
కోడూరు టీడీపీ సమావేశంలో తెలుగు తమ్ముళ్ల ఆగ్రహం
నియోజకవర్గంలో టీడీపీని లేకుండా చేయాలని చూస్తున్నారు
మండలంలో 70, 80 సీసీ రోడ్లు వేస్తే ఒక్కటీ టీడీపీ వారికి ఇవ్వలేదు
ఎమ్మెల్యే తీరుపై మండిపడ్డ టీడీపీ మండల అధ్యక్షుడు బండే శ్రీనివాసరావు
అవనిగడ్డ: కూటమి ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్, ఆయన కుటుంబ సభ్యుల తీరుపై స్థానిక టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నియోజకవర్గంలో టీడీపీని లేకుండా చేయాలనే కుట్రలను సాగనివ్వమని హెచ్చరించారు. ‘‘మీరు ఏం చేసినా ఊరుకుంటారను కుంటున్నారేమో.. ప్రజలు కన్నెర్ర జేస్తారు.. తిరగబడే రోజు దగ్గరలోనే ఉంది’’ అంటూ స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చారు. కోడూరు మండలంలో 13 పంచాయతీల టీడీపీ గ్రామకమిటీ ఎన్నికల తీరుపై గురువారం ప్రత్యేక సమావేశం జరిగింది. కోడూరు మండల సంస్థాగత ఎన్నికల పరిశీలకుడు బత్తిన దాస్ ఈ కార్యక్రమానికి విచ్చేయగా ఆయన ముందే ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ తీరుపై తెలుగు తమ్ముళ్లు తీవ్రస్థాయిలో మండి పడడం గమనార్హం.
అధికారంలో ఉన్నా ఏం చేయలేకపోతున్నాం: టీడీపీ మండల అధ్యక్షుడు బండే శ్రీనివాసరావు
పార్టీ అధికారంలో ఉన్నా నియోజకవర్గంలో ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నామని టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు, మాజీ జెడ్పీటీసీ బండే శ్రీనివాస రావు సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో టీడీపీని లేకుండా చేయాలని చూస్తున్నారని, అది ఎన్నటికీ జరగదని, పార్టీని కాపాడుకునేందుకు ప్రతి కార్యకర్త సిద్ధంగా ఉన్నారని అన్నారు. పనుల కోసం ఎమ్మెల్యే దగ్గరకు వెళ్లి లెటర్ ఇవ్వమంటే ఇవ్వరని, పదవుల్లో టీడీపీ, జనసేనకు ఫిప్టీ ఫిప్టీ అనే సూత్రాన్ని పాటించడం లేదని, గ్రామాల్లో ఒక్క కార్యకర్తకు పనిచేయలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మండ లంలో మొత్తం 70 సీసీ రోడ్లు వేస్తే ఒక్క రోడ్డు కూడా టీడీపీ నాయకుడు, కార్యకర్తకు ఇవ్వలేదని, ఇదేం న్యాయమని నిలదీశారు. అవసరమైతే మన సమస్యలు చెప్పుకునేందుకు చంద్రబాబు దగ్గరకో, లోకేష్ దగ్గరకో వెళదామని, పనిచేసే కార్యకర్తకు న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత పార్టీపై ఉందన్నారు. మండల స్థాయి నుంచి సచివాలయ స్థాయి వరకూ జరిగే బదిలీలన్నీ ఎమ్మెల్యే కుటుంబ కనుసన్నల్లోనే జరుగుతున్నాయన్నారు.
రాజాబాబు ఏమన్నా తోపా?
ఏదైనా అంటే జనసేన నాయకుడు రాజా బాబుకు చెబుతామంటున్నారని, రాజా బాబు ఏమన్నా తోపా అని వి.కొత్తపాలెంకు చెందిన ఓ టీడీపీ నాయకుడు మండిపడ్డారు. తామందరం లేకుండా రాజాబాబు వచ్చారా... ఎన్నికలప్పుడు కాళ్లూ, గడ్డాలు పట్టుకున్నారని, మీరు లేకపోతే దిక్కులేదన్నారని, అప్పుడేమో ఇళ్లకు వచ్చి బతిమ లాడారని.. ఇప్పుడేమో లెక్కచేయడం లేదని ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ తనయుడు రాజా, అల్లుడు అశ్విని కుమార్ని ఉద్దేశించి ఓ టీడీపీ నేత ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాసిపెట్టుకో... ప్రజలు కన్నెర్ర చేసే రోజు దగ్గరలోనే ఉంది
ముసుగులు వేసుకునే నాయకుడు ఒక్కో ముసుగు తీసి పార్టీలు మారుతున్నాడని, మీ ఇష్టానుసారంగా మాట్లాడితే ఎదురు చెప్పేవారు లేరనుకుంటున్నారా అంటూ బడేవారిపాలెంకు చెందిన ఓ సీనియర్ టీడీపీ నేత తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడున్న కార్యకర్త లెవరికీ న్యాయం జరగడం లేదని, ప్రతిపక్షంలో ఉన్నామో, అధికార పక్షంలో ఉన్నామో అర్ధంకాని దుస్ధితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు పనులు చేసే ఎమ్మార్వోలు, అధికారులు, పోలీసులను ఎమ్మెల్యే బదిలీ చేయిస్తున్నారని, మీరు చేసే దురాగాతాలను రాసిపెట్టుకోవాలని, ప్రజలు కన్నెర్ర జేసే రోజు దగ్గరలోనే ఉందని ఎమ్మెల్యే, ఆయన కుటుంబ సభ్యులను హెచ్చరించారు.
కంగుతిన్న పరిశీలకుడు బత్తిన...
స్థానిక జనసేన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్పై టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడటంతో సమావేశానికి విచ్చేసిన మండల పరిశీలకుడు బత్తిన దాసు కంగుతిన్నారు. మండలంలో ఉన్న ఈ పరిస్థితిని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళతానని చెప్పి బుజ్జగించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా స్థానిక ఎమ్మెల్యే బుద్ధ ప్రసాద్, ఆయన కుటుంబ సభ్యులపై టీడీపీ నేతలు మండిపడ్డ తీరు కూటమి పార్టీలు జనసేన, టీడీపీ మధ్య మరింత అగ్గి రాజేసినట్టయింది.