సాక్షి, విజయవాడ: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కానిస్టేబుళ్లు సాంబయ్య, బాబురావులకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు గన్నవరం జైలుకు సాంబయ్య, ఆవనిగడ్డ జైలుకు బాబురావును తరలించారు.కాగా రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెల్లడయ్యాయి.
సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ఆధారాలు మాయం చేయడంలో వీరిద్దరు కీలకంగా వ్యవహారించారని తేలింది. కృష్ణలంక పీఎస్ సీసీటీవీ హర్డ్ డిస్క్ను మార్చేసినట్లు అధికారులు గుర్తించారు. సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కృష్ణలంక పీఎస్కు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు బాబురావు, సాంబశివరావులను సిట్ అధికారులు నిందితులుగా చేర్చి విచారించగా ఆధారాలు మాయం చేయడంలో వీరు కీలక పాత్ర పోషించారని తేలింది. దీంతో వీరిని కోర్టులో హాజరుపరచగా కోర్టు వారికి 14 రోజుల రిమాండ్ విధించింది.
అంతకుముందు సోమవారం పోలీసుల ఎదుట లొంగిపోయిన హెడ్ కానిస్టేబుళ్లు పోతర్లంక అశోక్ కుమార్ ఏ2,జంగం నాని ఏ3లకు ఇదివరకే కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.కాగా రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గాదెకృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ విచారణ కొనసాగుతుంది. నెలరొజుల కిందట అమెరికా వెళ్లి ఇటీవలే తిరిగి వచ్చిన స్థానిక ఆర్ఎంపీని నిన్న (మంగళవారం) సిట్ విచారించింది.
హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నానిలు పిలిస్తేనే అక్కడికి వెళ్లి వైద్యం చేశానని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. కాగా వైద్యం చేసే సమయంలో సాయికృష్ణ శరీరంపై ఎక్కడెక్కడ గాయాలున్నాయని ఆరాతీసి ఆయన స్టేట్మెంట్ను నమోదు చేశారు. ఆర్ఎంపీ విచారణలో మరిన్ని కీలక ఆధారాలు సేకరించినట్లు సమాచారం.


