హైదరాబాద్: ‘‘డాక్టర్ వైఎస్సార్, డాక్టర్ కేవీపీ’’ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అందించే డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అవార్డు-2026ను ఎమ్మెస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్కు ప్రదానం చేయనున్నారు. రూ.25 లక్షల నగదు బహుమతితో కూడిన ఈ అవార్డును సెప్టెంబర్ 2న న్యూఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో అందజేయనున్నారు.
భారత వ్యవసాయం, ఆహార భద్రత, సుస్థిర అభివృద్ధి, గ్రామీణ జీవనోపాధి రంగాల్లో ఎమ్మెస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును అందిస్తున్నట్లు ఫౌండేషన్ తెలిపింది.
భారత హరిత విప్లవంలో కీలక పాత్ర పోషించిన భారతరత్న డాక్టర్ ఎమ్మెస్ స్వామినాథన్ వారసత్వాన్ని ఫౌండేషన్ కొనసాగిస్తోందని పేర్కొంది. సుస్థిర వ్యవసాయం, ఆహార-పోషక భద్రత, జీవవైవిధ్యం, గ్రామీణ జీవనోపాధి రంగాల్లో శాస్త్రీయ పరిజ్ఞానాన్ని రైతులు, గ్రామీణ వర్గాలకు చేరువ చేస్తోందని తెలిపింది.
డాక్టర్ ఎమ్మెస్ స్వామినాథన్ వ్యవసాయ శాస్త్రం, ఆహార భద్రతకు చేసిన సేవలు, డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి రైతులు, పేదల సంక్షేమం కోసం చూపిన నిబద్ధతకు ఈ అవార్డు ప్రతీకగా నిలుస్తుందని ఫౌండేషన్ పేర్కొంది. ఎమ్మెస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ తరఫున ఆ సంస్థ చైర్పర్సన్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ ఈ అవార్డును స్వీకరించనున్నారు.


