దోషులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు
వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం
సమర్థులైన లాయర్లను నియమించాం
యువత భవిష్యత్తుతో రాజకీయాలు వద్దు
లీకేజీ జాఢ్యాన్నిఅంతం చేయాల్సిందే
ఇందుకోసం కేంద్రం, రాష్ట్రాలు కలిసి పనిచేయాలి
‘మంగళ్ మిలన్’ భేటీలో ప్రధాని మోదీ స్పష్టీకరణ
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించిన నీట్–యూజీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా స్పందించారు. ప్రశ్నపత్రాలను లీక్ చేయడం ‘ఘోరమైన పాపం’గా అభివర్ణించారు. ఈ పాపానికి ఒడిగట్టినవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చిచెప్పారు. యువత భవిష్యత్తుతో ఆటలాడితే ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టంచేశారు. మంగళవారం పార్లమెంట్ లైబ్రరీ భవనంలో ‘మంగళ్ మిలన్’పేరిట జరిగిన ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశంలో తమ కూటమి ఎంపీలను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగించారు.
పేపర్ లీక్ అనేది పార్టీల రాజకీయాలకు సంబంధించిన అంశం కాదని.. జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన అంశమని వెల్లడించారు. ఈ జాఢ్యాన్ని అంతం చేయడానికి కేంద్రం, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలతో ఆప్యాయత, అనురాగంతో సన్నిహిత సంబంధాలు కొనసాగించాలని, యువత విశ్వాసాన్ని పొందాలని ఎన్డీయే ఎంపీలకు సూచించారు. ‘మంగళ్ మిలన్’ముగిసిన అనంతరం కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు మీడియాతో మాట్లాడారు. మోదీ ప్రసంగం వివరాలను వెల్లడించారు. ప్రశ్నపత్రం లీక్ అయినట్లు వార్తలు రాగానే ప్రభుత్వం తక్షణమే స్పందించిందని, 13 మందిని అరెస్టు చేసి జైలుకు పంపిందంటూ ప్రధానమంత్రి చెప్పారని వెల్లడించారు. ఈ సమావేశం ఎంతో ఫలప్రదంగా సాగిందని, ప్రధాని అనేక ముఖ్యమైన అంశాలపై మాట్లాడారని రిజిజు పేర్కొన్నారు.
యువతతో ఎంపీలు మమేకం కావాలి
విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినకుండా ‘నీట్’పునఃపరీక్షకు ప్రాధాన్యతనిచి్చ, దానిని విజయవంతంగా నిర్వహించి, ఫలితాలను ఎటువంటి జాప్యం లేకుండా ప్రకటించినట్లు ప్రధానమంత్రి పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి పేపర్ లీక్లు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం ఎల్లప్పుడూ విద్యార్థులకు అండగా ఉంటుందన్నారు. దేశ ప్రయోజనాలకు సంబంధించిన కీలకమైన అంశంలో రాజకీయాలు చేయడం తగదని పేర్కొన్నారు. యువత విశ్వాసాన్ని పొందాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా యువతతో మమేకం కావాలన్నారు.
వారి ప్రయోజనాల పరిరక్షణ కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలను వివరించాలని చెప్పారు. నీట్ పేపర్ లీకేజీలో ప్రమేయం ఉన్నవారికి కఠిన శిక్ష పడేలా చూసేందుకు అత్యంత సమర్థులైన న్యాయవాదులను రంగంలోకి దించినట్లు గుర్తుచేశారు. దోషులను శిక్షించాలని, పేపర్ లీకేజీలు జరగకుండా పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఉద్ఘాటించారు. విద్యార్థులకు ఎలాంటి అన్యాయం జరగకూడదని అన్నారు. వారిని తప్పుదోవ పట్టించడం సులభమే అయినప్పటికీ సరైన మార్గంలో నడిపించడం మాత్రం కష్టమని వ్యాఖ్యానించారు. వారు మంచిమార్గంలో నడిచేలా చూడడం మనందరి బాధ్యత అని స్పష్టంచేశారు. రాజకీయంగా విభేదాలు ఉన్నప్పటికీ, యువత భవిష్యత్తు కోసం అందరూ కలిసికట్టుగా పని చేయాలన్నారు.
ఎఫ్టీఏలతో దేశానికి లాభం
అలాగే గత కొన్ని నెలల్లో దేశం సాధించిన విజయాల మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇటీవల అనేక దేశాలతో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల(ఎఫ్టీఏ) గురించి ఎన్డీయే ఎంపీలకు వివరించారు. ఈ ఒప్పందాలతో మన రైతాంగానికి, మన దేశానికి లాభమే తప్ప ఎలాంటి నష్టం జరగదన్నారు. దేశ ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. దేశ శ్రేయస్సు కోసం జీవితంలోని ప్రతి క్షణాన్నీ అంకితం చేయాలని ఎంపీలను కోరారు. ‘‘దేశమే ప్రథమం, దేశ పురోగతి, సంక్షేమం కోసం మనం నిరంతరంకృషి చేయాలి’’అని పిలుపునిచ్చారు. కొత్తగా రాజ్యసభకు ఎన్నికైన సభ్యులకు ప్రధానమంత్రి అభినందనలు తెలియజేశారు. ‘‘ప్రధాన సేవక్ (ప్రధాని మోదీ) శరీరంలోని ప్రతి అణువూ, ఆయన సమయంలోని ప్రతి క్షణమూ పిల్లల భవిష్యత్తు కోసమే అంకితం’’ అని బీజేపీ ‘ఎక్స్’లో పోస్టు చేసింది.


