● ఇంత నీచమైన పరిపాలన ఎక్కడ లేదు
● ప్రతిపక్షాలను అణచివేసేందుకు కుట్ర
● మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఆగ్రహం
పుంగనూరు : రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, అక్రమాలను ప్రశ్నిస్తే కేసులు పెట్టి జైలుకు పంపుతారా...? బెయిల్పై వస్తే మరో కేసు అంటూ మరో స్టేషన్కు తీసుకెళ్తారా... ఇంత నీచమైన పరిపాలన ఎక్కడ లేదు....తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీని అణచివేయాలని చూస్తోంది. దీనిని జరగనివ్వం . ప్రభుత్వ అరాచకాలకు ముగింపు వస్తుందని రాష్ట్ర మాజీ మంత్రి, పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. ఆదివారం సాయంత్రం అన్నమయ్య జిల్లా పుంగనూరులో జగన్ 2.0 యాప్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేసే అక్రమాలను ప్రశ్నించే వారిని చూసి సరిదిద్దుకోవడం పద్ధతి అన్నారు. కానీ ప్రభుత్వం ఇందుకు భిన్నంగా ప్రశ్ని స్తే కేసు పెడతాం.....నిలదీస్తే జైలుకు పంపుతాం....అన్న రీతిలో బెదిరింపులకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీకి చెందిన ఇన్స్ట్రాగామ్, ఫేస్బుక్లను ప్రభుత్వం ఫ్రీజ్ చేసిందని, దీనిపై పార్టీ పోరాటం చేసి, తిరిగి ప్రారంభించడం జరిగిందన్నారు. టీడీపీ 2024లో అధికారంలోకి రాగానే ప్రతిపక్షాలను అణచివేసే కార్యక్రమాలను చంద్రబాబు నాయుడు యథేచ్చగా నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఈసమావేశంలో మాజీ ఎంపీ రెడ్డెప్ప, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు నాగభూషణం, ఆవుల అమరేంద్ర, ఎంపిపి భాస్కర్రెడ్డి పాల్గొన్నారు.
కార్యకర్తలను వేధిస్తే..
వైఎస్సార్సీపీ కార్యకర్తలను, నాయకులను, సామాన్య ప్రజలను టీడీపీ నాయకులు, కార్యకర్తలు వేధిస్తున్నారని, వాటిని జగన్ 2.0 యాప్లో సంక్షిప్తం చేయాలన్నారు. అలాగే పార్టీ కార్యకర్తలను వేధిస్తున్న పోలీసుల ఆగడాలను కూడా యాప్లో నమోదు చేయాలన్నారు. అలాగే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన కుటుంబంపైన తప్పుడు హత్యాప్రయత్నం కేసులు నమోదు చేయడం, విజయవాడలో ఒక యువకుడిని చంపివేయడం లాంటి కేసులలో ప్రధాన కారకులైన పోలీసులను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు.
మహిళలను వేధించే వారిని వదిలిపెట్టం
తెలుగుదేశం ప్రభుత్వంలో మహిళలు పలు రకాల వేధింపులకు గురౌతున్నారని, అలాంటి వారికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని వైఎస్.జగన్మోహన్రెడ్డి తెలిపారని మాజీ మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.


