అమ్మకాలు 'అక్షయం'! | Jewellery sales across the country on the occasion of Akshaya Tritiya | Sakshi
Sakshi News home page

అమ్మకాలు 'అక్షయం'!

May 1 2025 3:00 AM | Updated on May 1 2025 7:55 AM

Jewellery sales across the country on the occasion of Akshaya Tritiya

అక్షయ తృతీయ.. జోరుగా కొనుగోళ్లు! 

విలువ పరంగా విక్రయాల్లో 35 శాతం వృద్ధి 

మంగళసూత్రాలు, చైన్‌లు, కాయిన్లకు గిరాకీ 

దక్షిణాదిన అధిక డిమాండ్‌ 

న్యూఢిల్లీ: అక్షయ తృతీయ సందర్భంగా దేశవ్యాప్తంగా ఆభరణాల విక్రయాలు సానుకూలంగా నమోదైనట్లు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. బంగారం, వెండి ధరలు గరిష్ట స్థాయిలో ఉన్నప్పటికీ అక్షయ తృతీయ రోజున పసిడి కొంటే కలిసొస్తుందన్న విశ్వాసం అమ్మకాలకు అండగా నిలిచింది. విలువ పరంగా 35 శాతం అధిక అమ్మకాలు ఉంటాయని ఆల్‌ ఇండియా జెమ్‌ అండ్‌ జ్యుయలరీ డొమెస్టిక్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ రాజేష్‌ రోక్డే తెలిపారు. పరిమాణం పరంగా గతేడాది మాదిరే 20 టన్నులుగా ఉండొచ్చని పేర్కొన్నారు. మరోపక్క, బుధవారం బంగారం, వెండి ధరలు కాస్త శాంతించడం కూడా కలిసొచ్చింది. 

దక్షిణాదిన జ్యుయలరీ దుకాణాలకు ఉదయం నుంచే వినియోగదారులు క్యూకట్టారు. ఉత్తరాదిన మధ్యాహ్నం నుంచి వినియోగదారులు రావడం పెరిగింది. అయినప్పటికీ దక్షిణ భారత్‌లోనే కస్టమర్ల రాక అధికంగా ఉన్నట్టు సమాచారం. ముఖ్యంగా మంగళ సూత్రాలు, చైన్‌లు, వెండి ఉత్పత్తుల కొనుగోళ్లు పెరిగినట్టు వర్తకులు తెలిపారు. వివాహాల సీజన్‌ ఆరంభం కావడంతో మంగళసూత్రాల కొనుగోలుకు కస్టమర్లు ఆసక్తి చూపించినట్టు చెప్పారు. అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలు ధోరణి సాధారణంగా దక్షిణాదిన కనిపించేది. క్రమంగా ఇది ఉత్తరాదికీ విస్తరించినట్టు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. 

25–40 ఏళ్ల వయసులోని కస్టమర్లు సైతం బంగారం కొనుగోళ్లకు ముందుకొచ్చినట్టు రోక్డే తెలిపారు. ముఖ్యంగా ఆభరణాలు, కాయిన్లు, బార్లు కొనుగోలుకు ఆసక్తి చూపించినట్టు చెప్పారు. ‘‘ధరల పెరుగుదలతో కొనుగోలు శక్తిపై ప్రభావం పడింది. అయినప్పటికీ అక్షయ తృతీయ రోజున బలమైన కొనుగోళ్ల సెంటిమెంట్‌ ఉంది’’ అని వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ ఇండియా సీఈవో సచిన్‌ జైన్‌ తెలిపారు. 2024 అక్షయ తృతీయ రోజున రూ.72,300గా ఉన్న 24 క్యారెట్ల పసిడి ధర ఇటీవలే రూ. లక్ష స్థాయిని అధిగమించి... ప్రస్తుతం 99,000 స్థాయిలో ఉంది. అంటే దాదాపు 37 శాతం ఎగసింది. 

పాత ఆభరణాల మార్పిడి.. 
అక్షయ తృతీయ రోజున అమ్మకాల్లో 50 శాతం మేర పాత బంగారం మార్పిడితోనే ఉన్నట్టు పీఎన్‌జీ జ్యుయలర్స్‌ చైర్మన్‌ సౌరభ్‌ గాడ్గిల్‌ తెలిపారు. ధరల పెరుగుదలతో వినియోగదారులు బడ్జెట్‌ నియంత్రణకు ప్రాధాన్యం ఇచ్చినట్టు చెప్పారు. మొత్తం మీద గతేడాది అక్షయ తృతీయతో పోల్చి చూస్తే అమ్మకాలు 10–15 శాతం పెరిగాయని కామా జ్యుయలర్స్‌ ఎండీ కొలిన్‌షా తెలిపారు. దేశవ్యాప్తంగా కీలక మార్కెట్లలో స్టడెడ్‌ జ్యుయలరీ అమ్మకాలు పెరిగినట్టు జీఎస్‌ఐ ఇండియా ఎండీ రమిత్‌ కపూర్‌ వెల్లడించారు.

దిగొచ్చిన బంగారం ధర 
అక్షయ తృతీయ రోజున బంగారం ధరలు తగ్గడం కొనుగోలుదారులకు కలిసొచ్చింది. ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాములకు (99.9 శాతం స్వచ్ఛత) రూ.900 తగ్గి రూ.98,550 వద్ద స్థిరపడింది.  అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్‌ గోల్డ్‌ ఔన్స్‌కు ఒకదశలో 43 డాలర్ల వరకు క్షీణించి 3,274 డాలర్లను తాకింది. 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆటో టారిఫ్‌ల ప్రభావం తగ్గించే దిశగా ఆదేశాలు జారీ చేయడం.. పలు దేశాలతో వాణిజ్య ఒప్పందాలకు సంబంధించి చర్చల్లో పురోగతి ఉందని ప్రకటించడం బంగారం ధరలు తగ్గేందుకు కారణమైనట్టు కోటక్‌ సెక్యూరిటీస్‌ కమోడిటీ రీసెర్చ్‌ అసిస్టెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కేనత్‌ చైన్‌వాలా తెలిపారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement