దేశీయ టెక్నాలజీ రంగంలో ఉద్యోగ అవకాశాలు మెరుగవుతున్నప్పటికీ ఐటీ కంపెనీలు కొత్తగా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులను (ఫ్రెషర్లు) చేర్చుకునే విషయంలో తమ వ్యూహాన్ని మార్చుకున్నాయి. ప్రముఖ జాబ్ పోర్టల్ ‘ఫౌండ్ఇట్’ వెల్లడించిన నివేదిక ప్రకారం ఓవైపు టెక్ రిక్రూట్మెంట్ డిమాండ్ ఏటా 10 శాతం మేర వృద్ధి నమోదు చేయగా, మరోవైపు సంప్రదాయ ఐటీ పరిశ్రమలో ఫ్రెషర్ల నియామకాల వాటా ఇదివరకు ఉన్న 32 శాతం నుంచి 24 శాతానికి క్షీణించింది. ఒక రకంగా ఎంట్రీ-లెవెల్ ఐటీ ఉద్యోగాల్లో దాదాపు పావు వంతు (25%) కోత పడింది.
ఈ క్షీణతకు ప్రధానంగా రెండు ముఖ్యమైన కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది ఆటోమేషన్, కృత్రిమ మేధ విస్తరణ. ఇదివరకు ఫ్రెషర్లు చేసే ప్రాథమిక కోడింగ్, టెస్టింగ్ పనులను ఇప్పుడు ఏఐ సాధనాలు సులభంగా పూర్తి చేస్తున్నాయి. ప్రైమరీ ఏఐ మోడళ్లను తయారు చేయడం కంటే ఆ సిస్టమ్స్ను నడిపించే, ఆప్టిమైజ్ చేసే నైపుణ్యాల వైపే కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి. రెండవది బ్యాంకింగ్, హెల్త్కేర్, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు వంటి నాన్-ఐటీ రంగాలు టెక్ గ్రాడ్యుయేట్లను భారీగా ఆకర్షిస్తున్నాయి. దీనివల్ల సాధారణ ఐటీ సేవల్లో ఎంట్రీ-లెవెల్ ఆఫర్లు తగ్గాయి.
ప్రస్తుత మార్కెట్లో సంస్థలు 7-10 సంవత్సరాల అనుభవం ఉన్న నిపుణులకే అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నాయి (ఈ విభాగంలో వార్షికంగా 11 శాతం వృద్ధి నమోదైంది). ఇలాంటి పరిస్థితుల్లో టెక్ రంగంలో స్థిరపడాలనుకునే అభ్యర్థులు కేవలం సంప్రదాయ కోడింగ్కే పరిమితం కాకుండా ఏఐ, డేటా సైన్స్, క్లౌడ్ ప్లాట్ఫామ్ల్లో ఆచరణాత్మక నైపుణ్యాలు పెంపొందించుకోవడం అత్యవసరంగా మారింది.
ఇదీ చదవండి: మీ EPF డబ్బు సురక్షితంగా ఉండాలా?


