లా అండ్‌ ఆర్డర్‌ చట్ట నిబంధనలకు అనుగుణంగా ఉండాలి | High Court is once again deeply angry over the conduct of the AP Police | Sakshi
Sakshi News home page

లా అండ్‌ ఆర్డర్‌ చట్ట నిబంధనలకు అనుగుణంగా ఉండాలి

Jul 22 2026 5:08 AM | Updated on Jul 22 2026 7:57 AM

High Court is once again deeply angry over the conduct of the AP Police

అంతే తప్ప పోలీసులకు నచ్చినట్లు కాదు: హైకోర్టు ఆగ్రహం

పోలీసులు కవులుగా మారిపోయారు

వారు తలచుకుంటే ఏదైనా సృష్టించగలరు 

ప్రభుత్వం మారిన తరువాత వాంగ్మూలాలు మార్చేస్తున్నారు.. గత ప్రభుత్వ హయాంలో నిందితులుగా ఉన్న వారికి క్లీన్‌చిట్‌లు ఇచ్చేస్తున్నారు

ఇలాంటి పరిస్థితులు ఉండటం దురదృష్టకరం 

హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు.. కౌంటర్ల దాఖలుకు ఆదేశం

సాక్షి, అమరావతి: ఎన్ని సార్లు చీవాట్లు పెట్టినా.. ఎన్ని కేసుల్లో తలంటినా ఆంధ్రప్రదేశ్‌లో పోలీసుల తీరు మారడం లేదు. తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు షరామామూలుగా మారిపోయింది. ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు మరోసారి తీవ్రస్థాయిలో మండిపడింది. లా అండ్‌ ఆర్డర్‌ అన్నది చట్ట నిబంధనలకు అనుగుణంగానే ఉండాలి తప్ప, పోలీసులకు నచ్చినట్లు కాదని తేల్చి చెప్పింది. పోలీసులు కవులుగా మారిపోయారని, వారు తలచుకుంటే ఏదైనా సృష్టించగలరంది. ప్రభుత్వం మారిన తరువాత గతంలో నమోదైన కేసుల్లో సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాలను సైతం మార్చేసి నిందితులకు క్లీన్‌చిట్‌లు ఇస్తేస్తున్నారని తెలిపింది. ఇలాంటి పరిస్థితులు ఉండటం దురదృష్టకరమని హైకోర్టు పేర్కొంది. 

మాజీ స్పీకర్, వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత తమ్మినేని సీతారాం, ఆయన భార్య వాణి, కుమారుడు వెంకట శ్రీరాం చిరంజీవి నాగులపై నమోదు చేసిన ఫోర్జరీ కేసులో పోలీసుల తీరును హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. వివాదానికి కారణమైన రిజిస్టర్డ్‌ డాక్యుమెంట్‌ వెంకట శ్రీరాం చిరంజీవి నాగు పేరు మీద ఉంటే, అతని తండ్రి తమ్మినేని సీతారాం, తమ్మినేని వాణిని ఎందుకు నిందితులుగా చేర్చారని పోలీసులను నిలదీసింది. నాగు తమ్ముళ్లు, బావమరుదులు, ఇతర కుటుంబ సభ్యులను కూడా నిందితులుగా చేర్చి ఉండాల్సిందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. ఈ కేసుకు రాజకీయ రంగు పులిమారని తెలిపింది. 

ఈ కేసులో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని అటు పోలీసులను, ఇటు ఫిర్యాదుదారుడిని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్‌ జస్టిస్‌ యడవల్లి లక్ష్మణరావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి అరెస్ట్‌ నుంచి సీతారాం, ఆయన కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించేందుకు నిరాకరించారు. క్వాష్‌ పిటిషన్‌లో ఎలాంటి రక్షణ కల్పించలేమని, అరెస్ట్‌ భయం ఉంటే ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసుకోవాలని స్పష్టం చేశారు. 

మాపై కేసు కొట్టేయండి.. అప్పటి వరకు తదుపరి చర్యలన్నీ నిలిపేయండి 
ఫోర్జరీ ధ్రువీకరణ పత్రాలతో ఆస్తి రిజిష్టర్‌ చేయించుకున్నారని ఆరోపిస్తూ కట్టా జయకిషోర్‌ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తమపై శ్రీకాకుళం గ్రామీణ పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ తమ్మినేని సీతారాం, ఆయన భార్య వాణి, కుమారుడు వెంకట శ్రీరాం చిరంజీవి నాగు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. 

ఈ వ్యాజ్యంపై మంగళవారం న్యాయమూర్తి డాక్టర్‌ జస్టిస్‌ లక్ష్మణరావు విచారణ జరిపారు. తమ్మినేని తరఫున సీనియర్‌ న్యాయవాది చిత్తర్వు రఘు వాదనలు వినిపించారు. రజనీ అనే మహిళ నుంచి చట్టబద్ధంగా వెంకట శ్రీరాం చిరంజీవి నాగు భూమిని కొనుగోలు చేశారన్నారు. ఒక్క సెక్షన్‌ మినహా మిగిలిన సెక్షన్లన్నీ ఏడేళ్ల లోపు శిక్ష పడేవేనని తెలిపారు. అందువల్ల బీఎన్‌ఎస్‌ఎస్‌ సెక్షన్‌ 35(3) కింద నోటీసులిచ్చి వివరణ తీసుకునేలా పోలీసులను ఆదేశించాలని కోరారు.  

క్రిమినల్‌ కేసును సివిల్‌ కేసుగా చూపుతున్నారు
పోలీసుల తరఫున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ (పీపీ) మెండ లక్ష్మీనారాయణ వాదనలు వినిపిస్తూ, నకిలీ ధ్రువీకరణ పత్రాలతో విలువైన ఆస్తిని కాజేయాలని పిటిషనర్లు కుట్ర పన్నారన్నారు. ఈ సమయంలో న్యాయమూర్తి స్పందిస్తూ, డాక్యుమెంట్‌ వెంకట శ్రీరాం చిరంజీవి నాగు పేరు మీద ఉంటే, సీతారాం, ఆయన భార్యను ఎందుకు నిందితులుగా చేర్చారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా పోలీసులను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. స్థలం ఆక్రమణకు గురైందని తెలుసుకున్న వెంటనే పోలీసు కేసు పెట్టకుండా సివిల్‌ సూట్‌ ఎందుకు వేశారని న్యాయమూర్తి ప్రశ్నించారు. దావా దాఖలు చేసిన రెండేళ్ల తరువాత ఇప్పుడు కేసు ఎందుకు పెట్టారని కూడా ప్రశ్నించారు. 

ఆధారాలు చూపండి
ఫిర్యాదుదారు తరఫున సీనియర్‌ న్యాయవాది, టీడీపీ లీగల్‌ సెల్‌ అధ్యక్షుడు పోసాని వెంకటేశ్వర్లు స్పందిస్తూ, ఫోర్జరీ డాక్యుమెంట్ల వెనుక పిటిషనర్లు ఉన్నట్లు వారి ఉద్యోగులే వాంగ్మూలాలు ఇచ్చారని చెప్పారు. పోలీసులు ఏమైనా సృష్టించగలరని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఆస్తి కొనుగోలుకు సంబంధించి యజమాని రజనీకి డబ్బు చెల్లించినట్లు ఆధారాలు చూపాలని పిటిషనర్లకు న్యాయమూర్తి స్పష్టం చేశారు. చెక్కు ఇచ్చారా? డబ్బు ఇచ్చారా? ఇందుకు సంబంధించిన ఆధారాలను తమ ముందుంచి, సచ్చీలతను నిరూపించుకోవాలన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, ఈ వ్యవహారంలో కౌంటర్లు దాఖలు చేయాలని పోలీసులను, ఫిర్యాదుదారుడిని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 29కి వాయిదా వేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement