ఆర్టీసీ ఆటో సర్వీస్‌! | RTC signs agreement with electric auto aggregator | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ ఆటో సర్వీస్‌!

Jul 15 2026 3:25 AM | Updated on Jul 15 2026 3:25 AM

RTC signs agreement with electric auto aggregator

ఆర్టీసీ బస్‌ టికెట్‌తో పాటే ఎలక్ట్రిక్‌ ఆటో బుకింగ్‌ 

ఇంటి నుంచి బస్సు ఆగే పాయింట్‌ వద్దకు చేర్చే ఏర్పాటు 

వేరే ప్రాంతం నుంచి వచ్చేటప్పుడు బస్సు దిగగానే ఆటో సిద్ధం 

నగర ప్రయాణికులకు ఆర్టీసీ వినూత్న ప్రయోగం 

ఎలక్ట్రిక్‌ ఆటో అగ్రిగేటర్‌తో ఆర్టీసీ ఒప్పందం 

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ బస్సు ఎక్కాలంటే ప్రధాన బస్టాండుకో, మియాపూర్, ఎల్బీనగర్‌ లాంటి పాయింట్ల వద్దకో వెళ్లాల్సి ఉంటుంది. అందుకు ఇంటి నుంచి ఏ ఆటోనో, క్యాబ్‌నో బుక్‌ చేసుకుని వెళ్లాలి. కానీ అప్పటికప్పుడు వాటి కోసం వెతుకులాడాల్సిన అవసరం లేకుండా బస్‌ టికెట్‌తోపాటే ఓ ఎలక్ట్రిక్‌ ఆటో కూడా బుక్‌ అయి ఇంటికొచ్చి ప్రయాణికుడిని బస్‌స్టాండు వరకు సమయానికి చేర్చే సదుపాయాన్ని తెలంగాణ ఆర్టీసీ అందించనుంది. హైదరాబాద్‌ సిటీ వరకు ఈ సరికొత్త పద్ధతిని అందుబాటులోకి తీసుకురానుంది.  

ప్రైవేటు పోటీని తట్టుకునేందుకు.. 
ఆర్టీసీ భద్రమైందని, భరోసా కలిగించే ప్రయత్నం ఓవైపు చేస్తున్నప్పటికీ, కొత్తకొత్త సర్వీసులతో ప్రైవేటు ట్రావెల్స్‌ నిర్వాహ కులు ప్రయాణికులను ఆకట్టుకుంటున్నా రు. ఈ నేపథ్యంలో ప్రైవేటు పోటీని తట్టు కుని మరింత ఆక్యుపెన్సీ రేషియోను పెంచుకునేందుకు ఆర్టీసీ కొత్త పద్ధతులను అందుబాటులోకి తెస్తోంది. అందులో భాగంగా ఆర్టీసీ టికెట్‌తోపాటే ఎలక్ట్రిక్‌ ఆటోలో ఇంటి వరకు వెళ్లే ‘కాంబో’సర్వీసు ప్రారంభిస్తోంది. ఎలక్ట్రిక్‌ ఆటోలతో కూడిన ఓ యాప్‌ ఆధారిత అగ్రిగేటర్‌తో ఆర్టీసీ ఒప్పందం కుదుర్చుకోనుంది. 

ఇందుకు ప్రత్యేక యాప్‌ను సిద్ధం చేస్తోంది. హైదరాబాద్‌ నుంచి ఆర్టీసీ బస్సుల్లో దూర ప్రాంతాలకు వెళ్లేవారు ఆ యాప్‌ ద్వారా బస్‌ టికెట్‌ను బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ బస్సును నగరంలో ఏ పాయింట్‌/స్టాప్‌/బస్టాండు వద్ద, ఎన్నింటికి ఎక్కాలో అందులో స్పష్టంగా ఉంటుంది. ఆ పాయింట్‌ వద్దకు ఇంటి నుంచి చేరుకునేందుకు వీలుగా ఎలక్ట్రిక్‌ ఆటో సర్వీసు వివరాలు కూడా డిస్‌ప్లే అవుతాయి. 

బస్‌ టికెట్‌తోపాటు, ఆటోను కూడా బుక్‌ చేసుకుని యాప్‌ ద్వారా టికెట్‌ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు వచ్చేవారు బస్సు దిగిన తర్వాత ఇంటికి చేరుకునేందుకు కూడా ఆటోను బుక్‌ చేసుకోవచ్చు. సరిగ్గా ఆ సమయానికి ఆటో నిర్ధారిత (ఇల్లు లేదా బస్సు దిగిన ప్రాంతం) ప్రాంతానికి వచ్చి గమ్యం చేరుస్తుంది. బస్సు టికెట్‌ ధర, ఆటో రుసుము రెండూ కలిపి ఆర్టీసీకి చేరుతుంది. అందులో నుంచి ఆటో చార్జీని ఆర్టీసీ సంబంధిత అగ్రిగేటర్‌కు పంపుతుంది.  

రవాణా శాఖ చార్జీలే.. 
ప్రస్తుతం నగరంలో యాప్‌ ఆధారిత అగ్రిగేటర్లు ఆటో చార్జీలను సొంతంగా నిర్ధారిస్తున్నారు. కృత్రిమ మేధ సాయంతో ఆ చార్జీలు పరిస్థితిని బట్టి మారుతుంటాయి. చాలా సందర్భాల్లో ఎక్కువ మొత్తం చూపుతున్నాయి. కానీ ఇప్పుడు ఆర్టీసీ ఒప్పందం చేసుకునే అగ్రిగేటర్‌ ఆర్టీసీ ప్రయాణికుల కోసం రవాణాశాఖ నిర్ధారించిన చార్జీలను వసూలు చేయనుందని సమాచారం. ఈమేరకు ఆర్టీసీ అధికారులు ఒప్పందంలో షరతు విధించినట్టు తెలిసింది. దీనికి ఆ అగ్రిగేటర్‌ కూడా అంగీకరించినట్టు తెలిసింది. 

కొన్ని ప్రైవేటు ట్రావెల్స్‌ నిర్వాహకులు దూరంగా తమ బస్సు పాయింట్‌ వద్దకు వచ్చేందుకు ప్రయాణికులకు వాట్సాప్‌ ద్వారా మెట్రో రైలు టికెట్లను పంపుతున్న విషయం తెలిసిందే. కానీ ఆటో సర్వీసును ఎంగేజ్‌ చేసే కాంబో విధానాన్ని తొలిసారి తెలంగాణ ఆర్టీసీ అవలంబించనుంది. ఫస్ట్‌ మైల్, లాస్ట్‌ మైల్‌ కనెక్టివిటీలో భాగంగా ఆర్టీసీ ఈ ఏర్పాటు చేస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement