NIA intensified investigation in HuT case - Sakshi
Sakshi News home page

ఉగ్రవాదులు టార్గెట్‌ చేసిన రాష్ట్రాలు ఇవేనా?

Jun 6 2023 5:31 AM | Updated on Jun 6 2023 9:34 AM

NIA intensified investigation in HUT case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మధ్యప్రదేశ్‌ యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ (ఏటీఎస్‌) అధికారులు హైదరాబాద్‌–భోపాల్‌లలో అరెస్టు చేసిన ఉగ్రవాదులకు సంబంధించిన కేసు విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ముమ్మరం చేసింది. ఈ కేసును ఢిల్లీ యూనిట్‌ గత నెల 24న రీ–రిజిస్టర్‌ చేసిన విషయం తెలిసిందే. దీని దర్యాప్తు కోసం ఏర్పాటైన ప్రత్యేక ఎన్‌ఐఏ బృందం సోమవారం ఢిల్లీ నుంచి భోపాల్‌ చేరుకుంది.

ఏటీఎస్‌ అధికారులతో సమావేశమైన ఈ టీమ్‌.. కేసు పూర్వాపరాలు తెలుసుకుంది. గత నెల 9న∙ఏటీఎస్‌ అధికారులు హైదరాబాద్‌లో ఐదుగురు, భోపాల్‌లో 11 మందిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. హిజ్బ్‌ ఉత్‌ తెహ్రీర్‌ (హెచ్‌యూటీ) ఉగ్ర సంస్థకు చెందిన ఈ మాడ్యుల్‌ షరియత్‌ స్థాపనే లక్ష్యంగా విధ్వంసాలకు పథక రచన చేసింది.

వీరి టార్గెట్‌లో అనేక ప్రాంతాలతో పాటు మత నాయకులు కూడా ఉన్నట్లు ఏటీఎస్‌ ఆరోపిస్తోంది. కాగా, ఈ ఉగ్రవాదులు తెలంగాణ, మధ్యప్రదేశ్‌తో పాటు ఏయే రాష్ట్రాలను టార్గెట్‌గా చేసుకున్నారనే కోణంలో ఎన్‌ఐఏ దర్యాప్తు చేస్తోంది. ఆయుధాలు, మందుగుండు సామగ్రితో పాటు పేలుడు పదార్థాలనూ సమీకరిస్తున్న వీరి అసలు కుట్ర ఏమిటి అన్నదానిపై ఎన్‌ఐఏ దృష్టి సారించింది.

ఈ 16 మంది ఉగ్రవాదులను అధికారులు ఇప్పటికే రెండుసార్లు తమ కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించారు. ఎన్‌ఐఏ అధికారులు సైతం హైదరాబాద్, భోపాల్‌లకు చెందిన మహ్మద్‌ సలీం, యాసిర్‌ ఖాన్‌లతో పాటు మిగిలిన వారినీ మరోసారి కస్టడీలోకి తీసుకోవాలని భావిస్తున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా త్వరలో వీరిని హైదరాబాద్‌ తీసుకురావాలని ఎన్‌ఐఏ నిర్ణయించింది.  

Advertisement
 
Advertisement
Advertisement