అదే వేదిక.. అదే పోరు | Chaos At Jantar Mantar As Police Lathi-Charge Protesters | Sakshi
Sakshi News home page

అదే వేదిక.. అదే పోరు

Jul 22 2026 5:01 AM | Updated on Jul 22 2026 5:01 AM

Chaos At Jantar Mantar As Police Lathi-Charge Protesters

మంగళవారం జంతర్‌మంతర్‌ వద్ద గుమిగూడిన సీజేపీ మద్దతుదారులు

పోలీసులు తరిమికొట్టినా వేలాదిగా జంతర్‌మంతర్‌కు చేరుకున్న సీజేపీ కార్యకర్తలు, విద్యార్థులు 

లాఠీచార్జ్, అణిచివేతతో ఐక్యతను చెదరగొట్టలేరన్న దీప్కే

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ ప్రాంగణంలో తమ డిమాండ్ల సాధనకు బయల్దేరిన వేలాది మంది కాక్రోచ్‌ జనతాపార్టీ కార్యకర్తలు, విద్యార్థులు, తల్లిదండ్రులు, సామాజిక, విద్యావేత్తలను లాఠీచార్జ్, బాష్పవాయుగోళాల ప్రయోగంతో చెదరగొట్టి, జంతర్‌మంతర్‌ వద్ద దీక్షాస్థలిని తొలగించినా ఉద్యమకారులు మళ్లీ మొదటి నుంచి తమ ఉద్యమాన్ని ఆరంభించారు. సోమవారం సాయంత్రం కార్యకర్తలందరినీ దీక్షాస్థలి నుంచి తరిమికొట్టినా మంగళవారం మధ్యాహ్నంకల్లా అందరూ మళ్లీ అదే దీక్షాస్థలికి వచ్చి నిరసనను మొదలెట్టారు. ‘‘పోలీసుల దాష్టికం చూశాక ఉద్యమం మరింత ఉధృతమైంది. సోమవారం కంటే ఎక్కువ మంది ఈరోజు దీక్షాస్థలికి చేరుకున్నారు. డజన్ల మంది విద్యార్థుల ఆత్మహత్యల బలిదానాలతో ఈ ఉద్యమం మొదలైంది. దీనిని వృథాగా పోనివ్వం.

మా డిమాండ్లు నెరవేరేదాకా పోరాడతాం’’ అని ఉద్యమకారులు పునరుద్ఘాటించారు. నిరసన కార్యక్రమం మంగళవారం 32వ రోజుకు చేరిన సందర్భంగా జంతర్‌మంతర్‌లో సీజేపీ చీఫ్‌ అభిజిత్‌ దీప్కే ప్రసంగించారు. ‘‘సోమవారం చర్చల పేరిట మోదీ సర్కార్‌ మా సమయాన్ని వృథాచేసింది. కుట్రప్రకారం మా ప్రతినిధులు అశుతోష్, సౌరవ్‌ దాస్‌లను ఆరోగ్యమంత్రి జేపీ నడ్డా నివాసానికి పిలిపించి అక్కడ వారిని నిలువరించారు. వాళ్ల మొబైల్స్‌ లాక్కున్నారు. ఓవైపు చర్చలంటూనే మరోవైపు వీధుల్లో విద్యార్థులను తలలు పగలగొట్టారు’’అని దీప్కే ఆగ్రహం వ్యక్తంచేశారు.

లాఠీచార్జ్, అణచివేతతో తమ ఐక్యతను పోలీసులు చెదరగొట్టలేరని దీప్కే అన్నారు. ఆస్పత్రిలో వాంగ్‌చుక్‌ నిరాహార దీక్ష కొనసాగిస్తుండటంతో ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందని దీప్కే ఆవేదన వ్యక్తంచేశారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పెద్దసంఖ్యలో సీజేపీ కార్యకర్తలు దీక్షాస్థలికి చేరుకున్నారు. వాంగ్‌చుక్‌ దీక్షకు గుర్తుగా జంతర్‌మంతర్‌ వద్ద ఆయన చిత్రపటాన్ని, రాజ్యాంగ ప్రతి, చర్కాను పెట్టారు. 

సీజేపీ నుంచి విజేత దహియా బయటకు.. 
సోమవారం పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్న వేళ ప్రతిఘటించాల్సిందిపోయి జంతర్‌మంతర్‌ వద్ద తాపీగా బర్గర్‌ తింటూ కన్పించిన పార్టీ అధికార ప్రతినిధి విజేత దహియాను సీజేపీ బయటకు పంపేసింది. ఆయనను పార్టీ బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్లు సీజేపీ మంగళవారం ప్రకటించింది. దహియా సోమవారం బర్గర్‌ తింటున్న వీడియో బయటకు రావడంతో పలువురు నిరసనకారులు ఆయన నిబద్ధతను ప్రశ్నించారు. దీనిపై దహియా స్పందించారు. ‘‘రెండ్రోజులుగా అందరిలా రోడ్లపై నిద్రలేని రాత్రులు గడిపా. ఆకలేసి బర్గర్‌ తినడం కూడా తప్పేనా?’’అని ‘ఎక్స్‌’లో ఒక పోస్ట్‌పెట్టారు.  

గాయాలతో వెంటిలేటర్‌పై విద్యార్థిని
న్యూఢిల్లీ: చలో సంసద్‌ సందర్భంగా సోమ వారం పోలీసుల లాఠీచార్జి, బాష్పవాయువు ప్రయోగంలో గాయపడిన 23 ఏళ్ల విద్యార్థిని సాక్షి ప్రస్తుతం రామ్‌ మనోహర్‌ లోహియా ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నట్లు అధికార వర్గాలు మంగళవారం వెల్లడించాయి. బాష్పవాయువు ప్రయోగం తర్వాత నిరసనకారులు పరుగులు తీయడంతో ఏర్పడిన తొక్కిసలాట వంటి పరిస్థితుల్లో ఆ యువతి ఊపిరి ఆడక ఇబ్బంది పడినట్లు భావిస్తున్నారు.

ఆమె ముఖం, ఛాతీ, మెడ భాగాల్లో గాయాలైనట్లు సాక్షి కుటుంబ సభ్యులు చెప్పారు. వెంటిలేటర్‌పై ఉన్నప్పటికీ చికిత్సకు స్పందిస్తోందని తెలిపారు. నిరసన జరిగిన సమయంలో ఆ యువతి తన బంధువుతో కలిసి అక్కడే ఉంది. ఆమె బంధువు కాలికి కూడా గాయాలయ్యాయి. దక్షిణ ఢిల్లీలోని ఛత్తర్‌పూర్‌ ఎక్స్‌టెన్షన్‌ ప్రాంతానికి చెందిన బాధిత యువతి సాక్షి అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా ఇన్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ కోర్సు అభ్యసిస్తోంది. చాలారోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement