ఆ భయం నాకూ ఉంది: AIపై ఆంథ్రోపిక్ సీఈఓ ఆందోళన | Anthropic CEO Warns AI Could Go Wrong Government Block Dangerous AI Models | Sakshi
Sakshi News home page

ఆ భయం నాకూ ఉంది: AIపై ఆంథ్రోపిక్ సీఈఓ ఆందోళన

Jun 11 2026 6:53 PM | Updated on Jun 11 2026 7:13 PM

Anthropic CEO Warns AI Could Go Wrong Government Block Dangerous AI Models

కృత్రిమ మేధస్సు (AI) అభివృద్ధి మానవ సమాజానికి అపార అవకాశాలు తెస్తున్నప్పటికీ, అదే సమయంలో తీవ్రమైన ప్రమాదాలకు కూడా దారితీయవచ్చని ప్రముఖ ఏఐ సంస్థ ఆంథ్రోపిక్ (Anthropic) సహ వ్యవస్థాపకుడు, సీఈఓ డారియో అమోడేయి (Dario Amodei) హెచ్చరించారు. “ఏదో ఒక సమయంలో ఏదైనా తప్పు జరిగే అవకాశం ఉందనే ఆందోళన నాకూ ఉంది” అంటూ ఆయన తాజా బ్లూమ్‌బర్గ్ డాక్యుమెంటరీలో వ్యాఖ్యానించారు.

ఏఐ భద్రత అంశంపై చాలా కాలంగా గళం విప్పుతున్న అమోడేయి, ప్రపంచవ్యాప్తంగా ఏఐ సామర్థ్యాలు ప్రభుత్వాల నియంత్రణ సామర్థ్యాన్ని మించిపోయే వేగంతో అభివృద్ధి చెందుతున్నాయని పేర్కొన్నారు. అమెరికాలో నిర్వహించిన సర్వేల ప్రకారం, సగానికి పైగా ప్రజలు ఏఐ కారణంగా ఉద్యోగ అవకాశాలు దెబ్బతింటాయని భావిస్తున్నారు.

“స్వచ్ఛంద నియంత్రణ సరిపోదు”

ఏఐ కంపెనీలు స్వయంగా భద్రతా ప్రమాణాలు పాటిస్తామని చెప్పడం మాత్రమే ఇక సరిపోదని అమోడేయి అభిప్రాయపడ్డారు. తాజాగా విడుదల చేసిన తన విధాన వ్యాసంలో, అత్యాధునిక “ఫ్రంటియర్ ఏఐ” మోడళ్లను విడుదల చేసే ముందు తప్పనిసరిగా స్వతంత్ర థర్డ్‌ పార్టీ సంస్థల ద్వారా పరీక్షించాలని సూచించారు. ముఖ్యంగా సైబర్ దాడులు, జీవాయుధాల అభివృద్ధి, మానవ నియంత్రణను దాటిపోయే స్వయంప్రతిపత్తి వంటి ప్రమాదాలను అంచనా వేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ పరీక్షల్లో మోడళ్లు విఫలమైతే, వాటి విడుదలను నిలిపివేసే లేదా పూర్తిగా నిరోధించే అధికారం ప్రభుత్వాలకు ఉండాలని ఆయన వాదించారు.

ఓపెన్‌ఏఐతో విభేదాలూ ఇందుకే..

ఒకప్పుడు ఓపెన్‌ఏఐ (OpenAI)లో కీలక పరిశోధకుడిగా పనిచేసిన అమోడేయి, ఏఐ భద్రత అంశాలపై విభేదాల కారణంగా సంస్థను విడిచి ఆంథ్రోపిక్‌ను స్థాపించారు. వాణిజ్య ప్రయోజనాలు, వేగవంతమైన ఉత్పత్తి విడుదల కంటే భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నది ఆయన వైఖరి. ఇదే సమయంలో ఓపెన్‌ఏఐ కూడా ఏఐ రిస్క్‌లపై తామూ స్పష్టమైన అవగాహనతో ఉన్నామని, “ప్రతిదీ పూర్తిగా ఆటోమేట్ కావడం మాకు కావలసిన భవిష్యత్తు కాదు” అని ఇటీవల వెల్లడించింది. ఏఐ వల్ల భారీ ఉత్పాదకత పెరుగుదల సాధ్యమైనప్పటికీ, ఉద్యోగాలపై దాని ప్రభావం, సామాజిక పరిణామాలను నిర్లక్ష్యం చేయరాదని పరిశ్రమ నాయకులు అంగీకరిస్తున్నారు.

భారత్‌లోనూ నియంత్రణ ఆలోచన

ఏఐ నియంత్రణపై ప్రపంచవ్యాప్తంగా చర్చలు వేగంగా జరుగుతున్న వేళ, భారత్‌ కూడా ప్రత్యేక చట్టపరమైన వ్యవస్థ అవసరాన్ని గుర్తిస్తోంది. కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ (Ashwini Vaishnaw) ఇటీవల మాట్లాడుతూ, 2000 నాటి ఐటీ చట్టం ఆధునిక ఏఐ యుగానికి సరిపోదని, ఆవిష్కరణకు ప్రోత్సాహం ఇస్తూనే పౌరుల భద్రతను కాపాడే కొత్త విధానాలు అవసరమని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: ‘ఆ బంగారం, వెండి.. నకిలీ ఆస్తులు’

Advertisement
 
Advertisement
Advertisement