హైదరాబాద్: 2027 జనాభా లెక్కల్లో ఓబీసీలకు ప్రత్యేక కేటగిరీ ఏర్పాటు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రధానికి లేఖ రాశారు పొన్నం. ‘ ఓబీసీ, ఎస్ఈబీసీల సమగ్ర కులగణకు ప్రత్యేక విధానం రూపొందించాలి. ఎస్సీ, ఎస్టీలతో పాటు ఓబీసీలకు ప్రశ్నావళిలో ప్రత్యేక కేటగిరి చేర్చాలి. ప్రతి కులం, సముదాయానికి డిజిటల్ కోడ్లు కేటాయించాలి.
కులగణనలో బీసీల సమాచారాన్ని సేకరించాలి. బీసీల లెక్కలు తేలితేనే సామాజిక న్యాయం జరుగుతుంది. SECC-2011లో ఎదురైన కులపేర్ల సమస్యలు 2027 జనాభా లెక్కల్లో పునరావృతం కాకూడదు.
రాష్ట్రాల వారీగా మాస్టర్ కుల డైరెక్టరీ.. ప్రతి కులం, సముదాయానికి డిజిటల్ కోడ్లు ఇవ్వాలి. స్థానిక, వివాదాస్పద కులపేర్ల నమోదుకు ప్రత్యేక ధృవీకరణ విధానం ఉండాలి. వ్యక్తి స్వయంగా ప్రకటించిన కులం, అధికారిక వర్గీకరణ రెండింటినీ డేటాలో భద్రపరచాలి. తెలంగాణ SEEPC సర్వే అనుభవాలను 2027 జనాభా లెక్కల రూపకల్పనలో పరిగణనలోకి తీసుకోవాలి’ అని లేఖలో పేర్కొన్నారు.


