గొంతు కోసిన కత్తి ఏమైంది? | Tirupati Lodge Couple Death Incident Controversy, More Details Inside | Sakshi
Sakshi News home page

గొంతు కోసిన కత్తి ఏమైంది?

May 31 2025 11:24 AM | Updated on May 31 2025 11:58 AM

tirupati lodge Couple incident

జంట ఆత్మహత్యలపై అనుమానాలెన్నో 

మృతుల సెల్‌ ఫోన్లు ఏమయ్యాయి ? 

 లాడ్జీలో సీసీకెమెరాలు ఎందుకు ఆపేశారు? 

 విచారిస్తున్న పోలీసులు 

నాయుడుపేట టౌన్‌(తిరుపతి): నాయుడుపేట పట్టణంలోని ఆర్టీసీ బస్టాండు సమీపంలో ఉన్న లాడ్జీలో జంట ఆత్మహత్య ఘటన మిస్టరీగా మారింది. లాడ్జీలో కొన్ని గంటల పాటు సీసీ కెమెరాలు పనిచేయకపోవడం, మృతుడి గొంతు కోసిన కత్తి కనిపించకపోవడం.. మృతుల సెల్‌ ఫోన్లు ఎక్కడున్నాయో తెలియక పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. వారి కథనం మేరకు.. దొరవారిసత్రం మండలం, ఏకొల్లు పంచాయతీ, కుప్పారెడ్డిపాళెం గ్రామానికి చెందిన జమ్మల సుబ్రహ్మణ్యం, అలీయాస్‌ మణి, అదే గ్రామానికి చెందిన బొడిపెద్ద శీరిష వివాహేతర సంబంధం పెట్టుకుని ఇద్దరూ నాయుడుపేట పట్టణంలోని ఓలాడ్జీలో గురువారం అనుమానాస్పదంగా మృతి చెందారు. 

ఈ ఘటనపై మణి తల్లి జమ్మల లక్ష్మమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ బాబి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మణి గొంతుపై కత్తితో కోసిన గాట్లు ఉండడం, అతని మృతదేహంపై నుంచే కుర్చీ వేసుకుని చున్నీతో శీరిష ఉరేసుకుని మృతి చెంది ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా గొంతు కొసుకునేందుకు వినియోగించిన కత్తి లాడ్జీ గదిలో ఎక్కడా లభించలేదు. మృతు లు మణి, శీరిష సెల్‌ ఫోన్లు సైతం లేకపోవడం మిస్టరీగా మారింది. మణి, శీరిష మధ్య ఏదైనా గొడవ జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. శీరిష పథకం ప్రకారమే మణికి అతిగా మద్యం తాగించి కత్తితో గొంతు కొసి హతమార్చి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. తర్వాత ఆమె కూడా గదిలో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. 

అంతేకాకుండా లాడ్జీ సిబ్బంది వ్యవహర శైలిపై కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తు న్నారు. లాడ్జీలో సీసీ కెమెరాలు కొన్ని గంటల పాటు పనిచేయకపోవడంపై విచారిస్తున్నారు. మృతులు ఇద్దరూ నాయుడుపేట లాడ్జీలో బుధవారం సాయంత్రం నుంచి గురువారం ఉదయం 9 గంటల వరకు పలుమార్లు రిసెప్షన్‌ వద్దకు రావడం గుర్తించారు. శిరీష లాడ్జీ కిందకు వచ్చి పలువురితో మాట్లాడినట్టు తెలుస్తోంది. ఈ మేరకు అన్ని కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ మేరకు మణి, శిరీష మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేసి బంధువులకు అప్పగించారు. కేసు దర్యాప్తులో ఉంది.

ప్రేమ జంట ఆత్మహత్య


 

Advertisement
 
Advertisement
Advertisement