కందుకూరు రెండో వేలం కేంద్రంలో ధరలు లేవంటూ రైతుల మండిపాటు
వేలాన్ని అడ్డుకున్న రైతులు
బ్రైట్ గ్రేడ్ రకం ధరలూ తగ్గించేస్తున్నారని ఆవేదన
కందుకూరు: ఈ ఏడాది పొగాకు వేలం ముందుకు సాగడంలేదు. కనీస ధరల కోసం రైతులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. అయినా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. మంగళవారం ప్రకాశం జిల్లా కందుకూరులోని రెండో పొగాకు వేలం కేంద్రంలో ధరలు రావడంలేదంటూ రైతులు వేలాన్ని అడ్డుకున్నారు. లింగసముద్రం మండలంలోని తిమ్మారెడ్డిపాలెం క్లస్టర్కు చెందిన రైతులు పొగాకు బేళ్లను వేలం కేంద్రానికి తీసుకొచ్చారు. వేలం ప్రారంభమైన కొద్దిసేపటికే ధరలను వ్యాపారులు తగ్గించేయడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గిట్టుబాటు ధరలు ఇచ్చే వరకు వేలాన్ని ఆపేయాలని డిమాండ్ చేస్తూ వేలాన్ని అడ్డుకున్నారు. దీంతో అధికారులు వేలాన్ని పూర్తిగా నిలిపేశారు.
ఎఫ్2, ఎఫ్3 వంటి బ్రైట్ గ్రేడ్ రకాలకు కూడా క్వింటాకు రూ.16 వేల నుంచి రూ.17 వేలు మాత్రమే ఇస్తున్నారని, ఈ రకం క్వింటా రూ.20 వేల నుంచి రూ.24 వేల వరకు కొనుగోలు చేయాలని కోరారు. ఇంత తక్కువ ధరలో కనీసం పెట్టుబడులు కూడా రావని ఆవేదన వ్యక్తం చేశారు. గిట్టుబాటు ధరల కోసం రెండు నెలలుగా ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వానికి, అధికారులకు పట్టడంలేదని మండిపడ్డారు. ఇదిలాగే కొనసాగితే రైతులకు ఆత్మహత్యలు తప్ప మరో దారి లేదని విచారం వ్యక్తం చేశారు. రైతులు, అధికారుల మధ్య చర్చలు ఫలించకపోవడంతో మంగళవారం పూర్తిగా వేలం నిలిచిపోయింది.


