కురబలకోట : అంగళ్లులోని మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ బీటెక్ విద్యార్థినులకు స్కాలర్షిష్ల పంట పండింది. ఏకంగా 166 మంది విద్యార్థినులకు రూ.83 లక్షలు అందుకున్నారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని న్యూఢిల్లీ ఏఐసీటీఈ ప్రగతి స్కాలర్షిప్ పథకం కింద ఈ ఆర్థిక సాయాన్ని అందజేసింది. ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున లభించించినట్లు వీసీ యువరాజ్ మంగళవారం తెలిపారు. ప్రతిభకు ఆర్థిక ఇబ్బందులు అవరోధం కాకుడదన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఏఐసీటీఈ ద్వారా ఈ ప్రగతి స్కాలర్షిప్లను అందిస్తున్నట్లు తెలిపారు. ప్రతిభ, పట్టుదల ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితుల కారణంగా ఉన్నత విద్యకు విద్యార్థినులు దూరం కాకూడదని వారికి అండగా నిలవాలన్న ఉద్దేశ్యంతో వీటిని అందజేస్తున్నట్లు తెలిపారు. దీని వల్ల ఆర్థిక భరోసాతో పాటు ఉన్నత విద్యలో ముందుకు సాగేందుకు ప్రోత్సాహకంగా ఉంటోందన్నారు. విద్యార్థినులకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తున్న ఈ స్కాలర్షిప్లు రావడంపై మిట్స్ యూనివర్సిటీ చాన్స్లర్ డాక్టర్ నాదేళ్ల విజయభాస్కర్ చౌదరి, ప్రో చాన్స్లర్ నాదేళ్ల ద్వారకనాథ్ హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థినులు ప్రతిభను మరింత మెరుగుపరచుకుని భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి సమాజ ప్రగతికి పాటుపడాలని ఆకాంక్షించారు.
166 మందికి ఏఐసీటీఈ
ప్రగతి మెరిట్ స్కాలర్షిప్లు


