విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ అదృశ్యమై వందరోజులు దాటింది. నా కొడుకు మృతదేహాన్ని ఏం చేశారు... కనీసం ఆ బూడిదైనా ఇవ్వండంటూ సాయికృష్ణ తల్లి నెత్తీ...నోరూ మొత్తుకున్నా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందనా లేదు. ఏదో కన్నీళ్లు తుడవటానికంటూ సిట్ వేసి చేతులు దులుపుకొంది. సిట్ వేసి రెండు నెలలు గడిచినా విచారణ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. కేవలం సీఐ నాగరాజు, నలుగురు కానిస్టేబుళ్లు, ఒక హోంగార్డును అరెస్టు చేయడం వరకే పరిమితం అయింది తప్ప కేసు దర్యాప్తులో ఎటువంటి పురోగతి కనిపించడం లేదు.
సాక్షి ప్రతినిధి, విజయవాడ: రాష్ట్రంలో సంచలనం కలిగించిన విజయవాడ కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ అదృశ్యమై వంద రోజులైంది. ఇప్పటికీ సాయికృష్ణ మృతదేహం ఏమైందో, ఎక్కడ దహనం చేశారో, బూడిద కూడా ఏం చేశారో పరమ రహస్యంగానే ఉంది. రిమాండ్లో ఉన్న సీఐ నాగరాజుని, నలుగురు కానిస్టేబుళ్లను కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకుని వేర్వేరుగా ప్రశ్నించినా ఇప్పటివరకూ ఏం తేల్చలేకపోయారు. అసలు సాయికృష్ణను మార్కాపురం నుంచి టాస్్క ఫోర్స్ పోలీసులు ఏ కేసులో తీసుకు వచ్చారు.
వారెంట్ పెండింగ్ ఉంటే కోర్టులో హాజరుపర్చకుండా, కృష్ణలంక పోలీస్స్టేషన్లో ఎందుకు అప్పగించారు. అక్కడే ఉంచి విచారించారా.. లేక మరేదైనా పోలీస్స్టేషన్కు తీసుకెళ్లారా.. సాయికృష్ణ ఎప్పుడు(లాకప్డెత్) మరణించాడు. ఆ తర్వాత డెడ్బాడీని ఏం చేశారో ఇప్పటికీ తేల్చలేదు. బైక్పై డెడ్బాడీని తీసుకెళ్లి స్వర్గపురిలో దహనం చేసినట్లు వస్తున్న వార్తలు నిజమేనా.. స్వర్గపురిలో ఏమి ఆధారాలు సేకరించారన్న సమాచారంపై స్పష్టత రాలేదు.
సాయికృష్ణ కాలిగోళ్లు పీకడం కోసం ఉపయోగించిన ఆర్ఎంపీ ఇప్పటివరకూ ఎంతమందికి ఈ ట్రీట్మెంట్ ఇచ్చారు. అసలు పోలీసు స్టేషన్లో ఆర్ఎంపీకి ఏం పని అనే విషయంపై కూడా సిట్ దృష్టి పెట్టలేదు. సాయికృష్ణ కేసులో కమిషనరేట్లోని మరో సీఐ సహకరించారన్న వార్తలపై... ఆ సీఐ ఎవరు అన్నది గుర్తించారా? గుర్తిస్తే ఇప్పటి వరకూ ఆ సీఐని ఎందుకు ప్రశ్నించలేదు అన్నది చర్చనీయాంశంగా మారింది.
సమాధానాలు లేని ప్రశ్నలు...
సిట్ చేస్తున్న విచారణ తీరును చూస్తే కేవలం సీఐ నాగరాజు, కానిస్టేబుళ్ల అరెస్టులతో సరిపెట్టేస్తారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు ఈ కేసులో సీఐ స్నేహితుడు సురేష్ హస్తం ఉందని ముందునుంచే వార్తలు వస్తున్నప్పుడు అతను అదృశ్యం అయ్యే వరకూ పోలీసులు ఎందుకు వేచి ఉన్నారు. ఈ కేసులో ఉన్న కానిస్టేబుళ్లు పరారీలో ఉన్న సమయంలో డబ్బుల కోసం తమ ఫోన్లు నాగపూర్లో అమ్మేశామని కట్టుకథ చెబితే దాన్ని ఎందుకు ఛేదించలేదు. పోయిన ఫోన్లను సాంకేతిక పరిజ్ఞానంతో ఎక్కడ ఉన్నాయో కనిపెట్టి బాధితులకు ఇస్తున్న తరుణంలో పోలీసు కానిస్టేబుళ్లు అమ్మేసిన ఫోన్లు ఎందుకు కనిపెట్టలేకపోయారు. సిట్ ఇప్పటివరకూ ఈ కేసుపై అప్డేట్ ఎందుకు ఇవ్వడం లేదు.
అసలు సాయికృష్ణ ఏమయ్యాడో తేల్చేందుకు మరెన్ని రోజులు కావాలి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సీఐ నాగరాజు ఇప్పటికే బెయిల్ పిటీషన్ కూడా దాఖలు చేశారు. కేసును కాలయాపన చేస్తూ నీరుగార్చి బెయిల్ వచ్చేందుకు సహకరిస్తారా? అసలు ఈ కేసులో ఉన్న పెద్దల్ని ఎందుకు కాపాడుతున్నారు. దీని వెనుక ఏ వ్యవహారం ఉందన్న విషయంపై ఎందుకు విచారణ జరపడం లేదన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. ఈ కేసు నీరుగార్చే ప్రయత్నాలు సాయికృష్ణ తల్లిని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కలిసినప్పటి నుంచి జరుగుతున్నట్లు స్వయంగా సాయికృష్ణ పిన్ని ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే సాయికృష్ణ తల్లితో హెబియస్ కార్పస్ పిటీషన్ విత్డ్రా చేసేందుకు పిటీషన్ కూడా వేయించిన సంగతి తెలిసిందే. పోలీసు స్టేషన్లో సీసీ ఫుటేజ్ మొత్తాన్ని ఒక హోంగార్డు మాయం చేశాడని నెపం అతనిపై వేసేశారు. పోలీస్స్టేషన్ సీసీ ఫుటేజ్ సరే.. ఆ స్టేషన్ రోడ్డులోని కెమెరాలు కమాండ్ కంట్రోల్ రూమ్తో అనుసంధానం అయి ఉంటాయి కదా.. అక్కడ ఫుటేజీ ఏమైందన్న విషయాన్ని సిట్ తేలుస్తుందా? ఇలా అనేక ప్రశ్నలు...ఇంకా సమాధానాలు దొరకని ప్రశ్నలుగానే మిగిలిపోయాయి.
విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ అదృశ్యమై వందరోజులు దాటింది. నా కొడుకు మృతదేహాన్ని ఏం చేశారు... కనీసం ఆ బూడిదైనా ఇవ్వండంటూ సాయికృష్ణ తల్లి నెత్తీ...నోరూ మొత్తుకున్నా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందనా లేదు. ఏదో కన్నీళ్లు తుడవటానికంటూ సిట్ వేసి చేతులు దులుపుకొంది. సిట్ వేసి రెండు నెలలు గడిచినా విచారణ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. కేవలం సీఐ నాగరాజు, నలుగురు కానిస్టేబుళ్లు, ఒక హోంగార్డును అరెస్టు చేయడం వరకే పరిమితం అయింది తప్ప కేసు దర్యాప్తులో ఎటువంటి పురోగతి కనిపించడం లేదు.


