యూపీఐ లావాదేవీలపై త్వరలో ఛార్జీలు? | govt considering reintroducing MDR charges on UPI transactions | Sakshi
Sakshi News home page

యూపీఐ లావాదేవీలపై త్వరలో ఛార్జీలు?

Jun 11 2025 12:57 PM | Updated on Jun 11 2025 3:44 PM

govt considering reintroducing MDR charges on UPI transactions

ఆన్‌లైన్‌ లావాదేవీలకు సంబంధించిన మౌలిక సదుపాయాలు, ఖర్చులను నిర్వహించడంలో బ్యాంకులు, పేమెంట్‌ సర్వీస్ ప్రొవైడర్లకు మద్దతుగా నిలిచేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా రూ.3,000 కంటే ఎక్కువ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేటు(ఎండీఆర్‌)ను తిరిగి ప్రవేశపెట్టాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది. మర్చంట్ టర్నోవర్‌తో సంబంధం లేకుండా లావాదేవీ విలువ ఆధారంగా ఎండీఆర్‌ను వసూలు చేయాలనేలా చర్చలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.

అధిక విలువ కలిగిన డిజిటల్ లావాదేవీల నిర్వహణ వ్యయం పెరగడంపై బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘తక్కువ పరిమాణంలో యూపీఐ చెల్లింపులకు ప్రస్తుతం ఛార్జీల నుంచి మినహాయింపు ఉన్నప్పటికీ పెద్ద లావాదేవీలపై త్వరలో మర్చంట్ ఫీజును వసూలు చేసే అవకాశం ఉంది. జనవరి 2020 నుంచి అమలులో ఉన్న జీరో-ఎండీఆర్ విధానానికి బదులుగా రూ.3,000 కంటే ఎక్కువ చేసే యూపీఐ లావాదేవీలపై ఛార్జీలను తిరిగి ప్రవేశపెట్టాలని భారత ప్రభుత్వం ఆలోచిస్తోంది’ అని కొందరు అధికారులు తెలిపారు.

రిటైల్ డిజిటల్ లావాదేవీల్లో యూపీఐ వాటా 80 శాతంగా ఉంది. కానీ జీరో మర్చంట్ డిస్కౌంట్ రేటు విధానంతో ఈ రంగంలో మరిన్ని పెట్టుబడులకు పరిమిత ప్రోత్సాహకాలు ఉన్నాయి. పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ లావాదేవీల కోసం పెద్ద వ్యాపారులపై 0.3 శాతం మర్చంట్ డిస్కౌంట్ రేటును ప్రతిపాదించింది. ప్రస్తుతం రూపే మినహా క్రెడిట్, డెబిట్ కార్డు చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేటు 0.9 శాతం నుంచి 2 శాతం వరకు ఉంది.

బ్యాంకులు, ఫిన్‌టెక్‌ సంస్థలు, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐ) సహా ఇతర వర్గాలతో సంప్రదింపులు జరిపి ఒకటి లేదా రెండు నెలల్లో యూపీఐ చెల్లింపుల ఛార్జీలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: ఎన్ఆర్ఐలకు భారత్‌లో ఐటీ నోటీసులు!

మర్చంట్ డిస్కౌంట్ రేటు అంటే..

మర్చంట్ డిస్కౌంట్ రేటు (ఎండిఆర్) అనేది డిజిటల్ లావాదేవీలను ప్రాసెస్ చేయడానికి వ్యాపారులు బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లకు చెల్లించే రుసుము. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, డిజిటల్ వాలెట్ చెల్లింపులకు ఇది వర్తిస్తుంది. దేశంలో ప్రస్తుతం ఎండీఆర్ రేట్లు చిన్న వ్యాపారులకు (టర్నోవర్ రూ.20 లక్షల వరకు) ఫిజికల్ పీఓఎస్, ఆన్‌లైన్‌ లావాదేవీలపై 0.40% (ప్రతి లావాదేవీకి రూ.200కు పరిమితం)గా ఉంది. క్యూఆర్ కోడ్ ఆధారిత లావాదేవీలపై 0.30% (ప్రతి లావాదేవీకి రూ.200 పరిమితి)గా ఉంది. పెద్ద వ్యాపారులు (టర్నోవర్ రూ.20 లక్షలు దాటితే) ఫిజికల్ పీఓఎస్, ఆన్‌లైన్‌ లావాదేవీలపై 0.90% (ప్రతి లావాదేవీకి రూ.1,000 పరిమితి), క్యూఆర్ కోడ్ ఆధారిత లావాదేవీలపై 0.80% (ప్రతి లావాదేవీకి రూ.1,000 పరిమితి) ఛార్జీలున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement