హైదరాబాద్: బోనాల పండగ కోసం కుటుంబ సభ్యులతో కలిసి సొంతూరుకు వెళ్తుండగా.. మృత్యురూపంలో వచ్చిన ఓ లారీ.. యువతిని బలి తీసుకుంది. ఈ విషాదకర ఘటన ఘట్కేసర్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వారాసిగూడలో ఉంటున్న గూబ సురేశ్, ఉమారాణి దంపతులు కూతురు శ్రావణి (30)తో కలిసి ఆదివారం జరిగే బోనాల పండగకు సొంతూరైన వరంగల్ జిల్లా రాయపర్తి మండలం సన్నూర్ గ్రామానికి ద్విచక్ర వాహనంపై శనివారం బయలుదేరారు.
ఘట్కేసర్ బైపాస్ రోడ్డులో వందన హోటల్ హెచ్పీ పెట్రోల్ పంపు వద్దకు చేరుకోగానే అతివేగంతో వచ్చిన లారీ వెనక వైపు నుంచి వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. దీంతో ద్విచక్ర వాహనం రోడ్డుపై పడిపోగా వెనక కూర్చున్న తలకు తీవ్రగాయాలు కావడంతో శ్రావణి అక్కడికక్కడే దుర్మరణం చెందింది. సురేశ్, ఉమారాణికి స్వల్ప గాయాలయ్యాయి. లారీ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.


