటపెడుతోంది.
సాంకేతిక వైఫల్యాలు
భారత్లోనూ మెటా తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటోంది. అక్రమ పెయిడ్ కంటెంట్ను ప్రచారం చేయడం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియోపై పొరపాటున పరిమితులు విధించడం.. వంటి సాంకేతిక వైఫల్యాలపై కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో మెటా ప్రతినిధులు ఇటీవలే అత్యున్నత స్థాయి భేటీ నిర్వహించారు. ఇటువంటి వరుస లోపాల వల్ల ప్లాట్ఫామ్లకు లభించే చట్టబద్ధ రక్షణ హోదా ముప్పులో పడే అవకాశముంది.
మరోవైపు, పిల్లల మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిన కేసులో అమెరికా కోర్టు మెటాకు 567 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.4,750 కోట్లు) భారీ జరిమానా విధించింది. దీనికి తోడు కృత్రిమ మేధ మౌలిక వసతులకై మెటా బిలియన్ల కొద్దీ డాలర్లను వెచ్చిస్తుండటంతో కంపెనీ ఆపరేటింగ్ మార్జిన్లు, ఫ్రీ క్యాష్ ఫ్లోపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. ద్వేషపూరిత కంటెంట్కు చెక్ పెడుతూ యూజర్ ఎంగేజ్మెంట్ను కాపాడుకునేలా తన ఆల్గోరిథమ్లను సవరించకపోతే రాబోయే రోజుల్లో నియంత్రణ చర్యలు మరింత కఠినతరమై, మార్కెట్లో వాటాదారుల నమ్మకం దెబ్బతినే ప్రమాదముంది.
ఇదీ చదవండి: పిల్లలను కనట్లేదు! గ్లోబల్ ఫెర్టిలిటీ పతనం


