సాక్షి,చైన్నె : దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతుండగా, తంజావూరు జిల్లాలోని కుంభకోణం ఎమ్మెల్యే కార్యాలయం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించకపోవడం వివాదానికి దారితీసింది.తమిళగ వెట్రి కళగం పార్టీ తరఫున కుంభకోణం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి గెలిచి, ప్రస్తుతం వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న జి. వినోత్ కార్యాలయం ముందే ఈ నిర్లక్ష్యం వెలుగుచూసింది. ప్రతి ఏటా స్వాతంత్య్ర దినోత్సవం , గణతంత్ర దినోత్సవాల సందర్భంగా ఎమ్మెల్యే కార్యాలయం వద్ద జాతీయ పతాకాన్ని ఎగురవేసి, స్థానికులకు, పిల్లలకు మిఠాయిలు పంచడం ఆనవాయితీగా వస్తున్నది. అయితే, ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం రోజున జాతీయ జెండాను ఎగురవేయకపోవడంతో కార్యాలయం నిర్మానుష్యంగా దర్శనమిచ్చింది. ఈ ఘటన పార్టీ శ్రేణులతో పాటు సామాజిక కార్యకర్తలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
చైన్నె పర్యటనే కారణమన్న పార్టీ వర్గాలు
ఈ వివాదంపై పార్టీ ప్రతినిధులను వివరణ కోరగా... ముఖ్యమంత్రి విజయ్ సెయింట్ జార్జ్ కోట వద్ద తొలిసారిగా జాతీయ జెండాను ఎగురవేస్తున్న సందర్భంగా, మంత్రి వినోద్ను చైన్నెకి రమ్మని ఆదేశించారని, అందుకే ఆయన చైన్నె వేడుకలకు వెళ్లారని తెలిపారు. అయితే, మంత్రి లేకపోయినప్పటికీ ఇతర ప్రతినిధులు జెండా ఎగురవేసి ఉండాల్సిందని, ఒక ప్రభుత్వ కార్యాలయం వద్ద జాతీయ జెండాను ఎగురవేయడంలో విఫలం కావడంపై స్థానిక సామాజిక కార్యకర్తలు తీవ్ర విచారం, అసంతృప్తి వ్యక్తం చేశారు.


