హైదరాబాద్: పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతితో సహజీవనం చేసి వేధింపులకు పాల్పడడంతో పాటు దాడి చేసిన యువకుడిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్కు చెందిన యువతి (25) ఈవెంట్ డ్యాన్సర్గా పనిచేస్తోంది. ఈమెకు రగంటి మనోజ్ (28)తో పరిచయం ఏర్పడింది. మనోజ్ తనను పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఆమె అతడి వివాహ ప్రతిపాదనను అంగీకరించింది.
ఈ క్రమంలో యూసుఫ్గూడలో ఇద్దరూ ఏడాది పాటు కలిసి ఉన్నారు. ఈ సమయంలో మనోజ్ పలుమార్లు ఆమెతో శారీరిక సంబంధం పెట్టుకున్నాడు. ఇతర యువతులతో కూడా అతడి సంబంధాల గురించి ప్రశ్నించినప్పుడు గొడవ పడడంతో పాటు ఆమెపై కూడా దాడి చేశాడు. ఈ క్రమంలో ఈ నెల 13న తెల్లవారుజామున మద్యం మత్తులో గదికి వచ్చిన మనోజ్ ఆమెను శారీరికంగా వేధించాడు. ఓ మహిళా సహోద్యోగి గురించి ప్రశ్నించడంతో ఆమెపై దాడి చేసి ముఖంపై తీవ్రంగా కొట్టాడు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


