సాక్షి, మదనపల్లె : ప్రభుత్వం నిర్ణయించిన రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలకు నిరసనగా దస్తావేజు లేఖరులు చేపట్టిన పెన్డౌన్ కార్యక్రమం మంగళవారం రెండోరోజు కొనసాగింది. మదనపల్లెలో రిజిస్ట్రేషన్ కార్యాలయం ఎదుట శిబిరం ఏర్పాటు చేసి నిరసన కొనసాగించారు. జీఓ నంబర్ 396 రద్దు చేసేదాక వివిధ రకాల్లో నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తామని దస్తావేజు లేఖరుల సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కంగేరి నంద చెప్పారు. కార్యక్రమంలో రంగు గుణశేఖర్, నాగమణింద్ర, మొహమ్మద్ ఖాన్, రంగు రాజేంద్ర, వెంకటేష్, శ్రీరాములు పాల్గొన్నారు.
తల్లీకుమారుల అదృశ్యంపై కేసు నమోదు
గాలివీడు : అన్నమయ్య జిల్లా గాలివీడుకు చెందిన ఈశ్వరమ్మ, ఆమె కుమారుడు రంజిత్కుమార్ రెడ్డి ఈ నెల 14వ తేదీ నుంచి కనిపించడం లేదని గాలివీడు పోలీసులు తెలిపారు. వీరు గాలివీడు టౌన్ నూలివీడు రోడ్డులోని తమ ఇంటి నుంచి 14వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు బయటకు వెళ్లి తిరిగి రాలేదన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మంగళవారం గాలివీడు పోలీసులు కేసు నమోదు చేసి గాలిస్తున్నారు. వీరి ఆచూకీ తెలిసిన వారు గాలివీడు ఎస్ఐ (9121100556), లక్కిరెడ్డిపల్లి సర్కిల్ సీఐ (9121100554) లేదా సమీప పోలీస్స్టేషన్కు సమాచారం అందించాలని కోరారు.
శిశు మరణాల నివారణకు చర్యలు: డీఎంహెచ్ఓ
కడప రూరల్ : శిశు మరణాల నివారణకు ముందస్తుగా అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ యుగంధర్ అన్నారు. మంగళవారం స్థానిక ఆ శాఖ జిల్లా కార్యాలయంలో శిశుమరణాలపై ప్రాథ మిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, సూపర్ వైజర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో డీఎంహెచ్ఓ మాట్లాడారు. పలు సూచనలు చేశారు. డాక్టర్ అరిఫుల్లా, డాక్టర్ మొహమ్మద్ తాహ, డాక్టర్ హిరేంద్ర సింగ్, డిప్యూటీ డెమో ప్రసన్న లత, సిహెచ్ఓ మునిరెడ్డి పాల్గొన్నారు.
పురాతన బావికి
పూర్వ వైభవం
రాజుపాళెం : పురాతన బావి పూర్వ వైభవం సంతరించుకుంది. మండల పరిధి అర్కటవేముల గ్రామంలోని ఊరి బావిలో ఉన్న పూడిక, చెత్తాచెదారాన్ని మహిళలు, యువకులు, ప్రజలు వారం రోజులుగా కష్టపడి పరిశుభ్రం చేశారు. సుమారు 24 అడుగుల లోతు వరకు ఉన్న మురుగు నీటిని, అలాగే పూడికను డీజిల్ ఇంజన్ల సహాయంతో తొలగించారు. వారి శ్రమ ఫలించి ఊర బావిలో ఊట నీరు ఉబికి బయటికి వచ్చింది. ఈ బావికి పెద్ద చరిత్రే ఉందని గ్రామ పెద్దలు చెబుతున్నారు. గత యాభై ఏళ్ల క్రితం నీటి ఎద్దడితో అల్లాడిపోయిన సమీపంలోని చిన్నశెట్టిపల్లె, పొట్టిపాడు గ్రామాల ప్రజలు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ అర్కటవేముల గ్రామానికి వచ్చి.. ఈ బావి వద్దకు వచ్చి తాగునీటిని తీసుకొని వెళ్లే వారిని గ్రామస్తులు తెలిపారు. ఇటీవలి కాలంలో గత మే నెల ఆఖరున బలమైన ఈదురు గాలులకు విద్యుత్ స్తంభాలు నేలవాలి నాలుగు రోజుల పాటు విద్యుత్ రాలేదు. దీంతో గ్రామస్తులు నీటి కోసం అవస్థలు పడ్డారు. రాబోవు అవసరాలను గుర్తుకు తెచ్చుకొని శిథిలావస్థ, అపరిశుభ్రంగా ఉన్న ఈ బావిని శుభ్రం చేస్తే బాగుంటుందని ఆలోచన రావడంతో పరిశుభ్రం చేయడంతో పలువురు వారిని అభినందిస్తున్నారు.


