ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) సేవల సంస్థల ఆదాయాలు ఒక మోస్తరు స్థాయికి పరిమితం కావచ్చని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (ఎంవోఎస్ఎల్) ఒక నివేదికలో పేర్కొంది. స్థూల పరిస్థితులు, కృత్రిమ మేథ (ఏఐ), భౌగోళిక రాజకీయాంశాలు క్లయింట్ల డిస్క్రెషనరీ వ్యయాలపైనా, అవి తీసుకునే నిర్ణయాలపైనా ప్రభావం చూపుతుండటం ఇందుకు కారణాలు కాగలవని వివరించింది.
క్లయింట్లు నెమ్మదిగా నిర్ణయాలు తీసుకుంటూ ఉండటం, ఆచితూచి ఖర్చు చేస్తుండటంలాంటి పరిణామాలు ఎదురవుతున్నాయంటూ యాక్సెంచర్ ఇటీవల పేర్కొనడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తుందని ఎంవోఎస్ఎల్ వివరించింది. క్యూ1 పనితీరు ముందుగా అంచనా వేసిన దానికన్నా తక్కువగా ఉండొచ్చని భావిస్తున్నట్లు కేపీఐటీ టెక్నాలజీస్ సైతం వెల్లడించిన నేపథ్యంలో ఎంవోఎస్ఎల్ నివేదిక ప్రాధాన్యం సంతరించుకుంది. వివిధ కారణాలరీత్యా క్యూ1లో డిమాండ్ నెమ్మదించి ఉంటుందని అంచనా వేస్తున్నట్లు రిపోర్టు పేర్కొంది. రెండో త్రైమాసికం కూడా అదే విధంగా ప్రారంభం కావొచ్చని వివరించింది. క్యూ1లో ఐటీ కంపెనీలు తామిచ్చిన గైడెన్స్ గరిష్ట స్థాయిని కుదించవచ్చని నివేదిక వివరించింది.
ఇదీ చదవండి: వాట్సాప్ యూజర్నేమ్ వ్యవహారం.. కేంద్రం నోటీసులు
హెచ్సీఎల్టీ వృద్ధి గైడెన్స్ని 100 బేసిస్ పాయింట్ల మేర కుదించవచ్చు. ఇన్ఫోసిస్ 50 బేసిస్ పాయింట్లు తగ్గించి 1.5–3 శాతానికి పరిమితం చేయొచ్చు.
త్రైమాసికాలవారీగా స్థిర కరెన్సీ ప్రాతిపదికన లార్జ్ క్యాప్ సంస్థల వృద్ధి 2 శాతం వరకు ఉండొచ్చు, మిడ్–క్యాప్స్ మళ్లీ రాణించి, 4.8 శాతం వరకు వృద్ధి నమోదు చేయొచ్చు.
వివిధ విభాగాలవారీగా చూస్తే మెరుగైన డీల్స్ దన్నుతో బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా (బీఎఫ్ఎస్ఐ) పటిష్టంగా ఉంటోంది. హై–టెక్ విభాగం మిశ్రమంగా కనిపిస్తోంది.
ఇది చదివారా? ఐటీ కంపెనీలు కనుమరుగవుతాయా?


