భువనగిరిటౌన్ : ప్రజావాణిలో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను పెండింగ్లో పెట్టకుండా సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ వెంకారెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం భువనగిరిలోని కలెక్టరేట్లో డీఆర్ఓ జయమ్మ, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ కృతికతో కలిసి నిర్వహించిన ప్రజావాణిలో బాధితుల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ వెంకారెడ్డి మాట్లాడారు. ప్రజావాణిలో మొత్తం 92 అర్జీలు రాగా, అందులో అత్యధికంగా రెవెన్యూ శాఖకు సంబంధించి 56 దరఖాస్తులు వచ్చాయన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ప్రజావాణిలో వచ్చిన కొన్ని వినతులు..
● నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు విపరీతంగా పెరగడంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంలో రెండు రకాల కూరలు, కోడిగుడ్లు వడ్డించడం తమ వల్ల కావడం లేదని మధ్యాహ్న భోజన వంట కార్మికులు అన్నారు. ఈ మేరకు సోమవారం ప్రజావాణిలో అదనపు కలెక్టర్కు విన్నవించి రేట్లు పెంచాలని కోరారు. కార్యక్రమంలో మధ్యాహ్న భోజన ఏజెన్సీల ప్రతినిధులు వరలక్ష్మి, స్వప్న తదితరులు పాల్గొన్నారు.
● మార్చి నుంచి జూన్ వరకు నాలుగు నెలలుగా తమకు జీతాలు రావడం లేదని వెంటనే అందించి ఆదుకోవాలని మోత్కూరు ఎస్టీఓ పరిధి నుంచి వేతనాలు పొందే వివిధ మండలాలకు చెందిన 61 ఏళ్లు దాటిన మొత్తం 28 మంది వీఆర్ఏలు కోరారు. కార్యక్రమంలో వీఆర్ఏలు ఈ.శ్రీశైలం, జె.ఎల్లయ్య, జి.మత్స్యగిరి, ఆంజనేయులు, ఎం.రమేష్ తదితరులు ఉన్నారు.
● భువనగిరి మున్సిపల్ పరిధిలోని రాయగిరి రైల్వే స్టేషన్ విస్తరణ పనుల పేరుతో శతాబ్ద కాలంగా నివాసముంటున్న తమ ఇళ్లను తొలగించాలని ముందస్తు సమాచారం లేకుండానే నోటీసులు ఇవ్వడం అన్యాయమని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు శాశ్వత గృహవసతి కల్పించిన తర్వాతే ఇళ్లను ఖాళీ చేయించాలని డిమాండ్ చేస్తూ భువనగిరి కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు రాకేశ్, యాదగిరి, సందీప్, శ్రీనివాస్, కిశోర్, రవీందర్, సలీం, మహబూబ్, గణేశ్, జయరామ్ తదితరులు పాల్గొన్నారు.
ఫ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి


