ఐసీఏఆర్–భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ (ICAR–IARI) డైరెక్టర్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి.హెచ్. శ్రీనివాసరావును ప్రతిష్టాత్మక 'ప్రొఫెసర్ ఎం.ఎస్. స్వామినాథన్' జాతీయ అవార్డు (2024–25)కు ఎంపిక చేసినట్లు రిటైర్డ్ ఐసీఏఆర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (RICAREA) ప్రకటించింది. భారత ఆహార భద్రత కోసం విశేష కృషి చేసిన శాస్త్రవేత్తలకు గుర్తింపుగా నుజివీడు సీడ్స్ లిమిటెడ్ (NSL) సహకారంతో 2004-05లో ఈ అవార్డును నెలకొల్పారు. డా. ఎం.ఎస్. స్వామినాథన్ జన్మ శతాబ్ది సంవత్సరంలో ఈ అవార్డును ప్రకటించడం విశేషం.
వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఎనిమిది మంది ప్రముఖ శాస్త్రవేత్తలు ఇప్పటివరకు ఈ గౌరవాన్ని పొందారు. ఆ జాబితాలో ఇప్పుడు డా. శ్రీనివాసరావు చేరారు. గతంలో ఈ అవార్డు పొందిన వారిలో డా. గెండా లాల్ జైన్ (పౌల్ట్రీ), డా. ఎస్. నాగరాజన్ (ప్లాంట్ పాథాలజీ), డా. వి. ప్రవీణ్ రావు (మైక్రో ఇరిగేషన్), డా. పి.వి. సత్యనారాయణ (వరి వంగడాలు) వంటి ప్రముఖులు ఉన్నారు.
మాజీ ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ డా. త్రిలోచన్ మోహపాత్ర అధ్యక్షతన ఏర్పాటైన నిపుణుల కమిటీ అత్యంత పారదర్శకంగా ఈ ఎంపికను చేపట్టింది. ఈ కమిటీలో వరల్డ్ ఫుడ్ ప్రైజ్ గ్రహీత డా. విజయ్ గుప్తా, డా. బాల రవి, ఎం.ఎస్. స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ డా. సౌమ్య స్వామినాథన్ సభ్యులుగా వ్యవహరించారు.
విశిష్ట సేవలు..
వాతావరణ మార్పులను తట్టుకునే వ్యవసాయ పద్ధతులు, సహజ వనరుల యాజమాన్యంలో డా. రావు చేసిన పరిశోధనలు అమోఘం.
పర్యావరణ ప్రభావం: 40 లక్షల హెక్టార్లలో వనరుల పరిరక్షణ సాంకేతికతను అమలు చేయడం ద్వారా ఏటా రూ. 380 కోట్ల డీజిల్ ఖర్చును ఆదా చేయడంలో కీలక పాత్ర పోషించారు.
వాతావరణ అనుకూలత: 637 జిల్లాలకు వ్యవసాయ ఆకస్మిక ప్రణాళికలు, 151 వాతావరణ తట్టుకునే గ్రామాలను రూపొందించారు.
విద్యా రంగం: ఇప్పటివరకు 363 పరిశోధనా పత్రాలను, 57 పుస్తకాలను ప్రచురించారు.
అవార్డు ప్రధానోత్సవం:
బంగారు పతకం, ప్రశంసా పత్రం రూ. 2,00,000 నగదుతో కూడిన ఈ పురస్కారాన్ని ఏప్రిల్ 18న అందజేయనున్నారు.
(చదవండి: సాహసం శ్వాసగా సాగిపో బామ్మ..!)


