రసాయన వ్యర్థాల తరలింపుతో ఉద్రిక్తత | Tensions with the movement of chemical waste | Sakshi
Sakshi News home page

రసాయన వ్యర్థాల తరలింపుతో ఉద్రిక్తత

Oct 23 2023 4:45 AM | Updated on Oct 23 2023 4:45 AM

Tensions with the movement of chemical waste - Sakshi

మరికల్‌: నారాయణపేట జిల్లా మరికల్‌ మండలంలో ఇథనాల్‌ కంపెనీ నుంచి వ్యర్థాల తరలింపు వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వ్యర్థాలను తరలిస్తున్న ట్యాంకర్‌ను స్థానికులు అడ్డుకోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం 11 గంటలవరకు హైడ్రామా నడిచింది. రాస్తారోకో చేస్తున్న గ్రామస్తులపై పోలీసులు లాఠీచార్జి చేయడంతో వారు తిరగబడి ఎదురు దాడి చేశారు. 

వివరాలిలా ఉన్నాయి.. శనివారం రాత్రి 8 గంటల సమయంలో జూరాల ఆగ్రో ఇథనాల్‌ కంపెనీ నుంచి ఓ ట్యాంకర్‌ రసాయన వ్యర్థాలను నింపుకొని బయటకు వచ్చింది. ఆ వ్యర్థాలను మరికల్‌ మండలం ఎక్లాస్‌పూర్, జిన్నారం గ్రామాల శివా­రులో పారపోస్తున్నారని స్థానికులు ట్యాంకర్‌ను అడ్డుకొని ఆందోళనకు దిగారు. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం 11 గంటల వరకు గ్రామస్తులు ఆత్మకూర్‌ రోడ్డుపై ఆందోళన చేయడంతో మరికల్, మక్తల్, కృష్ణ, నర్వ, ధన్వాడ మా­గనూర్‌ పోలీసులతోపాటు స్పెషల్‌ పార్టీ పోలీసులు రంగంలో దిగారు.

ఈ నేపథ్యంలో పోలీసులకు, గ్రామస్తులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటు­చేసుకుంటుంది. నారాయణపేట డీఎస్పీ సత్యనా­రాయణ ఆందోళనకారులను అదుపు చేయాలని చెప్పడంతో పోలీసులు వారిపై లాఠీచార్జీ చేశారు. దీంతో పలువురికి గాయాలయ్యాయి. అదే సమ­యంలో ట్యాంకర్‌ను పోలీసుల బందోబస్తు మధ్య తరలించడంతో కోపోద్రిక్తులైన గ్రామస్తులు రాళ్లు, ఇటుకలు, కర్రలతో పోలీసులపైకి దాడికి దిగారు. దీంతో అక్కడి నుంచి ప్రాణాలతో బయ­టపడేందుకు పోలీసులు పరుగులు పెట్టగా.. మక్తల్‌ సీఐ రాంలాల్‌ను కొందరు పొల్లాలో వెంబడించి తీవ్రంగా గాయపర్చారు.

గాయపడిన మరికొంత మంది పోలీసులు పక్కనే ఉన్న ఆలయంలోకి వెళ్లి దాక్కు­న్నా­రు. ఆందోళనకారులు ఒక పోలీసు వాహనంతో­పాటు రెండు బైక్‌లకు నిప్పంటించడంతో పూర్తిగా దగ్ధమయ్యాయి. డీఎస్పీ వాహనంతోపాటు మరో మూడు వాహనాల అద్దాలను ధ్వంసం చేశారు. గాయపడిన పోలీసులను ఆస్పత్రికి తరలించారు. కాగా, ఆందోళనకు కారణమైన వారి కోసం గాలిస్తున్నట్లు డీఎస్పీ సత్యనారాయణ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement