మదనపల్లె టౌన్ : వెట్టిచాకిరీ, కార్మికుల అక్రమరవాణాను సమూలంగా నిర్మూలించే దిశగా అన్నమయ్య జిల్లా పోలీసు శాఖ కఠిన చర్యలు చేపట్టిందని అదనపు ఎస్పీ వెంకటాద్రి స్పష్టం చేశారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాలతో మంగళవారం మదనపల్లెలోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో పోలీసులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) మాట్లాడుతూ.. పేదరికం, నిరక్షరాస్యతను ఆసరాగా చేసుకుని అమాయకులతో బలవంతంగా వెట్టిచాకిరీ చేయిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
’వెట్టి చాకిరీ నిర్మూలన చట్టం–1976’ ప్రకారం అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. మానవ అక్రమ రవాణా ముఠాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, బాధితులను గుర్తించి రక్షించడంతో పాటు నిందితులకు చట్టపరంగా కఠిన శిక్షలు పడేలా ప్రతి కేసును పకడ్బందీగా దర్యాప్తు చేయాలని పోలీసు అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఐజేఎం ప్రతినిధుల సూచనలు
సదస్సులో పాల్గొన్న ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్ (ఐజేఎం) ప్రతినిధులు రాష్ట్రంలో కార్మికుల అక్రమ రవాణా జరుగుతున్న తీరు, క్షేత్రస్థాయిలో బాధితులను గుర్తించే విధానంపై పోలీస్ అధికారులకు వివరించారు. పోలీసు శాఖ సమన్వయంతో వెట్టిచాకిరీ బాధితులకు ఉచిత న్యాయ సాయం అందించడం తో పాటు, ప్రభుత్వ పథకాల ద్వారా పునరావాసం కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఐజేఎం కృషి చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ చంద్రశేఖర్, సీఐలు, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


