
తమిళనాడుకు చెందిన ప్రముఖ జువెలరీ రిటైలర్ లలితా జ్యువెలరీ మార్ట్ క్యాపిటల్ మార్కెట్లలోకి అడుగు పెడుతోంది. ఐపీవో ద్వారా నిధుల సమీకరణకు వస్తోంది. ఈమేరకు సెబీకి ప్రాథమిక పత్రాలు సమర్పించింది. ఈ ఐపీవోలో భాగంగా ఫ్రెష్ ఈక్విటీ షేర్ల కింద రూ.1,200 కోట్ల విలువైన షేర్లను, ఆఫర్ ఫర్ సేల్ కింద రూ.500 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్ కిరణ్ కుమార్ జైన్ జారీ చేయనున్నారు.
1985లో ఏర్పాటైన లలితా జ్యువెల్లరీ తాజా ఇష్యూ ద్వారా వచ్చే రూ.1,014.5 కోట్లను భారత్ లో 12 కొత్త స్టోర్ల ఏర్పాటుకు, మిగిలిన మొత్తాన్ని సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించాలని యోచిస్తోంది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలోని 46 నగరాల్లోని 56 స్టోర్ల ద్వారా ఆభరణాల ఉత్పత్తులను ఈ సంస్థ విక్రయిస్తోంది.
లలితా జ్యువెల్లరీ 2024 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ.359.8 కోట్ల లాభాన్ని ఆర్జించింది. అలాగే ఆదాయం 26 శాతం పెరిగి రూ.16,788 కోట్లకు చేరింది. 2024 డిసెంబర్తో ముగిసిన తొమ్మిది నెలల కాలానికి రూ.262.3 కోట్ల లాభం, రూ.12,594.7 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. లలితా జ్యువెలరీ మార్ట్ ఐపీఓకు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్ గా ఆనంద్ రాఠీ అడ్వైజర్స్, ఎక్విరస్ క్యాపిటల్ను నియమించారు.