యువర్స్
ప్రతిరోజు మనం గమనించే విషయాల్లో అనేక సమస్యలు తారసపడతాయి. తార్కికంగా చూసే లక్షణం ఉండాలే గాని ప్రతి సమస్యకీ పరిష్కారం దొరకుతుంది. అలా పరిష్కారం చూపగలిగే ప్రతిపాదనే ఓ స్టార్టప్కి మూలమవుతుంది.
ఢిల్లీలోని సీఎన్జీ పెట్రోల్ బంకుల వద్ద వాహనాలు గంటల తరబడి క్యూలో నిలబడడం చూసిన ఓ యువ ఇంజినీర్ వైభవ్ కౌశిక్కు కూడా అలాంటి ఆలోచనే వచ్చింది. ఎక్కడ రద్దీ ఉంది? ఏ బంక్లో త్వరగా ఇంధనం నింపుకోవచ్చు.. అనే చిన్న విషయానికి పరిష్కారం చూపాలన్న చిన్న ఉద్దేశమే వైభవ్ను ‘నాగాటి’ అనే స్టార్టప్ను ప్రారంభించేలా చేసింది.
తొలుత ఇది కేవలం సీఎన్జీ స్టేషన్లలో రద్దీని చూపించే డిజిటల్ ప్లాట్ ఫామ్లా ప్రారంభమైనా, నేడు అది ఏఐ ఆధారిత మొబిలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీగా ఎదిగింది. రియల్ టైం డేటా ఆధారంగా వినియోగదారులకు తక్కువ రద్దీ ఉన్న స్టేషన్లను సూచించడం, ఇంధన సరఫరా సంస్థలకు డిమాండ్ అంచనాలు ఇవ్వడం, స్టేషన్ నిర్వహణను మరింత సమర్ధవంతంగా మార్చడం వంటి సేవలను అందిస్తోంది.
ప్రస్తుతం ఈ సంస్థకు 30 లక్షల మంది పైగానే వినియోగదారులున్నారు. నాగాటి ప్రయాణం ఇక్కడితో ఆగలేదు..భారత ప్రభుత్వ చమురు మార్కెటింగ్ సంస్థలతో కలిసి పని చేస్తున్న ఈ స్టార్టప్ ఇప్పటికే 2.5 మిలియన్ డాలర్ల పెట్టుబడులను సమీకరించుకుంది. అంతర్జాతీయంగా యునైటెడ్ అరబ్ ఎమిరేడ్స్ (యుఏఈ) మార్కెట్లోకి కూడా అడుగుపెట్టి అక్కడ మొబిలిటీ వ్యవస్థలను కూడా తన సాంకేతిక పరిష్కారాలను అందించేందుకు సిద్ధమవుతోంది.
2019లో గ్రేటర్ నోయిడాలో ఇంటర్న్షిప్ చేస్తున్న సమయంలో వైభవ్ ప్రతిరోజూ ఓలా, ఉబర్ క్యాబ్లలో ప్రయాణించేవాడు. ఆ సమయంలో సీఎన్జీ బంక్ల వద్ద భారీ క్యూలు కనిపించేవి. ఒక క్యాబ్ డ్రైవర్ చెప్పిన మాట వైభవ్ ఆలోచనని పూర్తిగా మార్చివేసింది. ‘రోజుకు దాదాపు గంట టైం క్యూలోనే వృథా అవుతోంది’.. ఈ ఒక్క మాటే ‘నాగాటి’ సంస్థకి నాంది పలికేలా చేసింది. స్టార్టప్ కోసం గొప్ప ఆవిష్కరణ అవసరం లేదు. ప్రతిరోజూ మనం ఎదుర్కొనే చిన్న సమస్యను గమనించి, దానికి సులభమైన పరిష్కారం చూపగలిగితే అదే పెద్ద వ్యాపార అవకాశంగా మారుతుంది.


