సొంతూరు వెళ్లొస్తానని.. కారులో శవమై.. | Man Dies In Car Incident At NTR District, More Details Inside | Sakshi
Sakshi News home page

సొంతూరు వెళ్లొస్తానని.. కారులో శవమై..

Jun 14 2025 12:44 PM | Updated on Jun 14 2025 3:08 PM

CAR Incident In NTR District

జి.కొండూరు(ఎన్టీఆర్): సొంతూరు వెళ్లి వస్తానని చెప్పిన వ్యక్తి కారులో శవమై కనిపించిన ఘటన ఎన్టీఆర్‌ జిల్లా జి.కొండూరు మండల పరిధి వెలగలేరు వద్ద ఓ హోటల్‌ ఎదురుగా శుక్రవారం సాయంత్రం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే..  రెడ్డిగూడెం మండల పరిధి మొద్దులపర్వ నివాసి అన్నెబోయిన నాగరాజు(38). జి.కొండూరు మండల పరిధి వెలగలేరు గ్రామానికి చెందిన  అక్క కూతురు శివపార్వతితో అతనికి 11 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమారుడు గిరికుమార్, కూతురు రేష్మ ఉన్నారు. నాగరాజు వెలగలేరులోనే నివసిస్తూ జేసీబీ ఆపరేటర్‌గా చేస్తున్నాడు.  

మొద్దులపర్వ వెళ్తున్నానని చెప్పి.. 
ఈ క్రమంలో గురువారం విజయవాడ వెళ్లి కారును అద్దెకు తీసుకున్న నాగరాజు, ఇంటికొచ్చి సొంత గ్రామం మొద్దులపర్వ వెళ్తున్నానని భార్యకు చెప్పి సాయంత్రం వేళ వెళ్లాడు. మరుసటిరోజు శుక్రవారం ఉదయం 7.30 గంటల సమయంలో భార్య శివపార్వతికి నాగరాజు ఫోన్‌ చేశాడు. మొద్దుల పర్వలో ఉన్న ఇల్లు, ఇళ్ల స్థలం అమ్ముతున్నట్లు, ఇక అప్పులు అన్నీ తీరిపోతాయని, చార్జింగ్‌ లేదని చెప్పి ఫోన్‌ పెట్టేసినట్లు అతని భార్య చెబుతున్నారు. ఆ తర్వాత ఉదయం 11 నుంచి వెలగలేరు వద్ద   ఓ హోటల్‌ ఎదురుగా కారు ఆగి ఉండడాన్ని స్థానికులు గమనించారు. దానిలో శవం ఉన్నట్లు        గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కారుని పరిశీలించగా కారులో నాగరాజు శవమై కనిపించాడు. మైలవరం ఏసీపీ ప్రసాదరావు, సీఐ దాడి చంద్రశేఖర్, జి.కొండూరు ఎస్‌ఐ సతీష్‌ కుమార్‌లు సంఘటనా స్థలంలో సీసీ కెమెరాలను పరిశీలించి విచారణ చేపట్టారు. 

స్థలం రిజిస్ట్రేషన్‌ చేయాలంటూ బెదిరింపు!
కారులో శవమై కనిపించిన నాగరాజు భార్య శివపార్వతితో ‘సాక్షి’ నేరుగా మాట్లాడింది. ఈ క్రమంలో శివపార్వతి.. వెలగలేరులో ఇంటి నిర్మాణం నిమిత్తం విస్సన్నపేటకు చెందిన ఓ వడ్డీ వ్యాపారి వద్ద తన భర్త నాగరాజు మొద్దుల పర్వలో ఉన్న ఇల్లు, ఇళ్ల స్థలం తనఖా పెట్టి అప్పు తీసుకున్నట్లు తెలిపారు. దీనికి ప్రతి నెలా వడ్డీ చెల్లిస్తున్నట్లు పేర్కొన్నారు. 15రోజుల క్రితం సదరు వడ్డీ వ్యాపారి కుటుంబ సభ్యులతో వెలగలేరు వచ్చి అప్పు వెంటనే చెల్లించడం లేదా మొద్దులపర్వలో ఉన్న ఇల్లు, ఇళ్ల స్థలాన్ని జూన్‌ నెల 13వ తేదీ లోపు తన పేరుతో శాశ్వత రిజిస్ట్రేషన్‌ చేయాలని కోరారని చెప్పింది. చెప్పినట్లు చేయకపోతే తడాఖా చూపిస్తానంటూ సదరు వడ్డీ వ్యాపారి బెదిరించినట్లు ‘సాక్షి’కి వివరించారు. ఇంతలోనే భర్త శవమై కనిపించడంపై శివపార్వతి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

కారులో ఒక్కడే వచ్చాడా?  
కారులో శవమై కనిపించిన నాగరాజు శుక్రవారం ఉదయం ఒక్కడే కారులో వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. ఉదయం 11గంటల సమయంలో వెలగలేరు వద్ద హోటల్‌ ఎదురుగా కారు ఆపిన నాగరాజు  పక్కనే ఉన్న బడ్డీ కొట్టు వద్ద కిందకు దిగి తూలుతూ ఉన్నట్లు ప్రత్యక్షంగా చూసిన వారు చెబుతున్నారు.  స్పృహ కోల్పోయే పరిస్థితిలో ఉన్న నాగరాజు బడ్డీ కొట్టు వద్ద పడుకోబోతున్న క్రమంలో అతని నుంచి విపరీతమైన వాసన వస్తుండటంతో అక్కడి నుంచి వెళ్లాలని ఆ పక్కనే నివసిస్తున్నవారు చెప్పినట్లు తెలిసింది. ఈ క్రమంలో అక్కడ ఉన్న మరో వ్యక్తి సాయంతో నాగరాజు కారులో ఎక్కి కూర్చున్నట్లు సమాచారం. 

కొద్ది గంటలు గడిచాక  నాగరాజు కారులో నుంచి దిగకపోవడంతో స్థానికులకు ఆనుమానం వచ్చి డోరు తెరిచి చూడగా నాగరాజు శవమై కనిపించాడు. అతను తూలుతూ కనిపించడంతో పాటు గొంతు వద్ద కాలినట్లు తోలు లేచిపోయి ఉండటంతో నాగరాజు మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతుడు నాగరాజుది హత్యా లేక ఆత్మహత్యా అనేది తేల్చేందుకు పోలీసులు విచారణను వేగవంతం చేశారు. క్లూస్‌ టీంను రంగంలోకి దించి ఆధారాలను సేకరిస్తున్నారు. కారు ఆగిన ప్రాంతంలో సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులకు సైతం నాగరాజు ఒక్కడే కారులో వచ్చినట్లు గుర్తించారని తెలుస్తుంది. అయితే అతనికి కారులో ఊపిరాడక మరణించినట్లు పోలీసులు భావిస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement