● ప్రమాదం నుంచి బయటపడిన చిన్నారులు
● బోరు మోటారు దొంగతనం నెపంతో వివాదం
పెద్దమండ్యం: బోరు మోటారు దొంగతనం జరిగిందనే నెపంతో వచ్చిన వివాదం ఓ ఇంటికి పెట్రోలు చల్లి నిప్పు పెట్టేవరకు వెళ్లింది. మాటలతో మొదలైన వివాదం చివరకు పెద్దదిగా మారింది. ఇంట్లో చిన్న పిల్లలు ఉన్న సమయంలో ఇంట్లోకి చొరబడిన ఇద్దరు పెట్రోలు చల్లి నిప్పు పెట్టడంతో మంటలు చెలరేగాయి. చిన్నారులు గట్టిగా కేకలు వేయడంతో అప్పుడే పొలం దగ్గరికి వెలుతున్న బాధితులైన తల్లి, కూతురు గ్రామస్తులు అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఆదివారం సాయంత్రం సంఘటన జరగ్గా, సోమవారం బాధితులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. అన్నమయ్య జిల్లా కోటకాడపల్లె పంచాయతీ యర్రసానివారిపల్లెకు చెందిన ఎం గంగులప్ప వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి కుమారుడు మహేశ్వర, కుమార్తె ఉన్నారు. కుమారుడు బెంగళూరులో డ్రైవర్గా పనిచేసుకుంటూ భార్యతో కలిసి జీవనం సాగిస్తున్నారు. ఇతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. బెంగళూరులో ఉన్న కుమారుని వద్దకు రెండు నెలల కిందటే గంగులప్ప వెళ్లి అక్కడే వాచ్మెన్గా పని చేస్తున్నారు. అయితే ఇదే గ్రామంలోని తాటిమాకులపల్లెకు చెందిన శివయ్య కుటుంబ సభ్యులతో భూమి విషయమై వివాదం ఉంది. ఇదిలా ఉండగా శివయ్యకు చెందిన బోరు మోటరు చోరీ జరిగినట్లు ఇతని కుమారుడు మణికంఠ గంగులప్పపై అనుమానం వ్యక్తం చేస్తూ అల్లుడైన జయరాంను అడిగారు. ఈ విషయం బెంగళూరులో ఉన్న మామ గంగులప్ప, బామ్మర్ధి మహేశ్వరలకు అల్లుడు జయరాం తెలిపారు. దీంతో మహేశ్వర తన తల్లి రామాంజులమ్మ కు జరిగిన విషయమై శివయ్య కుటుంబ సభ్యులను అడగాలని కోరాడు. బెంగళూరులో ఉన్న నా భర్త మీ బోరు మోటారు ఎందుకు దొంగతనం చేశాడని శివయ్య కుటుంబ సభ్యులను రామాంజులమ్మ నిలదీసింది. దీంతో అక్కడ చిన్నపాటి గొడవ జరిగింది. ఈ విషయమై స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లి శివయ్య కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. స్పందించిన పోలీసులు గంగులప్ప కుమారుడు మహేశ్వరకు ఫోన్ చేసి మాట్లాడారు. ఇద్దరం బెంగళూరులో ఉన్నామని, స్టేషన్కు వస్తామని పోలీసులకు సమాధానం ఇచ్చారు. కాగా స్టేషన్లో ఫిర్యాదు చేసి తిరిగి ఇంటికి వెలుతున్న శివయ్య భార్య, కుమారుడు ఇద్దరు పెట్రోల్ కొనుగోలు చేసుకొని వెళ్లి గంగులప్ప ఇంట్లోకి వెళ్లి పెట్రోలు చల్లి నిప్పు పెట్టారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇంట్లో ఉన్న మహేశ్వర, చెల్లెలు బిడ్డలు ఐదుగురు చిన్నారులు కేకలు వేయడంతో పొలం దగ్గరికి వెళుతున్న గంగులప్ప భార్య, కుమార్తె ఇద్దరు ఇంటి వద్దకు పరుగున వచ్చారు. గ్రామస్తులు అక్కడికి చేరుకుని చిన్నారులను మంటలనుండి రక్షించారు. మంటల్లో ఇంట్లో ఉన్న ధాన్యం పాక్షికంగా కాలిపోయాయి. గ్రామస్తులు మంటలను అదుపు చేయకుంటే చిన్నారులు, ఇంట్లో ఉన్న ధాన్యం, దుస్తులు సర్వం కోల్పోయే వాళ్లమని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. జరిగిన సంఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలాన్ని ఎస్ఐ హరిహరప్రసాద్ సిబ్బందితో వెళ్లి పరిశీలించారు. సమగ్ర విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ చెప్పారు.


