నల్లగొండ జిల్లా: పట్టణ కేంద్రంలోని జేబీ కాలనీలో ఐదు రోజుల క్రితం జరిగిన కల్లు రూపా రెడ్డి హత్య మిస్టరీ ఇంకా వీడలేదు. హంతకుడు గ్లౌజులు ధరించి ఈ దారుణానికి పాల్పడటంతో ఘటనా స్థలంలో ఎలాంటి ఆనవాళ్లూ లభించలేదు. దీంతో ఈ కేసును ఛేదించడం పోలీసులకు సవాలుగా మారింది.
అయితే, లభ్యమైన సీసీ ఫుటేజీల ఆధారంగా హత్య చేసిన నిందితుడి వయసు 20 నుంచి 25 ఏళ్లు ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. పట్టణంలో ఎక్కడ చూసినా, విన్నా రూపారెడ్డి హత్య గురించే సర్వత్రా చర్చ సాగుతోంది. హత్య మిస్టరీని ఛేదించేందుకు పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా పాఠశాల సిబ్బందిని, కాలనీ వాసులను, కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు.
సీసీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మరోవైపు, శనివారం ప్రత్యేక నిఘా విభాగానికి (స్పెషల్ బ్రాంచ్) చెందిన పోలీసులు సైతం రంగంలోకి దిగారు. మృతురాలు రూపారెడ్డి ప్రిన్సిపాల్గా పనిచేస్తున్న పాఠశాలలో.. 2010 నుంచి 2025 బ్యాచ్ల వరకు పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థుల వివరాలను సేకరించి, ఆ కోణంలో కూడా దర్యాప్తును ముమ్మరం చేసినట్లు సమాచారం.


