ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వ్యవస్థల వల్ల మానవాళికి వినాశనం ఎదురవుతుందంటూ జరుగుతున్న ప్రచారాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఖండించారు. ఏఐ నియంత్రణ, దానికి సంబంధించిన భయాలు కేవలం ఒక ‘అభూతకల్పన (హోక్స్)’ మాత్రమేనని తేల్చిచెప్పారు.
లాస్ ఏంజెలెస్లో జరిగిన ‘ఆల్-ఇన్ సమిట్’ లైవ్ ప్యానెల్లో ప్రపంచంలోనే అత్యంత విలువైన ఏఐ చిప్ తయారీ సంస్థ ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ మాట్లాడుతుండగా ట్రంప్ ఊహించని విధంగా ఆయనకు ఫోన్ చేశారు. జెన్సన్ వెంటనే ఆ ఫోన్ కాల్ను స్పీకర్ఫోన్లో పెట్టి సభలోని ప్రతినిధులకు వినే అవకాశం కల్పించారు.
ఈ ప్రత్యక్ష సంభాషణలో ట్రంప్ మాట్లాడుతూ.. ‘రోబోలు లేదా ఏఐ ప్రపంచాన్ని ఆక్రమించుకుంటాయనే ప్రచారంలో ఏమాత్రం నిజం లేదు. ఏఐ అభివృద్ధిని వెనక్కు లాగాలనుకునేవారు చైనా వంటి ప్రత్యర్థి దేశాల ప్రయోజనాలకు పరోక్షంగా సహకరిస్తున్నారు. భవిష్యత్తులో డేటా సెంటర్లు రాబోయే 20-25 ఏళ్లకు సరిపడా అత్యంత కీలకమైన ఇంధనం లాంటివి. ఏఐ రేసులో ఎవరు గెలిస్తే వారే విజేతగా నిలుస్తారు’ అని స్పష్టం చేశారు. పరిశ్రమను ఆపే ఉద్దేశం తమకు లేదని, అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతామని చెప్పారు.
MUST SEE: Amazing moment as President Trump calls Nvidia CEO Jensen Huang while he's on stage at the All-In Summit.@POTUS on AI Doomerism: “I'm telling you, it's all a hoax… and we're not going to let that happen.” pic.twitter.com/ZP8cCaSMqG
— The All-In Podcast (@theallinpod) September 14, 2026
మరోవైపు ఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోది, ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మాన్ వంటి ప్రముఖ సాంకేతిక దిగ్గజాలు ఏఐ రక్షణపై, వేగం తగ్గించడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ట్రంప్ వ్యాఖ్యలతో ఏకీభవించిన జెన్సన్ హువాంగ్, ఏఐ రంగంలో అమెరికా ఆధిక్యతను కొనసాగించేందుకు దేశంలోని ప్రతి పరిశ్రమ ప్రయోజనం పొందేలా చూసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: గోల్డ్ లవర్స్కి శుభవార్త.. ధరల పతనం


