సాక్షి, తాడేపల్లి: ప్రముఖ విద్యావేత్త, తిరుపతి రాయలసీమ విద్యాసంస్థల అధినేత వై. కొండారెడ్డి మృతిపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విద్యా రంగానికి కొండారెడ్డి చేసిన సేవలు చిరస్మరణీయం.. విద్యను కేవలం ఒక వృత్తిగా కాకుండా సామాజిక బాధ్యతగా భావించారని ప్రశంసలు కురిపించారు.
కొండారెడ్డి మృతిపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ స్పందిస్తూ..‘విద్యా రంగానికి కొండారెడ్డి చేసిన సేవలు చిరస్మరణీయం. ఆయన మృతి రాయలసీమ విద్యారంగానికి తీరని లోటు. వేలాది మంది పేద, మధ్యతరగతి విద్యార్థులకు విద్యావకాశాలు కల్పించారు. వారి జీవితాల్లో వెలుగులు నింపిన గొప్ప విద్యా ప్రదాత కొండారెడ్డి. రాయలసీమ ప్రాంతంలో విద్యాభివృద్ధికి ఆయన చేసిన కృషి ఎంతో విలువైనది. ఆర్ధికంగా వెనుకబడిన కుటుంబాల విద్యార్థులకు ఉన్నత విద్యను అందించేందుకు కృషి చేశారు. ఎందరో విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేశారు. కొండారెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా’ అని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలిపారు.


