తాడేపల్లి : కూటమి ప్రభుత్వం పెద్దలు డీఎస్సీలో అక్రమాలు కప్పి పుచ్చుకునేందుకు గ్రూప్-1ని వివాదం చేస్తున్నారని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ధ్వజమెత్తారు. డీఎస్సీలో అక్రమాలు చేసి చంద్రబాబు ప్రభుత్వం అభాసుపాలైందని, దాన్ని డైవర్ట్ చేయడానికి గ్రూప్-1 అంటూ రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు.
ఈ రోజు(ఆదివారం, ఆగస్టు 16వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన ఆదిమూలపు సురేష్.. ‘ గ్రూప్ 1 లో ఎక్కడా తప్పు జరగలేదని సిట్ కూడా తేల్చింది. మరి చంద్రబాబు ఏ ఆధారాలతో ఆరోపణలు చేస్తారు?, గ్రూప్ 1 లో మేము ఎక్కడా రాజీ పడలేదు. డీఎస్సీలో లాగా ప్రత్యేక జీవోలు తెచ్చి పోస్టులు అమ్ముకోలేదు.
అలాంటప్పుడు గ్రూప్ 1, డీఎస్సీకి ఎలా ముడి పెడతారు?, గ్రూప్ 1 లో పేపర్ మూల్యాంకనం మీద మాత్రమే ఆరోపణలు చేస్తున్నారు. దానిపై కూడా హైకోర్టు ఆదేశాల మేరకు వ్యవహరించాం. అంతకుముందు టీడీపీ ప్రభుత్వం నియమించిన అధికారులే గ్రూప్ 1 మూల్యాంకన సమయంలో ఉన్నారు. వారిని చులకన చేసేలా టీడీపీ నేతలు, ఎల్లోమీడియా విష ప్రచారం చేస్తోంది. అభ్యర్థులు రాసిన పరీక్షా పత్రాలు ఇప్పటికీ కోర్టులో ఉన్నాయి.. కావాలంటే ఎవరైనా సరే వెళ్లి చెక్ చూసుకోవచ్చు’ అని సవాల్ చేశారు.


