యువతి, కుటుంబసభ్యులపై కత్తితో దాడి.. ఐదుగురికి గాయాలు
గచ్చిబౌలి: ఇంట్లోకి చొరబడ్డ ఓ ప్రేమోన్మాది యువతి కుటుంబ సభ్యులపై కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ వెంకన్న తెలిపిన మేరకు.. రాయదుర్గంలోని పోచమ్మబస్తీలో నివాసం ఉండే డిగ్రీ విద్యార్థిని (20)ను పక్కింట్లో ఉండే కంచమీది గోవర్ధన్ (22) ప్రేమిస్తున్నానంటూ వేధింపులకు గురిచేస్తున్నాడు.
శుక్రవారం తెల్లవారుజామున నిందితుడు పక్కనున్న భవనం పైనుంచి యువతి ఉంటున్న రెండో అంతస్తులోకి ప్రవేశించాడు. యువతి అక్క గొంతుపై కత్తి పెట్టి, అరిస్తే చంపేస్తానని బెదిరించాడు. ఆపై తల్లిదండ్రులు సత్యనారాయణ, సుజాత, యువతిపై కత్తితో దాడికి తెగబడ్డాడు. బాధితుల కేకలు విని సత్యనారాయణ సోదరుడు అర్జున్ అక్కడికి రాగా అతనిపై కూడా దాడి చేశాడు. బాధితుల కేకలు విని స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని గోవర్ధన్ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
ఐదుగురిని గాయపరచిన నిందితుడి నుంచి కత్తిని స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఇన్స్పెక్టర్ వెల్లడించారు.


