సాక్షి,కృష్ణ: జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అధికారులు విజయవాడలో మెరుపు సోదాలు చేపట్టారు. బుధవారం తెల్లవారుజాము నుంచే ఎన్ఐఏ బృందాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి.
ఇటీవల విజయవాడకు చెందిన మహమ్మద్ డానిష్, సోహైల్ బేగ్,మహమ్మద్ రహమతుల్లా అనే ముగ్గురు యువకులను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నారనే ఆరోపణలపై ఇంటెలిజెన్స్, టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
ఆన్లైన్ ద్వారా యువతను తీవ్రవాదం వైపు ఆకర్షించడం, జిహాదీ కార్యకలాపాలకు ప్రణాళికలు వేయడం లాంటి ఆరోపణలు వీరిపై ఉన్నాయి. ఈ ముగ్గురి ఇళ్లతో పాటు వారి బంధువుల ఇళ్లలోనూ ఎన్ఐఏ అధికారులు ప్రస్తుతం సోదాలు చేస్తున్నారు
మొదట విజయవాడ వన్టౌన్ కొత్తపేట పోలీసులు నమోదు చేసిన ఈ కేసులో వేర్వేరు రాష్ట్రాల లింకులు బయటపడటంతో, దీని తీవ్రతను బట్టి ఇటీవలే ఈ కేసును అధికారికంగా కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకు బదిలీ చేశారు. అప్పటి నుంచి ఈ ఆన్లైన్ నెట్వర్క్పై అధికారులు నిఘా పెట్టారు.
ఇప్పటికే అరెస్టయిన ఈ ముగ్గురు నిందితులకు నగరంలో లేదా ఇతర ప్రాంతాలలో మరికొందరితో ఏమైనా రహస్య సంబంధాలు ఉన్నాయా? అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. డిజిటల్ పరికరాలు, సోషల్ మీడియా ఖాతాలు మరియు ఏవైనా అనుమానాస్పద పత్రాలు దొరుకుతాయేమోనని ఇళ్లలో ప్రతి అంగుళాన్ని అధికారులు తనిఖీ చేస్తున్నారు.


