
పోలీస్స్టేషన్ ఆవరణలో మహిళా కుటుంబసభ్యుల రగడ
అన్నానగర్: కృష్ణగిరిలోని పోచంపల్లి సమీపంలో అదృశ్యమైన కళాశాల విద్యార్థిని, ఆమె ప్రేమికుడు అక్కడికి చేరుకున్నారు. ఆ సమయంలో అమ్మాయి తల్లిదండ్రులు, బంధువులు ప్రేమికుడిని అడ్డగించి దాడి చేశారు. ప్రతిగా, ప్రత్యర్థి వర్గం కూడా దాడి చేయడంతో కలకలం రేగింది. వివరాలు.. కృష్ణగిరి జిల్లా లోని పోచంపల్లి సమీపంలోని పులియాండపట్టి గ్రామానికి చెందిన సదాశివం కుమారుడు వేలు(23). ఇతను పోచంపల్లి సిబ్ కాట్ లోని ఓ ప్రైవేట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. ధర్మపురి జిల్లా అడియమాన్ కొట్టాయి కెట్టుపట్టి గ్రామానికి చెందిన తిరుపతి కుమార్తె జ్యోతిలక్ష్మి(20) ధర్మపురి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో బీఏ ఇంగ్లిష్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది.
జ్యోతిలక్ష్మి ఆలయ ఉత్సవాల్లో పాల్గొనేందుకు పులియండపట్టిలోని బంధువుల ఇంటికి వచ్చినప్పుడు వేలుతో పరిచయం ఏర్పడి ప్రేమలో పడింది. జ్యోతిలక్ష్మి తల్లిదండ్రులు వారి ప్రేమను వ్యతిరేకించారు. ఆమెకు వేరే వ్యక్తితో వివాహం చేసేందుకు యతి్నంచారు. జ్యోతిలక్ష్మి దానిని వ్యతిరేకించింది. దీంతో ఆమెను ఇంట్లో ప్రత్యేక గదిలో బంధించినట్లు తెలుస్తుంది. ఈ స్థితిలో వేసవి సెలవులు ముగిసి 16న కళాశాల తెరిచిన తర్వాత కళాశాలకు వెళ్తున్నానని చెప్పిన జ్యోతిలక్ష్మి ఇంటికి తిరిగి రాలేదు. ఇది తల్లిదండ్రులను దిగ్భ్రాంతికి గురిచేసింది.
చాలా చోట్ల వెతికినా కూతురు కనిపించకపోవడంతో, వారు అదియామన్కోట్టై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ సమయంలో, కనిపించకుండా పోయిన జ్యోతిలక్ష్మి సేలం వెళ్లి అక్కడి ఒక ఆలయంలో వేలును వివాహం చేసుకున్నారని, వారిద్దరూ వేలు స్నేహితుడి ఇంట్లో ఉంటున్నారని వార్తలు వచ్చాయి. ఇంతలో, పోలీసులు తన కోసం వెతుకుతున్నారని తెలిసి, జ్యోతిలక్ష్మి ఆదివారం తన భర్తతో కలిసి మాథుర్ పోలీస్ స్టేషన్కు వచ్చింది.
ఈ విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు, బంధువులు పోలీస్ స్టేషన్ ముందు గుమిగూడారు. అకస్మాత్తుగా వారు ఆ జంట ప్రయాణిస్తున్న దారిని అడ్డుకున్నారు. వేలు, అతని బంధువులను చుట్టుముట్టి వారి పై దాడి చేశారు. వారు కూడా ఎదురుదాడికి దిగారు. రెండు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను సమాధాన పరిచి కేసు విచారణ చేస్తున్నారు.