అధికారులపై అనుమానపు ‘నిఘా’! | State government issues a directive to monitor gazetted officers | Sakshi
Sakshi News home page

అధికారులపై అనుమానపు ‘నిఘా’!

Jul 22 2026 5:14 AM | Updated on Jul 22 2026 8:48 AM

State government issues a directive to monitor gazetted officers

హిట్లర్, ముస్సోలినీలను గుర్తు చేస్తున్న చంద్రబాబు 

గెజిటెడ్‌ స్థాయి అధికారులపై సీఎంకు అపనమ్మకం 

ప్రత్యేకంగా జాబితా తయారు చేయనున్న ప్రభుత్వం 

ఆ అధికారులపై నిత్యం నిఘా నేత్రం 

విధివిధానాలతో ప్రత్యేక జీవో జారీ 

నిఘా సమాచారంతో దారికి తెచ్చుకోవాలనే ఎత్తుగడ 

బాబు బ్లాక్‌మెయిల్‌ ఎత్తులపై అధికార వర్గాల ఆగ్రహం 

కీలక బాధ్యతల నుంచి బదిలీ చేసేందుకే ఈ పన్నాగం 

జీవోపై అధికారవర్గాలలో విస్తృత చర్చ  

సాక్షి, అమరావతి: అధికార యంత్రాంగంపై అనుమానం, అపనమ్మకాలను పెంచుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నియంతలా మారి ప్రజాస్వామ్య పాలనకు తూట్లు పొడుస్తుండడం చర్చనీయాంశంగా మారింది. తాను అనుకున్నదే వేదమని, తాను చెప్పిందే చేయాలని, అందుకు అనుగుణంగా పనిచేయని అధికార యంత్రాంగాన్ని గుర్తించాలని చంద్రబాబు తాజాగా నిర్ణయించారు. ఇందులో భాగంగా గెజిటెడ్‌ అధికారులపై నిఘా నేత్రాన్ని సంధించారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ఓ జీవో కూడా విడుదల చేసింది. ఈ జీవోపై అధికారవర్గాలు భగ్గుమంటున్నాయి. తాను చెప్పినట్లు చేయని అధికారులను నిఘా ద్వారా  సేకరించిన సమాచారంతో దారికి తెచ్చుకోవాలనే బ్లాక్‌మెయిల్‌ ఎత్తుగడలకు చంద్రబాబు దిగజారారని అధికార వర్గాలలో చర్చ జరుగుతోంది.

జర్మనీ నియంత అడాల్ఫ్‌ హిట్లర్‌ ఇదే మాదిరిగా తన అధికారులను, సైనికాధికారులను నిత్యం అనుమానంతోనే చూశాడని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇటలీ నియంత బెనిటో ముస్సోలినీ అయితే అచ్చు మన బాబుగారిలానే ప్రభుత్వ యంత్రాంగంపై కఠిన నిఘా వ్యవస్థను అమలు చేశాడని వారు గుర్తు చేస్తున్నారు. ముస్సోలినీ ప్రత్యేకంగా వోవ్రా అనే రహస్య నిఘా సంస్థ ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ ప్రత్యర్థులు, సైనికాధికారులకు సంబంధించిన సమాచారాన్ని పోగేసి వేధించేవాడని విమర్శకులంటున్నారు.  

గెజిటెడ్‌ అధికారుల నిజాయితీపై సందేహమా..? 
ఇటీవలే నిర్వహించిన మంత్రులు, కార్యదర్శులు, శాఖాధిపతులు సమావేశంలో ముఖ్యమంత్రి చంద్ర­బాబు  ప్రభుత్వంలోని పై స్థాయి అధికారులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రభుత్వంలో కొందరు వ్యక్తులు కీలక స్థానాల్లో ఉండి ప్రతికూల పాత్ర పోషిస్తున్నారు, అలాంటివి సహించబోను, అలాంటి వ్యక్తు­లు ఉన్నప్పుడు ఎంత ప్రయత్నించినా ఆశించిన ఫలితాలు రావు’’ అన్నారు. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లు ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా జీవో విడుదలయిపోయింది. ప్రభు­త్వంలోని గెజిటెడ్‌ అధికారుల నిజాయితీపై సందేహాన్ని, నైతికతపై అనుమానాలను వ్యక్తం చేస్తూ అటువంటి అధికారుల జాబితాలను తయారు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి­ప్రసాద్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.  

కేంద్రప్రభుత్వ విధానమే అయినా.. ఆ ఉద్దేశం వేరు.. 
కేంద్ర ప్రభుత్వం ‘అంగీకరించిన జాబితా’ ప్రకారం కీలకమైన పదవులలో ఉన్న అధికారుల నిజాయితీపై ఎటువంటి సందేహం లేదని నిర్ధారించడానికి కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌ ఈ నిఘా సాధనాన్ని వినియోగిస్తుంది. దేశ అంతర్గత భద్రత, రక్షణ వ్యవహారాల్లో కీలక పదవులు నిర్వహిస్తున్న వారి ఇంటిగ్రిటీపై నిఘాను ఉంచుతుంది. దేశ రక్షణ రీత్యా అది అవసరం. కానీ రాష్ట్రాల్లో అటువంటి పరిస్థితి ఉండదు. కేంద్ర ప్రభుత్వ తరహా విధానాన్నే రాష్ట్రంలో అమలు చేయాలని నిర్ణయించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీనిని అంగీకరించిన జాబితా వ్యవస్థగా పేర్కొంటారు. 

‘నిఘా’ జీవోలో ఏం ఉందంటే.. 
» రాష్ట్ర అవినీతి నిరోధక బ్యూరో, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ శాఖను సంప్రదించి ‘అంగీకరించిన గెజిటెడ్‌ అధికారుల జాబితా’ను సాధారణ పరిపాలన శాఖ తయారు చేస్తుంది. 

» గెజిటెడ్‌ హోదా కలిగిన అధికారుల నిజాయితీకి సంబంధించి ఫిర్యాదులు, సందేహాలు లేదా అనుమానాలు ఉన్నప్పుడు, పదవిని దుర్వినియోగం చేసే అవకాశం ఉందని సూచించే ప్రవర్తనా సరళి ఉన్నప్పుడు విజిలెన్స్, ఇంటెలిజెన్స్‌ వర్గాల నుండి సమాచారం అందినప్పుడు వారి పేర్లను అంగీకరించిన జాబితాలో చేర్చుతారు.  

» నిర్ణయాలను ఆరోపణలపై కాకుండా విశ్వసనీయమైన ఆధారాలపై తీసుకోవాలి, అనామక, మారుపేరుతో కూడిన ఫిర్యాదులు స్వీకరించరు. ఏదైనా నిజమైన ఫిర్యాదుపై సమాచారం కోసం ఏ అధికారిపై నైనా, ధృవీకరణ కోసం 90 రోజుల కాలపరిమితి నిర్దేశించారు. ఈ జాబితాను సాధారణ పరిపాలన శాఖ ఖరారు చేస్తుంది.  

అధికారులపై చర్యలు ఇలా.. 
»  అధికారుల పని, నిర్ణయాలను మరింత నిశితంగా, తరచుగా పరిశీలించడం. 
» అవసరమైన చోట, సున్నితమైన, కీలక బాధ్యతల నుండి వేరే చోటికి బదిలీ చేయడం. 
» అధికారుల ప్రతిష్ట, ప్రవర్తనను రహస్యంగా ధృవీకరించడం. 
»  ఆస్తులు, జీవనశైలిపై చట్టబద్దమైన మార్గాల ద్వారా నిఘా ఉంచడం 
» ఏవైనా అవినీతి కార్యకలాపాలు ఉంటే, వాటికి సంబంధించిన నిఘా సమాచారాన్ని సేకరించడం. 
» అంగీకరించిన జాబితాలో చేర్చడం శిక్షగా పరిగణించరు. 
» తగిన సాక్ష్యాధారాలు లేకుండా, సరైన విధానాన్ని అనుసరించకుండా ఎటువంటి ప్రతికూల చర్య తీసుకోరు. గోప్యతను ఖచ్చితంగా పాటించాలి. 
»  అంగీకరించిన జాబితా ఒక సంవత్సరం పాటు అమలులో ఉంటుంది. దీనిని ప్రతి ఏటా సమీక్షించాలి. 
» రాష్ట్రంలో ‘అంగీకరించిన జాబితా వ్యవస్థ‘ నిర్వహణకు సాధారణ పరిపాలన శాఖ నోడల్‌ ఏజెన్సీగా ఉంటుంది. 
» ఏసీబీ, విజిలెన్స్‌–ఎన్‌ఫోర్స్‌మెంట్‌ శాఖలతో కూడిన సంప్రదింపుల యంత్రాంగం ఏర్పాటు, కార్యాచరణ, మార్గదర్శకాలపై ఉత్తర్వులు విడిగా జారీ చేస్తారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement