-
పీవీ, చరణ్ సింగ్ సహా నలుగురికి భారతరత్న ప్రదానం
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ ప్రధాన మంత్రులు పీవీ నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్లకు మరణానంతరం దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’ను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శనివారం ప్రదానం చేశారు. పీవీ నరసింహారావు తరఫున ఆయన కుమారుడు పీవీ ప్రభాకర్రావు, చరణ్ సింగ్ తరఫున ఆయన మనవడు జయంత్ చౌదరి, ఎంఎస్ స్వామినాథన్ తరఫున ఆయన కుమార్తె నిత్యా రావు, కర్పూరీ ఠాకూర్ తరఫున కుమారుడు రాంనాథ్ ఠాకూర్ పురస్కారాన్ని అందుకున్నారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే హాజరయ్యారు. ఈ సందర్భంగా పీవీ సేవలను స్మరించుకుంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్లో పోస్ట్ చేశారు. బీజేపీ నేత ఎల్కే అద్వానీకి భారతరత్న పురస్కారాన్ని ఆదివారం ఆయన నివాసంలో రాష్ట్రపతి ప్రదానం చేయనున్నారు. -
పంట విక్రయంలో సాంకేతిక దన్ను
పీవీ నరసింహారావు హయాంలో 1994లో ‘స్మాల్ ఫార్మర్స్ అగ్రి–బిజినెస్ కన్సార్టియం’ (ఎస్ఎఫ్ఏసీ) ఏర్పాటుచేయడం అర్థవంతమైన విధానపరమైన జోక్యం. ఆ సంస్థే ఇప్పుడు వ్యవసాయం కోసం జాతీయ ఎలక్ట్రానిక్ మార్కెట్ను ఏర్పాటు చేసే బాధ్యత చూస్తోంది. దీని కారణంగా, 2016లో నరేంద్ర మోదీ ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్’ (ఈ–నామ్) పేరిట ఒక ‘ఫిజిటల్’ (ఫిజికల్ ప్లస్ డిజిటల్) మార్కెట్ను ప్రారంభించారు. దీనివల్ల 23 రాష్ట్రాలు, 4 కేంద్ర పాలిత ప్రాంతాలలోని 1.07 కోట్ల మంది రైతులకు వారి సొంత భాషలో, వారి మొబైల్ ఫోన్ లో లావాదేవీలు జరిపే స్వేచ్ఛ, సౌలభ్యం ఏర్పడ్డాయి. 2024 జనవరి నాటికి, ఈ–నామ్ వల్ల రూ. 3 లక్షల కోట్లకు పైగా వ్యాపారం జరిగింది. దీనికి మరింత ఊపునిచ్చేలా, ఇ–మార్కెట్ ప్లాట్ ఫామ్లను ఏర్పాటు చేయడానికిగానూ వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఒక్కో నియంత్రిత మండీకి నిధులు సమకూర్చింది. మాజీ ప్రధానులు చరణ్ సింగ్, పీవీ నరసింహారావు, శాస్త్రవేత్త–అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ లకు ఇటీవల భారతరత్న ప్రదానం చేయడం భారతీయ రైతు వ్యవస్థాపక స్ఫూర్తికి నివాళి అనే చెప్పాలి. ఈ ముగ్గురూ వ్యవసాయంతో పాటు రైతుల సంక్షేమం కోసం ఎంతో కృషి చేశారు. స్వామినాథన్ అందించిన తోడ్పాటు సుపరిచితమే కాదు, అది అందరూ గుర్తించిన విష యమే. అయితే హరిత విప్లవాన్ని విజయవంతం చేసిన రాజకీయ ఆర్థిక వ్యవస్థను అర్థం చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. సోవియట్, చైనీస్ తరహా ‘సామూహిక వ్యవసాయం’లో ఉన్న ప్రమాదాలను నెహ్రూకి వివరించినది చరణ్ సింగ్. రైతులు రాటు దేలిపోయిన స్వతంత్ర సాగుదారులనీ, ప్రణాళికా సంఘం మెచ్చు కున్న ‘ల్యాండ్ పూలింగ్, సహకార వ్యవసాయం’ అనే కేంద్రీకృత ప్రణాళికను వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారనీ చరణ్ సింగ్ స్పష్టం చేశారు. దార్శనికుడి విధాన జోక్యం పీవీ నరసింహరావు హయాంలో భారతదేశం, ప్రపంచ వాణిజ్య సంస్థలో చేరి వ్యవసాయ ఒప్పందంపై సంతకం చేసింది. అప్పటి వరకు, భారతదేశ విధాన వ్యవస్థ దిగుమతులను పరిమితం చేసింది. పీవీ ఆధ్వర్యంలో, భారతదేశం వ్యవసాయ ఎగుమతులను ఒక ముఖ్యమైన విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించిపెట్టేదిగా చూసింది. ఏపీఈడీఏ (అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ)కి బడ్జెటరీ, సంస్థాగత మద్దతుతో, ఆయన భారతీయ వ్యవసాయాన్ని ప్రపంచవ్యాప్త పోటీదారుగా మార్చడంలో తోడ్పడ్డారు. అయినప్పటికీ దేశీయ వాణిజ్యం మాత్రం రైతుల కోసం కాకుండా, సేకరణ ఏజెన్సీలకూ, వ్యవసాయ పంటల మార్కెట్ కమిటీ (ఏపీఎంసీ)లలోని నమోదైన వ్యాపారులకూ అనుకూలంగా నిర్బంధ వాణిజ్య పద్ధతుల ద్వారా నిర్వహించబడుతూనే ఉంది. 1994లో ‘స్మాల్ ఫార్మర్స్ అగ్రి–బిజినెస్ కన్సార్టియం’ (ఎస్ఎఫ్ఏసీ) స్థాపన, పీవీ చేసిన అత్యంత అర్థవంతమైన విధాన పరమైన జోక్యం కావచ్చు. ఈ సంస్థకే వ్యవసాయం కోసం జాతీయ ఎలక్ట్రానిక్ మార్కెట్ను ఏర్పాటు చేసే బాధ్యతను అప్పగించారు. 2016 ఏప్రిల్ 14న ప్రధాని నరేంద్ర మోదీ ఎస్ఎఫ్ఏసీ మద్దతుతో ‘ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్’ (ఈ–నామ్) పేరిట ఒక ‘ఫిజిటల్’ (ఫిజికల్ ప్లస్ డిజిటల్) మార్కెట్ను ప్రారంభించారు. ఇది ఫిజికల్ బ్యాక్ ఎండ్తో కూడిన సింగిల్ విండో పోర్టల్. కార్యాచరణ సమాచారం, భౌతిక మౌలిక సదుపాయాలు, వాణిజ్య ఎంపికలు, చెల్లింపులపై ఎలక్ట్రానిక్ సెటిల్మెంట్లను ఇది అందిస్తుంది. నేడు, ఎస్ఎఫ్ఏసీ చేపట్టిన ఈ కార్యక్రమం వల్ల 23 రాష్ట్రాలు, 4 కేంద్ర పాలిత ప్రాంతాలలోని 1,389 నియంత్రిత హోల్సేల్ మార్కె ట్లలో, 1.07 కోట్ల మంది రైతులు వారి సొంత భాషలో, వారి మొబైల్ ఫోన్లలో లావాదేవీలు జరిపే స్వేచ్ఛ, సౌలభ్యం కలిగి ఉన్నారు. భాగస్వామ్య రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మరో 1.7 లక్షల ఇంటిగ్రేటెడ్ లైసెన్ ్సలను జారీ చేశారు. ఈ వేదికకు తమ మద్దతును ప్రతిబింబించేలా దాదాపు 3,500 రైతు ఉత్పత్తిదారులసంఘాలు (ఎఫ్పీఓలు) ఇందులో చురుకుగా పాల్గొనడం గమనార్హం. 2024 జనవరి నాటికి, ఈ–నామ్ వల్ల రూ. 3 లక్షల కోట్లకు పైగా వ్యాపారం జరిగింది. తగిన బాధ్యత ఈ విజయవంతమైన నేపథ్యాన్ని పంచుకోవడం అత్యవసరం. రైతుకు విపత్కరమైన అమ్మకాల నుండి రక్షణ కల్పించే ఉద్దేశంతో 1950వ దశకంలో ‘ఏపీఎంసీ’లను ప్రవేశపెట్టారు. ‘ధర ఆవిష్క రణ’ను నిర్ధారించడానికీ, కనీస మద్దతు ధర వ్యవస్థలో రాష్ట్ర ఏజెన్సీల ద్వారా సేకరణకు వేదికను అందించడానికీ ఇవి రూపొందాయి. అయితే, ఈ ప్రక్రియలో, వారు మధ్యవర్తుల ప్రత్యేక తరగతిని కూడా సృష్టించారు. నిర్దిష్ట మండీలో దాని అధికారికమైన కమాండ్ ఏరి యాతో లైసెన్ ్స కలిగి ఉన్న వ్యాపారిని స్థిరపరిచారు. అయితే, భారతదేశం ఐటీ సూపర్పవర్గా అవతరించడం, రైతు నుండి మార్కెట్ ఉత్పత్తి విధానంలోకి వ్యవసాయం మారడంతో, వాణిజ్య పరిమితి నిబంధనలను మార్చవలసిన అవసరం ఏర్పడింది. సాంకేతికతలు, ఆర్థిక సాధనాల ద్వారా సన్నకారు, చిన్న రైతులకు వాణిజ్య నిబంధనలను మెరుగుపరచడానికి ఎస్ఎఫ్ఏసీ వంటిసంస్థలు స్థాపితమయ్యాయి. వ్యవసాయ–వ్యాపార వ్యవస్థాపకులకు వెంచర్ క్యాపిటల్ నిధులను అందించడం నుండి మౌలిక సదుపాయాల కల్పన వరకు ఎస్ఎఫ్ఏసీ కొత్త పుంతలు తొక్కింది. అందుకే ఈ–నామ్ స్థాపన బాధ్యతను ఎస్ఎఫ్ఏసీకే అప్పగించడంలో ఆశ్చర్యం లేదు మరి. దీనికి మరింత ఊపునిచ్చేలా, ఇ–మార్కెట్ ప్లాట్ ఫామ్లను ఏర్పాటు చేయడానికిగానూ కంప్యూటర్ హార్డ్వేర్, ఇంటర్నెట్ సౌకర్యం, పరీక్షా పరికరాలు వంటి సామగ్రి లేదా మౌలిక సదుపాయాల కోసం వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఒక్కో నియంత్రిత మండీకి రూ. 30 లక్షలు మంజూరు చేసింది. క్లీనింగ్, గ్రేడింగ్, ప్యాకేజింగ్ సౌకర్యాలు, బయో–కంపోస్టింగ్ యూనిట్ వంటి అదనపు మౌలిక సదుపాయాల కల్పన కోసం ఈ మొత్తాన్ని 2017లో రూ.75 లక్షలకు పెంచారు. మొదటి మూడేళ్లలో దాదాపు 200 మండీలను దీని పరిధిలోకి తీసుకురాగా, 2020 మే నాటికి మరో 415 మండీలు జమయ్యాయి. 2022 జూలై నాటికి మరో 260మండీలు, 2023 మార్చి నాటికి మరో 101 మండీలు పెరిగాయి. గత సంవత్సరం ముగిసేనాటికి మరో 28 వీటికి కలిశాయి. ప్రతి త్రైమాసి కంలో ఈ సంఖ్య పెరుగుతూ వస్తోంది. మరింత పురోగమించేలా... విధాన రూపకల్పన అనేది సులభం. కానీ భౌతిక, ఐటీ మౌలిక సదుపాయాల కల్పనే కష్టం. ఇంకా కష్టతరమైనది క్షేత్రస్థాయిలో చేసే పని. ఈ–నామ్తో అనుసంధానమైన ప్రతి మండీకి ఒక ఏడాది పాటు ప్రారంభ శిక్షణ కోసం ఎస్ఎఫ్ఏసీ ఒక ఐటీ నిపుణుడిని (మండి విశ్లేషకుడు) గుర్తించి, మద్దతునిస్తుంది. వారు రాష్ట్ర సమన్వయ కర్త(ల)కు నివేదిస్తారు. ఈ సమన్వయకర్తలు ఒక్కొక్కరు 50 మండీల రోజువారీ సమన్వయాన్ని నిర్వహిస్తారు. ఈ–నామ్ విధానంలోని రైతులు, వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు, మండి అధికారులందరికీ ఉచితంగా శిక్షణ ఇవ్వడం కూడా వీరి బాధ్యత. తర్వాత ఏమిటి? సాధించిన పురోగతితో ఆగకుండా, ఈ–నామ్ కొత్త, ఉన్నత ప్రమాణాలను ఏర్పరుస్తోంది. దీని సవరించిన ఆదేశంలో రైతులకు పోటీ ధరలను సాధ్యం చేయడం కోసం కృషి చేస్తుంది. ఏపీఎమ్సీ నియంత్రిత మార్కెట్ కమిటీ మండీలకు వెలుపల కూడా వేదికలను ఏర్పాటుచేయడం ద్వారా దీన్ని సాధిస్తుంది. ఈ–నామ్ ద్వారా గిడ్డంగి ఆధారిత విక్రయానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది.అంతిమంగా, ధరను కనుగొనడం, విక్రయించే స్వేచ్ఛ అనేవి రైతుకు ఎక్కువ మేలు చేస్తాయి. - వ్యాసకర్త లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ మాజీ డైరెక్టర్ (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) - సంజీవ్ చోప్రా -
మరణానంతర ప్రదానం మంచిదేనా?
ఇటీవల ప్రకటించిన భారతరత్న పురస్కారాల్లో ముగ్గురికి మరణానంతరం ఇచ్చారు. ఆ ముగ్గురూ దానికి పూర్తి అర్హులు. కానీ వీటిని వారు బతికి ఉన్నప్పుడే ఇచ్చివుంటే ఎంత బాగుండేది! 53 మంది ఇప్పటివరకు ‘భారతరత్న’తో అలంకృతులయ్యారు. వారిలో 18 మందికి మరణానంతరం ప్రకటించారు. మరణానంతర ప్రదానంలోని ఇబ్బంది ఏమిటంటే, ఫలానావాళ్లకు ఎందుకు ఇవ్వలేదనే ప్రశ్నకు సమాధానం ఉండదు. కర్పూరీ ఠాకూర్కు ఇచ్చినప్పుడు, అన్నాదురైకి ఎందుకు ఇవ్వకూడదు? మరి రాంమనోహర్ లోహియాను ఎలా విస్మరిస్తారు? మొదటి నుంచీ మరణానంతరం ఇవ్వడాన్ని ఒక నియమంగా కాక, ఒక మినహాయింపుగా మాత్రమే చూశారు. జీవించి ఉన్నప్పుడు ఇవ్వడమే భారతరత్నకు ప్రమాణంగా ఉండటం మంచిది. చౌధురీ చరణ్ సింగ్, పీవీ నరసింహారావు, ఎం.ఎస్. స్వామినాథన్ – ముగ్గురికీ మరణానంతరం ‘భారతరత్న’ పురస్కారం ప్రకటించడమే ఈ వ్యాసం రాయడానికి నన్ను పురిగొల్పింది. ఈ ముగ్గురూ దానికి పూర్తిగా అర్హులు, ప్రశంసించదగినవారు. వాస్తవానికి వీరికి అత్యున్నత పురస్కారం ప్రకటించడంపై ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా ‘సెల్యూట్’ చేసింది. కానీ రెండు యూపీఏ (యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్) ప్రభుత్వాలూ లేదా రెండు ఎన్డీయే (నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్) ప్రభుత్వాలూ ఇన్నేళ్లుగా వీరిని ఈ రత్నాలతో ఎందుకు సత్కరించలేదనేది ప్రశ్న. నిజంగానే రత్నాలైన వీరిని దేశం కృతజ్ఞతతో అధికారికంగా కూడా అలాగే పరిగణిస్తుందనే విషయాన్ని వారి జీవితకాలంలోనే చెప్ప వలసింది కదా! అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కుమార్తె ఇందిరా గాంధీ 1954 ఆగస్టు 15న మొదటి భారతరత్న సి. రాజగోపాలాచారికి ఇలా రాశారు: ‘మీరు మొదటి భారతరత్న అయినందుకు మేమంతా చాలా సంతోషిస్తున్నాము. చాలా ఏళ్లుగా భారత్కు ‘రత్నం’గా మీరు గుర్తింపు పొందారు. అది ఇప్పుడు అధికారికంగా ప్రకటించడం చాలా మంచి విషయం.’ 53 మంది ఇప్పటివరకు ‘భారతరత్న’తో అలంకృతులయ్యారు. వారిలో 18 మందికి మరణానంతరం ప్రకటించారు. నేను ‘ఇప్పటి వరకు’ అని నొక్కి చెబుతున్నాను. ఎందుకంటే గత కొన్ని రోజులుగా, ఈ గుర్తింపులు వెంటవెంటనే వచ్చేస్తున్నాయి. నేను ఈ అంశంపై మరింతగా చెప్పడానికి ముందు, కొన్ని గణాంకాలను చూద్దాం. భారతరత్న పురస్కారాలన్నింటినీ వరుస రాష్ట్రపతులే ప్రదానం చేశారు. అయినప్పటికీ ఈ విషయంలో దాదాపుగా దేశ ప్రధానులదే అధికారం. వీరిలో కొందరు ప్రధానులు తాము కూడా దీన్ని పొందారు. నెహ్రూ (1947–64) తనతో కలుపుకొని, 13 మందికి అవార్డును ప్రదానం చేశారు. గుల్జారీలాల్ నందా పరివర్తనా కాలపు బాధ్యత (1966)లో ఉన్నప్పుడు ఒక్క భారతరత్నను ఇచ్చారు. ఇందిరా గాంధీ తన మొదటి ప్రధానమంత్రి పదవీ కాలంలో (1965–77) తనకు ఒకటి, మూడు ఇతరులకు ప్రదానం చేశారు. ఆమె రెండోసారి ప్రధానిగా ఉన్నప్పుడు (1980–84) ఇద్దరికి ఇచ్చారు. రాజీవ్ గాంధీ (1984–89) ఇద్దరికీ, వీపీ సింగ్ (1989– 90) ఇద్దరికీ, పీవీ నరసింహారావు (1991– 96) ఆరుగురికీ, ఐకే గుజ్రాల్ (1997–98) నలుగురికీ, అటల్ బిహారీ వాజ్పేయి (1999–2004) ఏడుగురికీ, మన్మోహన్ సింగ్ (2004–14) ముగ్గురికీ ఇచ్చారు. నరేంద్ర మోదీ (2014–) హయాంలో పదిమందికి ప్రకటించారు. ఇప్పటివరకు అత్యధిక కాలం ప్రధానిగా ఉన్న నెహ్రూ తన పదవీ కాలంలో అత్యధిక సంఖ్యలో 13 భారతరత్నలను ప్రదానం చేశారు. నరేంద్ర మోదీ ఆ తర్వాత అత్యధిక సంఖ్యలో పదిమందికి ఇచ్చారు. భారత రత్నలు ప్రకటించడం 1954లో ఉనికిలోకి వచ్చిందని గుర్తుంచుకుంటే, ‘సాంద్రత’ పరంగా ఇద్దరు ప్రధానులూ సమానంగా పదేళ్లలో పది మందికి ఇచ్చారు. మరణానంతరం ప్రదానం చేసిన భారతరత్నల సంఖ్యలో మాత్రం మోదీ ముందున్నారు. మరణానంతరం ప్రకటించిన 18 భారతరత్నాలలో మోదీ స్కోరు ఏడు. తదుపరి అత్యధికం పీవీ నరసింహారావుది– మూడు. భారతరత్న అసలు ప్రకాశాన్ని రెండు పరిణామాలు ప్రభావితం చేశాయి: ఒకటి, మరణానంతరం బహూకరించడం. ముందుగా ఈ అంశాన్ని చేపడదాం. దీనిని 1955 జనవరి 15న, నాటి భారత ప్రభుత్వ గెజిట్ నంబర్ 222 ద్వారా ప్రారంభించారు. అయితే దీన్ని ఒక నియమంగా కాక, ఒక మినహాయింపుగా మాత్రమే చూశారు. ఈ ‘సడలింపు’ అమలులోకి రావడానికి పదేళ్లు పట్టింది. 1966 జనవరి 11న తాష్కెంట్లో అప్పటి ప్రధాని లాల్బహదూర్ శాస్త్రి మరణించిన కొన్ని గంటల్లోనే ఆయనకు రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ తొలి మరణానంతర భారతరత్నను ప్రకటించారు. రెండవ మరణానంతర భారతరత్నకు మరో పదేళ్లు పట్టింది. ప్రధాని ఇందిరాగాంధీ దాన్ని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు కె. కామరాజ్కు ప్రకటించారు. అయితే, ఆయన జీవించి ఉంటే, ఆయన జీవిత కాలంలో ఆమె ఆ గౌరవం ఇచ్చివుండేవారు కాదు. కాంగ్రెస్వాద మూలాలతో కూడిన మరణానంతర భారతరత్న కొనసాగుతోంది. అదే సమయంలో ‘జీవించి ఉండగా’ ఇవ్వడాన్ని అధిగమించింది. మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వాల హయాంలో ప్రదానం చేసిన పదింటిలో ఏడు మరణానంతరమైనవి. అయితే ‘అర్హత’కు సంబంధించిన ప్రశ్నలు అనివార్యంగా తలెత్తు తాయి. మరణానంతర గ్రహీతల్లో ప్రధానులు వీపీ సింగ్, చంద్రశేఖర్లను వదిలివేయవచ్చా? బిహార్ దివంగత ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్కు ఈ పురస్కారం లభించినందున, సీఎన్ అన్నాదురైనీ, సాటిలేని ఈఎంఎస్ నంబూద్రిపాద్నూ విస్మరించగలమా? మరి మన కాలానికి దగ్గరగా ఉండే ఎం.కరుణానిధి, జ్యోతి బసు సంగతి? ఆచార్య వినోబా భావే మరణానంతరం పొందారు. అలాంటప్పుడు జేబీ కృపలానీ, నరేంద్ర దేవ్ వంటి ఆచార్యులను మరచిపోగలమా? జయప్రకాశ్ నారాయణ్, నానాజీ దేశ్ముఖ్ వంటి రాజకీయ చింతనా పరులు మరణానంతరం పొందినప్పుడు, పెరియార్కు ఇవ్వకూడదా? కల్లోల తుఫాన్లను దాటి దూసుకొచ్చే సముద్ర పక్షి లాంటి అరుణా అసఫ్ అలీ భారతరత్నను పొందారు. మరింత ‘తుఫాను లాంటి’ కమలాదేవీ ఛటోపాధ్యాయను వదిలివేయవచ్చా? కాంగ్రెస్ వాళ్లు ఈ ఆలోచనంటేనే విరుచుకుపడతారేమోగానీ ఏ సోషలిస్టు, ప్రజాస్వామ్యవాది రాంమనోహర్ లోహియాను మరచిపోతారు? పున రాలోచన, అధికార రాజకీయ ప్రేరణలతో ఉండే ‘ఇబ్బంది’ ఇదీ! భారతరత్న ప్రకాశాన్ని ప్రభావితం చేసిన రెండవ పరిణామం ఏమిటంటే, దానిపై అహంభావపు స్పర్శ. నెహ్రూ, ఇందిరా గాంధీలు ఇద్దరూ తమ పదవీకాలంలో దానిని అంగీకరించకపోయి ఉంటే పురస్కార గొప్పదనాన్ని పెంచి, తమ గొప్పతనాన్నీ పెంచుకునేవారు. వారు దానిని పొందడం అంటే తమకు తామే దండలు మెడలో వేసు కున్నట్టు. మరణానంతర ప్రదానాలు లోపాలకు సంబంధించిన ప్రశ్నలను లేవనెత్తితే, అధికారంలో ఉన్నప్పుడు పొందే ప్రదానాలు వ్యవహారాలకు సంబంధించిన ప్రశ్నలను లేవనెత్తుతాయి. మౌలానా ఆజాద్కు కేబినెట్ మంత్రిగా ఉన్నప్పుడు భారతరత్నను ఆఫర్ చేసినప్పుడు ఆయన ఇలా చెప్పారని ప్రతీతి: ‘మేము ఇచ్చేవాళ్లలో ఉన్నాం, తీసు కునేవాళ్లలో కాదు.’ నేను ఇలా చెప్పడం ద్వారా ఈ వ్యాసాన్ని పూర్తి చేయాలని అనుకుంటున్నాను: జీవించి ఉన్నప్పుడు ఇవ్వడమే భారతరత్నకు ప్రమా ణంగా ఉండనివ్వండి. మరణానంతర ఎంపిక ఒక మినహాయింపుగా ఉండాలి. ఆమె లేదా అతను పదవిలో ఉండేవరకు ‘ఇచ్చేవారు’గానే ఉండాలి తప్ప, ‘గ్రహీత’లు కావాలని కలలు కనకూడదని ఆశిద్దాం. పదవిలో లేనట్టయితే పురస్కార విలువ పెరుగుతుంది. అంతర్జాతీయంగానూ, జాతీయ స్థాయిలోనూ గౌరవం పొందిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ను ఇటీవల పార్లమెంటులో ప్రధాని మోదీ ప్రశంసించారు. బహుశా ఆయనకు భారతరత్నను ప్రతిపాదించి ఉండొచ్చు, సలక్షణమైన వినమ్రతతో ఆయన తిరస్కరించి ఉండొచ్చు. ఆయనను ‘రత్నం’గా చూసిన చాలామందికి అది అధికా రికం అయినప్పుడు ఒక సంతృప్తి ఉండదా? గోపాలకృష్ణ గాంధీ వ్యాసకర్త పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్, మాజీ దౌత్యవేత్త (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
వాళ్లేమీ నేరస్తులు కాదు: ఎంఎస్ స్వామినాథన్ కుమార్తె కీలక వ్యాఖ్యలు
ఢిల్లీలో హారాహరీగా సాగుతున్న రైతు ఉద్యమంపై దివంగత వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ కుమార్తె మధుర స్వామినాథన్ స్పందించారు. వాళ్లు అన్నదాతలు..నేరస్థులు కాదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళన చేస్తున్న రైతులను ఢిల్లీకి రాకుండా హర్యానా ప్రభుత్వం అడ్డుకుంటోందన్న వార్తలపై ఆమె స్పందించారు. తన తండ్రికి భారతరత్న అవార్డును పురస్కరించుకుని పూసాలోని ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఐఏఆర్ఐ) నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ డెవలప్మెంటల్ ఎకనామిస్ట్ మధుర స్వామినాథన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు దేశంలోని ప్రముఖ శాస్త్రవేత్తలంతా దీనికి పరిష్కారాన్ని కనుగొనాలని అభ్యర్థించారు. రైతులు.. అన్నదాతలు వారిని నేరస్తులుగా పరిగణించలేమన్నారు. అంతేకాదు మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ నవంబర్ 2021లో ఎంఎస్ స్వామినాథన్ చేసిన ప్రకటనను ట్విటర్లో షేర్ చేశారు. రైతు సమస్యలపై కేంద్ర మంత్రుల బృందంతో చర్చల విఫలం తరువాత చేపట్టిన రైతన్నల ఛలో ఢిల్లీ కార్యక్రమం గత రెండురోజులుగా ఉధృతంగా సాగుతోంది. హర్యానా, పంజాబ్, యూపీ రైతులు దేశ రాజధానిలో ధర్నాలు, రాస్తారోకోలతో హోరెత్తిస్తున్నారు. అటు పోలీసులు ఈ ర్యాలీని అడ్డుకునేందుకు ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటు చేశారు. హర్యానాలో వారి కోసం జైళ్లను సిద్ధం చేశారు. డ్రోన్ల ద్వారా బాష్పవాయువును ప్రయోగిస్తున్నారు. పోలీస్ నిర్బంధ కాండను చేధించుకుంటూ రైతులు వెనక్కి తగ్గకపోవడంతో సరిహద్దుల్లో హైటెన్షన్ నెలకొంది. ఢిల్లీ మార్చ్కి వచ్చిన వందలాది ట్రాక్టర్లు హైవేపై నిలిచిపోయాయి. ఢిల్లీకి 200 కిలో మీటర్ల దూరంలోనే రైతుల ర్యాలీ కొనసాగుతోంది. కాగా అన్ని పంటలకు కనీసం మద్దతు ధర హామీ చట్టం, రుణ మాఫీ, రైతులకు పింఛన్లు తదితర డిమాండ్ల అమలు కోసం సంయుక్త కిషన్ మోర్చ, కిషన్ మజ్దూర్ మోర్చ ఛలో ఢిల్లీ నిరసనకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. వీరి డిమాండ్లలో ప్రధానమైంది ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ నివేదిక ప్రకారం మద్దతు ధర అమలు చేయడం. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు 2004లో కేంద్రం ప్రభుత్వం ఎంఎస్ స్వామినాథన్ నేతృత్వంలో కమిషన్ను రూపొందించింది. ప్రభుత్వం పంటలపై కనీస మద్దతు ధర (ఎంఎస్పి)ని సగటు ఉత్పత్తి వ్యయం కంటే కనీసం 50శాతం పెంచాలని ఈ కమిషన్ సిఫార్సు చేసింది. Here is what M S Swaminathan said when the farm laws were repealed @mssrf https://t.co/HYSmSlSOve. https://t.co/dC3ejbsZ8F — Madhura Swaminathan (@MadhuraFAS) February 13, 2024 ఇటీవల హరిత విప్లవ పితామహుడు, ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఎంఎస్ఎస్ఆర్ఎఫ్) వ్యవస్థాపకుడు ఎంఎస్ స్వామినాథన్కు మరణానంతరం ఇటీవల భారత అత్యున్నత పురస్కారం భారతరత్నను ప్రకటించింవది. గతేడాది సెప్టెంబర్లో స్వామినాథన్ మరణించారు. -
ఒకేసారి ఐదుగురికి భారతరత్న.. మోదీ వ్యూహం అదేనా?
భారత మాజీ ప్రధాని పీవీ నరసింహరావుకు కేంద్ర ప్రభుత్వం భారత రత్న బిరుదు ఇవ్వడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అయింది. అదే సమయంలో నరేంద్ర మోదీ వ్యూహాత్మకంగా ఈ అవార్డులను ప్రకటిస్తున్నారన్న అభిప్రాయం కూడా ఏర్పడుతోంది. యూపీలో మరో మాజీ ప్రధాని చరణ్ సింగ్, బీహారులో మాజీ సీఎం కర్పూరి ఠాకూర్ కు, మాజీ ఉప ప్రధాని ఎల్.కె. అద్వానికి, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎమ్.ఎస్.స్వామినాదన్కు ఈ అవార్డులు ఇచ్చారు. వీరిలో ఎవరిపైన అభ్యంతరాలు లేవు. కాకపోతే ఎన్నికలు మరో రెండు నెలల్లో జరగనున్న తరుణంలో ఈ ప్రముఖులను ఎంపిక చేసుకున్న తీరు మాత్రం చర్చనీయాంశమే. బీహారులో జేడీయూ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఎన్డీఏ కూటమిలోకి మారిన నేపథ్యంలో అక్కడ ఉన్న బీసీ వర్గాలను ఆకట్టుకోవడానికి దివంగత నేత కర్పూరికి భారత రత్న ఇచ్చారు. మాజీ ఉప ప్రధాని అద్వానికి ఇవ్వడంలో బీజేపీ ఇంటరెస్టు ఉంటుంది. అద్వానికి సరైన ప్రాధాన్యత లభించడం లేదన్న భావన ప్రబలిన తరుణంలో ఆ వాదనను పూర్వపక్షం చేయడానికి ఇచ్చి ఉండవచ్చు. దివంగత నేత చరణ్ సింగ్కు భారతరత్న ఇవ్వడం ద్వారా యూపీలో జాట్ వర్గాన్ని ఆకట్టుకునే ప్లాన్ ఉండవచ్చు. దానికి తగినట్లే చరణ్ సింగ్ మనుమడు జయంత్ సమాజవాది పార్టీ కూటమి నుంచి ఎన్డీఏ.లోకి వచ్చేస్తున్నట్లు ప్రకటించారు. స్వామినాధన్ తమిళనాడుకు చెందినవారు. ఇటీవలికాలంలో ఆ రాష్ట్రంపై మోదీ ఫోకస్ పెట్టారు. ఇది కూడా ఒక కారణం కావచ్చు. ఇక ఇంకో దివంగత నేత పీవీ నరసింహారావు కాంగ్రెస్ ప్రధాన మంత్రిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన తీసుకు వచ్చిన ఆర్దిక సంస్కరణలు దేశ ప్రగతికి బాటలు వేశాయి. బహుభాషా కోవిదుడు అయిన పీవీ నరసింహారావు పట్ల అందరిలోను గౌరవ భావం ఉన్నప్పటికి, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని యూపీఎ ఇవ్వని భారత రత్న అవార్డును బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ. ఇవ్వడం కూడా ఆసక్తికర అంశమే. తెలంగాణలో పీవీ పట్ల ఉన్న అభిమానాన్ని దృష్టిలో ఉంచుకుని కూడా ఈ నిర్ణయం చేసి ఉండవచ్చు. వచ్చే పార్లమెంటు ఎన్నికలలో తెలంగాణ లో ఎక్కువ సీట్లు గెలవాలని ప్రయత్నిస్తున్న బీజేపీ దీనిని కూడా ఒక అస్త్రంగా వాడుకోవచ్చు. ఇక్కడ మరో కోణం ఏమిటంటే 1992లో బాబ్రిమసీదు కూల్చివేత ఘటనకు సంబంధించి అద్వానిపై అప్పట్లో కేసు నమోదు అయింది. ఆ మసీదు కూలుతున్నప్పుడు పీవీ నరసింహారావు గట్టి చర్య తీసుకోకుండా మౌనంగా ఉన్నారన్న విమర్శ ఉంది. వీరిద్దరికి ఒకేసారి భారతరత్న ఇవ్వడం గమనించదగ్గ అంశమే. పీవీ నరసింహారావు ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన సంస్కరణలను ఆ రోజుల్లో బీజేపీ, వామపక్షాలు వ్యతిరేకించేవి. నిరసనలు చేపట్టేవి. ఆ తర్వాత కాలంలో బీజేపీ కూడా వాటినే అనుసరించింది. కాని చిత్రంగా కాంగ్రెస్ లో పవర్ పుల్ ఉమన్ గా ఉన్న సోనియాగాంధీతో పీవీకి అప్పట్లో విబేధాలు వచ్చాయి. సోనియాగాందీ చేసిన కొన్ని డిమాండ్లను పీవీ అంగీకరించలేదని,దాంతో ఆయనపై కోపం పెంచుకున్నారని అంటారు. అందువల్లే పీవీ ఢిల్లీలో మరణిస్తే,కుటుంబ సభ్యులు కోరినా, దేశ రాజధానిలో అంత్యక్రియలకు అవకాశం ఇవ్వలేదని అంటారు. ప్రత్యేక ఘాట్ను ఏర్పాటు చేయలేదన్న భావన ఉంది.అంతేకాక ఏఐసీసీ కార్యాలయానికి ఆయన బౌతిక కాయాన్ని తీసుకు వెళ్లినప్పుడు లోపలికి తీసుకురాకుండా, గేటు బయటే ఉంచడం కూడా వివాదాస్పదం అయింది. ఆర్దిక సంస్కరణలకు ఆద్యుడు అయిన పీవీ 1996లో కాంగ్రెస్ను తిరిగి అధికారంలోకి తెప్పించలేకపోయారు. తెలుగుదేశం, జెఎమ్ఎమ్ వంటి పార్టీలను చీల్చి అధికారంలో ఐదేళ్లపాటు కొనసాగినా, పార్టీ సాదారణ ఎన్నికలలో ఓటమి పాలైంది. జెఎమ్ఎమ్కు లంచాలు ఇచ్చారన్న అబియోగానికి గురయ్యారు. ఇన్ని ఉన్నప్పటికీ దేశ ప్రయోజనాల రీత్యా ఆయన చేపట్టిన కార్యక్రమాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా పెద్దగా సక్సెస్ కాలేకపోయిన పీవీ దేశ ప్రదానిగా సఫలం అయ్యారని చెప్పాలి. తెలుగువారిలో భారతరత్న అవార్డు పొందిన తొలి వ్యక్తిగా పీవీ కీర్తిప్రతిష్టలు పొందారు. తెలుగువారందరికి ఇది గర్వకారణమే. ఒకప్పుడు ప్రధానిగా మాత్రమే కాకుండా , ఏఐసీసీ అధ్యక్షుడుగా అధికారం చెలాయించిన పీవీ ఆ తర్వాత కాలంలో కాంగ్రెస్ లో దాదాపు ఒంటరి అయ్యారు. 1991 లో రాజకీయాల నుంచి దాదాపు విరమించుకుని హైదరాబాద్ వచ్చేసిన ఆయన అనూహ్యంగా దేశ ప్రధాని అయ్యారు. ప్రధాని పదవి నుంచి దిగిపోయిన తర్వాత మళ్లీ అదే రకమైన పరిస్థితిని ఆయన ఎదుర్కున్నారు. కాగా పీవీ మరణానంతరం ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మాత్రం హుస్సేన్ సాగర్ ఒడ్డున స్థలం కేటాయించి అంత్యక్రియలు జరిపించి ఆయన స్మృతివనంగా అభివృద్ది చేశారు. కాంగ్రెస్ అధిష్టానం అనుసరించిన వైఖరి నేపద్యంలో పీవీ కుటుంబం కూడా కాంగ్రెస్ కు దూరం అయింది. 2014లో తెలంగాణ ముఖ్యమంత్రి అయిన కెసిఆర్ ఆ పరిస్థితిని తనకు అనుకూలంగా మలచుకున్నారు. పీవీ బందువులకు ప్రాదాన్యం ఇవ్వడం, ఒకరికి మంత్రి పదవి ఇవ్వడం , పీవీ కుమార్తె అయిన వాణి కి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం వంటివి చేశారు. పీవీ శత జయంతి ఉత్సవాలను కూడా నిర్వహించారు. ఇప్పుడు పీవీకి భారత రత్న ఇవ్వడం ద్వారా తెలంగాణలో బీజేపీకి ఎంత మేర రాజకీయ లబ్ది చేకూరుతుందన్నది చూడాలి. బీఆర్ఎస్ కూడా ఈ విషయంలో పోటీ పడుతుంది. కాంగ్రెస్కు మాత్రం ఇది కొంత ఇబ్బందికరమైనదే. పీవీకి భారత ఇవ్వలేకపోయారన్న విమర్శను ఎదుర్కుంటోంది. పార్లమెంటు ఎన్నికలలో ఈ అంశం ఎంత ప్రభావం చూపుతుందన్నది అప్పుడే చెప్పలేం. కాగా మరో నేత , తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావుకు భారత రత్న ఇవ్వాలన్న డిమాండ్ రెండు దశాబ్దాలుగా ఉంది. వాజ్ పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఆయనకు భారత రత్న ఇవ్వడానికి దాదాపు నిర్ణయం అయిపోగా , అందుకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులే అడ్డుకున్నారన్న అభిప్రాయం ఉంది. ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీపార్వతి ఆ అవార్డును స్వీకరించే అవకాశం ఉండడంతో ,అది ఇష్టలేని కుటుంబ సభ్యులు బిరుదును అప్పట్లు ఇవ్వవద్దన్నారని చెబుతారు. ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రిగా, ఎన్డీఏ కన్వీనర్గా కూడా ఉండేవారు. అయినా ఎన్టీఆర్కు భారత రత్న రాలేదు. కాని ప్రతి మహానాడులోను ఎన్టీఆర్కు భారత రత్న ఇవ్వాలని తీర్మానం చేస్తుంటారు. దాంతో ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల చిత్తశుద్దిపై సందేహాలు ఏర్పడ్డాయి. 2014-2019 టర్మ్లో కూడా చంద్రబాబు నాయుడు ఎన్డీఏ.లో ఉన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వంలో ఇద్దరు టిడిపి మంత్రులు కూడా ఉన్నారు. అయినా ఎన్టీఆర్కు మాత్రం భారతరత్న రాలేదు. 2018లో మోదీతో తగదా పడి బయటకు వచ్చారు. దాంతో కాస్తో,కూస్తో ఉన్న అవకాశం కూడా పోయినట్లయింది. అదేకనుక ఎన్టీఆర్కు కూడా భారతరత్న వచ్చి ఉంటే ఇద్దరు తెలుగువారు ఈ ఘనత సాధించినట్లయ్యేది. ప్రధాని మోదీ వ్యూహాత్మకంగానే పద్మ అవార్డులు ప్రకటిస్తుంటారు. ఉదాహరణకు యూపీ మాజీ ముఖ్యమంత్రి మూలాయం సింగ్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శరద్ పవార్ కు, కేంద్ర మాజీ మంత్రి గులాం నబీ అజాద్ వంటివారికి పద్మవిభూషణ్ అవార్డులు ఇచ్చారు. ఎన్నికల టైమ్లో ఐదుగురికి భారత రత్న అవార్డులు ఇవ్వడంతో రాజకీయంగా ప్రాముఖ్యత ఏర్పడింది. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గాంధీ కుటుంబంపై సన్నగిల్లుతున్న విశ్వాసం
ఇందిరమ్మ రాజ్యంలో సంక్షేమ ఫలాలు
పదేళ్ల మోదీ పాలన అవినీతిమయం
ఆరు గ్యారంటీల పేరుతో 420 అబద్ధాలు
పాలమూరు అభివృద్ధి కోసం ఓటేయండి
మోదీ హయాంలోనే దేశాభివృద్ధి
ఎంపీగా ఆశీర్వదించండి.. అభివృద్ధి చేస్తా
నేడు రాహుల్గాంధీ రాక
డీకే అరుణ గెలుపు కోసం కష్టపడాలి
ఎనిమిదేళ్లుగా నిర్లక్ష్యం..: మధుసూదన్రెడ్డి
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement