గా పిల్ల ఘోరంగా మోసం చేసింది.. ఉండలేక పోతున్న.. | Sakshi
Sakshi News home page

గా పిల్ల ఘోరంగా మోసం చేసింది.. ఉండలేక పోతున్న..

Published Thu, Jul 13 2023 7:44 AM

- - Sakshi

శంకర్‌పల్లి/చేవెళ్ల: ‘ప్రేమించిన అమ్మా యి విడిచిపెట్టి పోయింది.గా పిల్ల నన్ను ఘోరంగా మోసం చేసింది. ఇక నేను ఉండలేక పోతున్న’ అంటూ అగ్రికల్చర్‌ బీఎస్సీ విద్యార్థి సెల్ఫీ వీడియో ద్వారా తన సోదరుడికి సమాచారం అందించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన శంకర్‌పల్లి రైల్వేస్టేషన్‌ సమీపంలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. వికారాబాద్‌ జిల్లా తాండూరు మండలం అల్లాపూర్‌కు చెందిన కురువ మహేశ్‌(21) నగరంలోని మల్లారెడ్డి యూనివర్సిటీలో అగ్రికల్చర్‌ బీఎస్సీ చదువుతున్నాడు.

ఓ అమ్మాయి తో ప్రేమ విఫలమై ఇద్దరి మధ్య అగాధం పెరిగింది. ఏం జరిగిందో కానీ ప్రియురాలు తనను విడిచిపెట్టిపోయిందని తీవ్ర మనస్తాపం చెందాడు. దీన్ని జీర్ణించుకోలేకపోయాడు. చివరికి చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. శంకర్‌పల్లి రైల్వేస్టేషన్‌ సమీపంలోని పట్టాలపైకి వెళ్లి సెల్ఫీ వీడియో ద్వారా అన్నకు ఈ విషయం చెప్పాడు.

ఇక తాను ఉండలేనని, అమ్మానాన్నలను మంచిగా చూసుకోవాలి.. ఇక పోతా అంటూ గూడ్స్‌ రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తల మొండెం రెండు ముక్కలై మృతదేహం ఛిద్రమైంది. అతని వద్ద మల్లారెడ్డి యూనివర్సిటీ ఐడీ కార్డు ఉంది. ప్రయోజకుడు అవుతాడనుకున్న కొడుకు అర్ధంతరంగా తనువు చాలించటంతో తల్లిదండ్రులు కన్నీరుమన్నీరయ్యారు. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement