సాక్షి, విశాఖ: విశాఖపట్నంలోని యారాడ బీచ్లో పెను ప్రమాదం తప్పింది. సముద్ర స్నానానికి దిగిన ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యుల్లో ఓ మహిళ అలల ఉధృతికి నీటిలో కొట్టుకుపోతుండగా బీచ్ లైఫ్గార్డ్స్ అప్రమత్తమై ఆమెను రక్షించారు.
రైల్వే న్యూ కాలనీకి చెందిన ఓ కుటుంబం యారాడ బీచ్ సందర్శనకు వచ్చింది. ఈ క్రమంలో కుటుంబంలోని ఐదుగురు సభ్యులు సముద్రంలో స్నానానికి దిగారు. అయితే అలల ఉధృతికి సూర్యలక్ష్మి (55) నీటిలో మునిగిపోతుండటాన్ని గమనించిన లైఫ్గార్డ్స్ వెంటనే స్పందించారు. కదిరి లావరాజ్, నొల్లి వీర్రాజు, చుట్టూరు శ్రీను, కదిరి వెంకటేష్లు సముద్రంలోకి వెళ్లి సూర్యలక్ష్మిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చారు. లైఫ్గార్డ్స్ సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది.


