యాదగిరిగుట్ట : బీసీలకు అడుగడుగునా అన్యాయం జరుగుతుందని బీసీ హక్కుల సాధన సమితి జిల్లా అధ్యక్షుడు కళ్లెం కృష్ణ అన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలో ఆదివారం నిర్వహించిన బీసీ హక్కుల సాధన సమితి మండల మహాసభలో ఆయన మాట్లాడారు. దేశ జనాభాలో అధిక శాతం ఉన్న బీసీలకు మాత్రం ఇప్పటి వరకు రాజకీయ రిజర్వేషన్ ఇవ్వకపోవడం దారుణమన్నారు. కేవలం విద్యా, ఉద్యోగ రంగాల్లో మాత్రమే 27 శాతం రిజర్వేషన్లు లభించిందని పేర్కోన్నారు. కనీసం బీసీ సబ్ ప్లాన్, రక్షణ చట్టాలు కల్పించలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం అడగకుండానే 13వ రాజ్యాంగ సవరణతో అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూఎస్ పేరుతో 10 శాతం రిజర్వేషన్ కల్పించారని, బీసీలకు స్థానిక సంస్థలలో 42 శాతం రిజర్వేషన్ బిల్లులను పెండింగ్లోనే పెట్టడం శోచనీయమన్నారు. సమావేశంలో సీపీఐ మండల కార్యదర్శి కల్లెపల్లి మహేందర్, మున్సిపల్ కౌన్సిలర్ బబ్బురి శ్రీధర్, రైతు సంఘం నాయకులు పేరబోయిన పెంటయ్య, బొదాసు జగన్, పాకాలపాటి రాజు, పబ్బాల స్వామి, కోనేరు శీను, అనంతుల నరసింహ, శెట్టి నరసింహ, సత్యం, మహేష్ పాల్గొన్నారు.
యాదగిరి క్షేత్రంలో
సుదర్శన హోమం
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి పుణ్యక్షేత్రంలో శ్రీసుదర్శన నారసింహ హోమాన్ని ఆలయ అర్చకులు పాంచరాత్ర ఆగమశాస్త్రానుసారంగా జరిపించారు. ఆదివారం వేకువజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాతం సంప్రదాయంగా నిర్వహించారు. అనంతరం గర్భాలయంలోని స్వయంభూలకు నిజాభిషేకం, బిందె తీర్థం, ఆరాధన, అర్చన వంటి పూజలు చేపట్టారు. ముఖ మండపంలోని సువర్ణ ఉత్సవ మూర్తులకు సువర్ణ పుష్పార్చన జరిపించారు. సాయంత్రం వేళ అలంకారమూర్తులైన శ్రీస్వామి అమ్మవార్ల జోడు సేవను అర్చకులు ఊరేగించారు.
మత్తుకు బానిస కావొద్దు
సూర్యాపేటటౌన్ : సమాజంలో మాదక ద్రవ్యాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో యువత వా టికి బానిస కాకుండా ఉండేందుకు పోలీసులు, తల్లిదండ్రులు, విద్యాసంస్థలు, సామాజిక సంస్థలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ సభ్యుడు డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాదక ద్రవ్యాల నియంత్రణలో పోలీసుల పాత్ర ఎంత ముఖ్యమో, అదే స్థాయిలో యువత, తల్లిదండ్రులు, ప్రతి వర్గం అంతే బాధ్యతగా వ్యవహరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.


