సీబీఐ లేదా సిట్తో విచారణ జరిపించాలి
సుప్రీంకోర్టులో పిల్ దాఖలు
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీలో కేవలం ఏడు వారాల వ్యవధిలో ఏడు కస్టోడియల్ మరణాలు, ఇతర తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలపై సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. బదరవాడ వేణుగోపాల్ అలియాస్ బాబా ఖతర్నాక్ దాఖలు చేసిన ఈ పిల్ ఈ నెల 24న విచారణకు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో పాలన, పోలీసుల జవాబుదారీతనం, ప్రాథమిక హక్కుల రక్షణపై రాజ్యాంగపరమైన ప్రశ్నలేవనెత్తుతూ పిటిషనర్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.
కస్టడీలో ఉన్న గాదె సాయికృష్ణ అదృశ్యం, పేరుపోగు క్రాంతికుమార్ మృతి, రెండున్నరేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి అదృశ్యం, సుగాలి ప్రీతికి సంబంధించిన ఆందోళనలు, అలాగే మాల గంగమ్మ, కళావతి, తాయారమ్మ, వీధి నవీన్కుమార్ల మరణాలను ఇందులో ప్రధానంగా ప్రస్తావించారు. కావలిలో గిరిజన మహిళను వివస్త్రను చేసి దాడిచేసి, బహిరంగంగా అవమానించిన ఘటనను కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ఈ ఘటనలన్నింటిపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐతో దర్యాప్తు చేయించాలని లేదా ఏపీతో సంబంధం లేని అధికారులతో కూడిన కోర్టు పర్యవేక్షక స్వతంత్ర ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్కు) దర్యాప్తును బదిలీ చేయాలని పిటిషనర్ విజ్ఞప్తి చేశారు.


